మంగళవారం, డిసెంబర్ 24, 2013

నాయికలు-వరూధిని

కంటినిండా కలలు నింపుకుని ప్రపంచాన్ని చూడాల్సిన యవ్వనంలో ఆమె కష్టాలనీ, కన్నీళ్ళనీ చూసింది. ఒకప్పుడు వైభవంగా బతికిన తన కుటుంబం, దారిద్ర్యపు అంచులలో నిలబడడాన్ని చూసింది. తోడబుట్టిన వాళ్ళ స్వార్దాన్నీ, కన్నవాళ్ళ నిస్సహాయతనీ కళ్ళారా చూసింది. మిగిలిన తోబుట్టువుల అందరి పెళ్ళిళ్ళూ అంగరంగ వైభవంగా చేసిన తండ్రి, తన దగ్గరికి వచ్చేసరికి కనీసం అయినింటి సంబంధం వెతకడానికి కూడా తటపటాయించడాన్ని మౌనంగా గమనించింది.. అలాంటి ఆమెకి కూడా ఒక రోజు వచ్చింది.. ఓ కుటుంబాన్ని శాసించగలిగే స్థాయి వచ్చింది.. అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? ఆమె చేతిలో కీలుబొమ్మగా మారిన ఆ కుటుంబం ఏమయ్యింది? ఈ ప్రశ్నలకి జవాబులు వెతుక్కోడానికి ముందు ఆమెని గురించి తెలుసుకోవాలి. ఆమె పేరు వరూధిని.

వ్యవసాయ రంగాన్ని ఇతివృత్తంగా తీసుకుని నాలుగున్నర దశాబ్దాల క్రితం డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రాసిన నవల 'మట్టిమనిషి' లో నాయిక వరూధిని. గుంటూరు జిల్లాలో ఉన్న ఓ పల్లెటూళ్ళో భూస్వామ్య కుటుంబంలో పుట్టింది. తండ్రి బలరామయ్య ఆ ఊరికంతటికీ పెద్దమనిషి. చదువు, ఆటపాటలతోనూ, సినిమాలు, షికార్లతోనూ బాల్యం ఆనందంగా గడిచింది వరూధినికి. యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉండగానే పట్నవాసంతో పూర్తిగా ప్రేమలో పడిపోయింది ఆమె. పరిస్థితులు అనుకూలిస్తే, పట్నంలో ఉన్న ఏ గొప్ప ఇంటికో ఆమె కోడలయి ఉండేది. కానీ, అలా జరగలేదు. వరూధినికి పెళ్లివయసు వచ్చేసరికి ఆ కుటుంబం ఆర్ధిక పరిస్థితి పూర్తిగా తిరగబడి పోయింది. అన్నలు ఆస్తులని మాత్రమే పంచుకుని, ఆమె పెళ్లిని తండ్రి బాధ్యతల్లోకి నెట్టేశారు.

పేరులో మాత్రమే జమీందారీని నిలుపుకున్న బలరామయ్యతో వియ్యమందడానికి జమీందార్లు ఎవరూ సిద్ధంగా లేరు. కాబట్టే, తన కూతుర్ని ఊరుబోయిన వెంకయ్య మనవడు, సాంబయ్య కొడుకు అయిన వెంకటపతి కి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి సిద్ధ పడ్డాడు బలరామయ్య. వెంకయ్య ఆ ఊరికి వ్యవసాయ కూలీగా వచ్చి, బలరామయ్య తండ్రి వీరభద్రయ్య ఇంట పాలేరుగా జీవితం మొదలు పెట్టాడు. నెమ్మదిగా రైతుగా ఎదిగాడు. అతని కొడుకు సాంబయ్య రెక్కల కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఇంచుమించు ఓ వంద ఎకరాల భూమిని కొడుకు వెంకటపతి కి వారసత్వంగా అందించాడు. వెంకటపతికి పెద్ద మొత్తంలో కట్న కానుకలతో పిల్లనిస్తామంటూ ఎన్నో సంబంధాలు వచ్చినా, వాటన్నింటినీ రెండో ఆలోచన లేకుండా తిరగ్గొట్టేశాడు సాంబయ్య. తన తండ్రి పాలేరుగా పనిచేసిన ఇంటినుంచే కోడల్ని తెచ్చుకోవలన్నది సాంబయ్య పట్టుదల.

వెంకటపతి మొరటు మనిషి. చదువూ సంధ్యా లేనివాడు. తాతతండ్రుల బాటలో నేలని మాత్రమే నమ్ముకున్నాడు. పట్నవాసం అంటే ఏమిటో బొత్తిగా తెలియదు అతనికి. ఉండడానికి లంకంత ఇల్లు ఉన్నా, వెంకటపతి పుడుతూనే అతని తల్లి దుర్గమ్మ మరణించడం, సాంబయ్య మరో పెళ్లి చేసుకోకపోవడంతో అది ఆడదిక్కు లేని సంసారం. అలాంటి ఇంట్లో అడుగుపెట్టింది, పట్నవాసపు వాసనలున్న వరూధిని. ఆ ఇంట్లో కోడలిగా తను ఇమిడి పోడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది. తన వల్ల ఎంతమాత్రం కాదని అర్ధం కావడంతో, నెలతప్పగానే కాపురాన్ని బస్తీకి మార్చింది. అప్పటికే వెంకటపతి వరూధిని చేతిలో కీలుబొమ్మ. పెళ్ళికి ముందు వరకూ తండ్రిమాట వేదవాక్కు వెంకటపతికి. అతను తనకంటూ సొంత ఆలోచనలు లేని వాడు కావడంతో, వెంకటపతిని తన దారికి తెచ్చుకోడం పెద్ద కష్టం కాలేదు వరూధినికి.

బస్తీలో, సినిమా హాల్ యజమాని రామనాధ బాబుతో స్నేహం మొదలుపెట్టింది వరూధిని. ఆ స్నేహం, అతని భాగస్వామ్యంతో బస్తీలో కొత్త సినిమా హాల్ కట్టేంత వరకూ వెళ్ళింది. వెంకయ్య, సాంబయ్యల చెమట, బస్తీలో సినిమా హాలుగా రూపాంతరం చెందింది. సాంబయ్య, వెంకటపతి ల మధ్య అంతరం మరింతగా పెరిగింది. మట్టి ఆనుపానులు మాత్రమే తెలిసిన వెంకటపతికి బస్తీలో చేసేందుకు ఏపనీ లేదు. రామనాధ బాబు ప్రోత్సాహంతో తాగుడికి అలవాటు పడ్డాడు. ఇంటి పెత్తనం మొత్తం వరూధినిదే అయ్యింది. రామనాధ బాబుతో ఆమె స్నేహం చాలా దూరమే వెళ్ళింది. వయసు మీద పడ్డ సాంబయ్య పల్లెటూరికే పరిమితం అయిపోయాడు. వెంకటపతిది కేవలం వరూధిని భర్త హోదా మాత్రమే. అటు వ్యాపార వ్యవహారాల్లోనూ, ఇటు ఇంటి విషయాల్లోనూ నిర్ణయాలు రామనాధ బాబువే. అలాంటి రామనాధ బాబు, తనకి దూరం అవుతున్నాడు అని తెలిసినప్పుడు వరూధిని ఏం చేసింది?

'రెండు తరాల మధ్య అందమైన వారధి స్త్రీమూర్తి' అంటారు గొల్లపూడి మారుతిరావు తన 'సాయంకాలమైంది' నవలలో. వరూధిని, మట్టిమనిషి సాంబయ్యకి, అతని మనవడు రవి కి మధ్య వారధిగా నిలబడింది. అటు సాంబయ్య ని, ఇటు వెంకటపతిని వాళ్ళు నమ్ముకున్న మట్టికి దూరం చేసింది. "ఎందుకు?" అన్న ప్రశ్న ఎప్పుడూ రాదు, 'మట్టిమనిషి' చదువుతూ ఉంటే. ఎందుకంటే, వరూధినికి ఆ క్షణంలో తనకి అనిపించింది చేయడం తప్ప దీర్ఘ కాలికమైన ప్రణాళికలు అంటూ లేవు. తనకి నచ్చినట్టు జీవించడానికే ఆమె వోటు. తనని కట్టుకున్నవాడి మీద జాలి, తను కన్నవాడి పట్ల బాధ్యత ఇవి మాత్రమే ఆమె దగ్గర ఉన్నవి. అందుకే, తను నమ్ముకున్న వాడు తనని నిలువుగా ముంచేయడానికి సిద్ధపడినప్పుడు, ఆమె మొదట ఆగ్రహించింది, అటుపై ప్రతీకారానికి సిద్ధపడింది.. కానీ, అతనిమీద ఆమెకి ఉన్న ప్రేమదే పైచేయి అయ్యింది.. 'మట్టిమనిషి' చదువుతూ ఉంటే, వరూధిని నాయికా? లేక ప్రతినాయికా? అన్న సందేహం చాలాసార్లే కలుగుతుంది.. వరూధిని కోణం నుంచి చూసినప్పుడు, ఆమె నాయికే..

2 కామెంట్‌లు:

  1. ఎందుకో తెలియదు ఈ వరూధిని ఎప్పుడూ నన్ను వెంటాడుతుంది ....ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా మంది ఆడవాళ్ళలో వరూధిని ఆనవాళ్ళు చూసాను ...మీరు అన్నట్టు వరూధిని కోణంలో ఆమె నాయకే ..రెండు తరాల వారధి ఈ ఆడది ....

    రిప్లయితొలగించండి
  2. @ప్రియ కారుమంచి: అవునండీ.. ఇన్నేళ్ళ తర్వాత వరూధిని మళ్ళీ సాహితీ చర్చల్లోకి వస్తోంది, పూర్తిగా మరో కారణానికి!! ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి