శుక్రవారం, అక్టోబర్ 25, 2013

కలగంటి.. కలగంటి..

ఉన్నట్టుండి 'కలలు' ఇప్పుడు హాట్ టాపిక్కై కూర్చున్నాయి. నలుగురు కూచుని నవ్వే వేళ ఈ కలల విషయం గుర్తు చేసుకోవడమో, లేదంటే గుర్తు చేసుకుని మరీ నవ్వుకోవడమో జరిగిపోతోంది. నవ్విన నాప చేను పండుతుందా లేదా అన్నది చెప్పే కృషిలో నిమగ్నమై ఉంది ప్రభుత్వం. ఒకవేళ పండక పొతే మాత్రం ఏమయ్యింది, కల పేరు చెప్పుకుని ఇప్పటికే చాలామంది జనం వాళ్ళ కష్టాలన్నీ కాసేపు మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వుకుంటున్నారు కాదూ. పండిందే అనుకుందాం.. ప్రజలందరూ సాధ్యమైనంత సేపు నిద్దరోయి మరిన్ని కలలు కనేందుకు పక్కలు సిద్ధం చేసుకుంటారు.

కలలు అందరూ కంటారు.. వీటి హేతువుల జోలికి వెళ్లొద్దు మనం. రాజకీయనాయకులు ఉన్నారు చూడండి, వీళ్ళు కొన్నాళ్ళ క్రితం వరకూ ఓటర్లని పగటి కలల్లో ముంచి తేల్చేసి పబ్బం గడిపేసుకునే వాళ్ళు. రానురానూ, కలలు కనే ఓపిక లేకా, కనడానికి కావలసినంత నిద్ర పట్టే పరిస్థితులు కనిపించకా జనం సదరు నాయకులని నమ్మడం మానేశారు. కానైతే, నమ్మినట్టు నటించడం మాత్రం మర్చిపోవడం లేదు. ఇన్నాళ్ళూ తాడిన తన్నిన నాయకులకి, తలదన్నే వాళ్ళు పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయాలు వెతుక్కోక తప్పని పరిస్థితి వచ్చేసింది.

రాష్ట్రపతి పదవికి ఓ కొత్త గౌరవం తెచ్చిన టెక్నోక్రాట్ అబ్దుల్ కలాం పిల్లలు, యువకులతో ఎప్పుడు మాట్లాడినా వాళ్ళని కలలు కనమనీ, వాటిని నిజం చేసుకోడానికి శ్రమించమనీ చెబుతారు. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను, అంతపెద్ద హోదాకి ఎదగడానికి జీవితంలో పైకి ఎదగాలన్న కలలు ఎంతగానో దోహదం చేశాయని చాలాసార్లే చెప్పారు వివరంగా. ఆయన మాటల్లోంచి నిద్రపొమ్మని అర్ధం తీసుకున్న కొందరు మాత్రం, "కలాం గారు ఏమన్నారు? కలలు కనమన్నారు.." అంటూ వ్యంగ్య భాష్యాలు మొదలుపెట్టారు. ఇందులో కూడా అవకాశం వెతుక్కున్న మన నాయకులు మాత్రం, "కలాం గారు కూడా కలలు కనమనే చెప్పారు" అని కొత్తపాట అందుకున్నారు.

కేంద్రంలో వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూటమికి సమస్యలు రోజు రోజుకీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అవినీతి ఆరోపణలు ఓ పక్కా, రోజు రోజుకీ క్షీణిస్తున్న రూపాయి ఆరోగ్యం మరోపక్కా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఎన్నికలు దగ్గరకి వచ్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ గండాలని గట్టెక్కించే తరుణోపాయాలు ఏమిటన్న విషయం మీద కాంగ్రెసు నాయకత్వం దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. కాలం బొత్తిగా కలిసి రాకపోవడం వల్ల కాబోలు, ఉల్లిపాయ సైతం బాంబుగా మారి తను పేలడమో, ప్రభుత్వాన్ని పేల్చడమో చేసేసేలా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో, అల్లక్కడెక్కడో ఉండే ఓ సాధు పుంగవుడు ఓ ధగధ్ధగాయమానమైన కలగన్నాడు. ఒకటీ రెండూ కాదు, వేలాది బంగారు నాణేలు ఆ కలనిండా.. కేవలం నాణేలు మాత్రమే కాకుండా, అవి దొరికే చోటు కూడా స్పష్టంగా కనిపించడంతో ఈ కల సంగతిని ఓ రాజకీయ నాయకుడి చెవిన వేశాడు. ఇంకేముందీ, తవ్వకాలు మొదలయ్యాయి. ప్రభుత్వం కూడా తవ్వితే పోయేదేముందనుకుంది. నిజమే, బంగారం దొరికిందా.. డబ్బుతో ముడిపడ్డ కొన్ని సమస్యలైనా తీరొచ్చు. దొరకలేదూ.. కొన్నాళ్ళ పాటు జనం మాట్లాడుకోడానికి ఓ టాపిక్ దొరుకుతుంది. వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళని ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కాలం గడపగలరు పాపం.

ఏలినవారి అంచనా ఏమాత్రం తప్పలేదు.. ఓ పక్క ఆ ఫలానీ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతూ ఉండగానే, దేశానికి మరోమూల ఉన్న ఇంకో సాధు సామ్రాట్టు సైతం ఓ బంగారు కలగన్నాడు. పలుగులూ, పారలూ సిద్ధం. జన సామాన్యానిది నిద్ర అయితే, సాధువులది యోగనిద్ర అని కదా ప్రచారం. ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏమిటంటే, సామాన్య జనానిని మామూలు కలలైతే, సాధు జనానివి మాత్రం బంగారు కలలు. కాషాయం కట్టిన వారందరూ యోగనిద్రలోకి జారుకోడం ద్వారా, ప్రజల సంగతి ఎలా ఉన్నా, ప్రభుత్వానికి మాత్రం బాగా మేలు జరిగేలా కనిపిస్తోంది ప్రస్తుతం..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి