మంగళవారం, డిసెంబర్ 30, 2014

సొమ్మలు పోనాయండి

అప్పు.. కేవలం మూడొందల రూపాయల అప్పు.. దాసరి సన్యాసి కొడుకు దాసరి బోడియ్య జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఆ అప్పు కారణంగానే బోడియ్య సొమ్మలు పోనాయి, బూదేవత పోనాది, సంసారమంతా సల్లారిపోనాది. బోడియ్య చదువుకున్న వాడు కాదు. సొమ్ములున్నవాడు కాదు. బలం, బలగం ఉన్నవాడు అంతకన్నా కాదు. పైపెచ్చు, ఏనాడూ తగువులంటూ పోలీసు స్టేషన్లంట, కోర్టుల వెంట తిగిరినవాడూ కాదు. తనపనేదో తను చేసుకుపోయే బోడియ్య అప్పు పుచ్చుకున్నది మామూలు వాడి దగ్గర కాదు, వాళ్ళూరి ప్రెసిడెంటు దగ్గర. అందుకే, అప్పు కారణంగా అతగాడి సొమ్మలు పోనాయి.. వాటితో పాటే అన్నీ పోనాయి.

బలమున్నవాడిదే రాజ్యం. ఆదిమ యుగాల్లో లిఖితంగా (అనగా సర్వజనామోదంగా) ఉన్న ఈ నీతి, ఆధునిక ప్రజాస్వామిక యుగం నాటికి కూడా చెలామణిలోనే ఉంది -- కాకపోతే అలిఖితంగా. దీనితో పాటే, పిల్లిని గదిలో బంధించి కొడితే పులిగా మారుతుందన్న జంతుధర్మం ఉండనే ఉంది. ఈ రెంటినీ ఆధారంగా చేసుకుని ఉత్తరాంధ్ర ప్లీడరు గారైన రాచకొండ విశ్వనాథ శాస్త్రి సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం రాసిన నవలికే 'సొమ్మలు పోనాయండి.' చాలామంది సాహిత్యాభిమానులు సైతం నేటికీ 'సొమ్ములు' అని పొరబడుతూ ఉంటారు. కానీ కాదు, సొమ్మలే. అంటే పశువులు. బోడియ్య భాషలో 'జెత పోతులండి.'

"సొమ్మలు పోనాయండి. అదండి! అది ఆరాంబవండి. జెత పోతులండి. జెనం నిలబడి సూసీవోరండి. అలాంటి సొమ్మలండి. పోనాయండి.." అంటూ మొదలుపెట్టి బోడియ్య తన కథ మొత్తం ఏకబిగిన చెబుతాడు, ఎక్కడా అలుపు తీర్చుకోడానికి కూడా క్షణం ఆగకుండా. పాఠకులు సర్వం మరిచి, చివరికి ఊ కొట్టడం కూడా మరిచి వింటూ ఉండిపోతారు. ఈ వింటున్న క్రమంలో బోడియ్య అమాయకత్వానికి నవ్వొస్తుంది. అతనికి కష్టం కలిగినప్పుడు అయ్యో అనిపిస్తుంది. కళ్ళెదురుగానే అతనికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆవేశం వస్తుంది. బలమైన శత్రువు ఆ బలహీనుడి మీద ముప్పేట దాడి చేసినప్పుడు రౌద్రం కలుగుతుంది. అన్నింటినీ మించి బోడియ్య పట్టుదలకి శెభాష్ అనాలనిపిస్తుంది.

ఊరి ప్రెసిడెంట్ దగ్గర మూడొందల రూపాయలు అప్పు చేసి, అందుకు గాను ఆరొందల రూపాయలకి కరణం రాసిన నోటు మీద వేలిముద్దరేసి, ఆ సొమ్ముతో తుంపాల సంతలో జెత పోతుల్ని కొంటాడు బోడియ్య. సంక్రమణం వెళ్ళిన ఐదోనాడు కొన్న ఆ పోతులు శివరాత్రి వెళ్ళిన నాలుగో నాడు కనిపించకుండా పోయాయి. ఎక్కడ వెతికినా ఉపయోగం ఉండదు. సొమ్మలు పోయిన పదో రోజున ప్రెసిడెంట్ నుంచి కబురొస్తుంది బోడియ్యకి. ప్రోనోటు ప్రకారం ఆరొందల రూపాయలు బాకీ చెల్లించమని. "తాటిపండు దెబ్బకే నాను లెగలేపోతుంటే మరింక పిడుగు దెబ్బకి నానింకేటి తట్టుకోగల్నండి?!" అని అడుగుతాడు బోడియ్య, పాఠకులని.


వారం రోజుల్లో ఆరొందలు వ్యాపగించడం తనవల్ల కాలేదు బోడియ్యకి. బోడియ్య భార్య సంద్రం ఊరుకోలేదు. వీధిలో ప్రెసిడెంట్ ఇంటి ఎదురుగా నిలబడి తిట్లు అందుకుంది. ప్రెసిడెంట్ బయటికి రాలేదు కానీ అతని అన్న కొడుకు మిరపకాయల చిన్నారావు సంద్రం మీద చెయ్యి చేసుకున్నాడు. ఆమె చీరలాగి అల్లరిపెట్టాడు. దారే వెడుతున్న సూరప్పడి చేతిలో ఉన్న చేపాటి కర్ర అందుకుని చిన్నారావుకి రెండు తగల్నిచ్చాడు బోడియ్య. ప్రెసిడెంట్ మనుషులు బోడియ్య తల పగలగొట్టారు. తగువు పంచాయితీకి వెళ్ళింది. తగు మాత్రం పెద్దమనుషులు ఎవరున్నారక్కడ? ఉన్నవాళ్ళంతా ప్రెసిడెంట్ కి వత్తాసు పలికిన వాళ్ళే. బోడియ్య కొట్టిన దెబ్బలకీ, బోడియ్యకి తగిలిన దెబ్బలకీ చెల్లుకి చెల్లు అన్నారు.

పది రోజుల పాటు అంతా ప్రశాంతంగానే ఉంది. ఆ గొడవ అక్కడితో అయిపోయిందనే అనుకున్నాడు బోడియ్య. కానీ, పదకొండో రోజున పోలీస్ జవాను వచ్చాడు. బోడియ్య, సంద్రంతో పాటు ఈ గొడవకి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ పదహారేళ్ళ కూతురు చిలకని కూడా చలచల్లని మాటలు చెబుతూ పోలీసు స్టేషన్కి తీసుకెళ్ళి పోయాడు. పదిరోజుల్నాడు జరిగిన జరిగిన గొడవలో చిన్నారావు చిటికెన వేలు చితికిపోయింది. వీళ్ళు ముగ్గురూ ముద్దాయిలు. బావమరిది, జగిలీడు (తోడల్లుడు) తోడొచ్చారు బోడియ్యకి. వాళ్ళూ అంతంత మాత్రం వాళ్ళే.

అయితే, ప్రెసిడెంట్ వాళ్ళనీ వదలలేదు. బోడియ్య కుటుంబంతో పాటు వాళ్ళిద్దరి వల్లా తనకీ తన అన్న పిల్లలకీ ప్రాణ హాని ఉందని  బైండోవర్  కేసు బనాయించాడు. పులిమీద పుట్రలా భూవి జప్తు కేసు. ఆరొందల రూపాయల బాకీ చెల్లించలేదు కాబట్టి, బోడియ్యకున్న నలభై సెంట్ల భూవీ ఏల జప్తు చేయరాదంటూ సర్కారు వారి నోటీసు. ఇవన్నీ జరుగుతూ ఉండగానే సొమ్మల్ని ప్రెసిడెంటే కాజేసేడని తెలుస్తుంది బోడియ్యకి. పోలీసుల చుట్టూ, కోర్టుల వెంటా తిరగడంలో కూతురు చిలకని కోల్పోతాడు బోడియ్య. జగిలీడు భయపడి ప్రెసిడెంట్ వైపు తిరిగిపోతాడు.

ఎన్ని సమస్యలు వచ్చినా ప్రెసిడెంట్ కాళ్ళ కిందకి వెళ్లరాదన్నది బోడియ్య పంతం. అతనికి తగ్గ ఇల్లాలు సంద్రం. చివరివరకూ నిలబడినవాడు బావమరిది. ఇంతకీ, ప్రెసిడెంట్ బోడియ్య మీద ఎందుకింత కక్ష కట్టాడు? ఈ కేసుల్లోనుంచి బోడియ్య బయట పడ్డాడా లేదా? తనని ముప్పు తిప్పలు పెట్టిన ప్రెసిడెంట్ మీద ప్రతీకారం తీర్చుకున్నాడా?? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబిస్తూ ముగుస్తుంది 'సొమ్మలు పోనాయండి.' ఆద్యంతమూ రావిశాస్త్రి మార్కు ఉపమానాలతో సాగే కథనం ఊపిరి బిగపట్టి చదివిస్తుంది. పుస్తకం చదువుతున్నప్పుడే కాదు, పూర్తి చేసి పక్కన పెట్టాక కూడా ఎన్నో ప్రశ్నలు వెంటాడతాయి. 'మనసు' ఫౌండేషన్ ప్రచురించిన 'రావిశాస్త్రి రచనా సాగరం' లో చదవచ్చీ నవలికని.

సోమవారం, డిసెంబర్ 29, 2014

విశ్వనాథుని 'ఏకవీర'

ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరు రాచ బిడ్డ, మరొకరు సాధారణ రైతు పుత్రుడు. ఆర్ధిక తారతమ్యాలు వాళ్ళిద్దరి స్నేహానికీ ఏమాత్రం అడ్డుగోడలు కాలేదు. వాళ్ళ మధ్య రహస్యమన్నది లేదు. పైగా, ఎవరికి పట్టరాని దుఃఖం కలిగినా నిస్సంకోచంగా రెండోవారి భుజం మీద తలవాల్చి కన్నీళ్లు పెట్టుకోగలరు. ఇద్దరూ ప్రేమలో పడి, విఫలమయ్యారు. తర్వాత ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. దురదృష్టం, అక్కడ కూడా వైఫల్యమే పలకరించింది వారిని. వాళ్ళిద్దరితో పాటు, వాళ్ళని ప్రేమించిన అమ్మాయిలు, పెళ్ళాడిన యువతుల కథ ఏ తీరం చేరిందన్నదే 'కవిసమ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ రచించిన 'ఏకవీర' నవల.

విశ్వనాథ నవలల్లో నాకు 'ఏకవీర' అంటే ఓ ప్రత్యేకమైన ఇష్టం. ఎంత అంటే, ఇదే కథతో ఇదే పేరుతో ఎన్టీఆర్-కాంతారావు కథానాయకులుగా సినిమా వచ్చినా ఇప్పటివరకూ ఆ సినిమాని చూడనంత. 'అంతరాత్మ' తో నవలా రచన ప్రారంభించిన విశ్వనాథ రాసిన రెండో నవల ఇది. అంతే కాదు, ఆయన తన స్వదస్తూరీతో రాసిన ఏకైక నవల. మిగిలినవన్నీ ఆయన ఆశువుగా చెబుతూ ఉంటే వేరెవరో అక్షరబద్ధం చేసినవే. ముత్తు కృష్ణప్ప నాయకుడు మధురని పాలించే కాలం నాటి కథ ఇది. నాయక మహారాజు గారి ప్రధాన మంత్రులలో ఒకడైన ఉదయన్ సేతుపతి కుమారుడు కుట్టాన్ సేతుపతి, సామాన్యుడైన అతని స్నేహితుడు వీర భూపతిల జీవితాన్ని చిత్రించారీ నవలలో.

కథ వైగై నది ఒడ్డున మొదలై, ఆ ఇసుక తిన్నెలలోనే ముగింపుకి చేరుకుంటుంది. వైగై నది వర్ణనతో ఆరంభమయ్యే నవలలో మొదట కుట్టాన్ సేతుపతి పాత్ర ప్రవేశిస్తుంది. కుట్టాన్ తన విషాదాన్ని వీరభూపతితో పంచుకోవడం, అది విన్న వీరభూపతి తనకి కూడా అలాంటి కథే ఉందని చెప్పడంతో మొదలయ్యే 'తర్వాత ఏమయింది?' అన్న ఆసక్తి నవల ఆసాంతమూ కొనసాగుతుంది. కథా ప్రారంభానికి మూడునెలల క్రితం కుట్టాన్ కి 'ఏకవీర' తో వివాహం జరిగింది. కానీ, వారిద్దరూ అపరిచితుల్లాగే మసలుతున్నారు. కారణం, కుట్టాన్ తను ప్రేమించిన మీనాక్షిని మర్చిపోలేకపోవడం. అంతస్తుల అంతరం కారణంగా మీనాక్షితో పెళ్ళికి ఉదయన్ సేతుపతి అంగీకరించలేదు.


నిజానికి ఏకవీర కూడా వివాహానికి పూర్వం ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతన్ని మర్చిపోయి, కుట్టాన్ ని ప్రేమించాలన్న ఆమె ప్రయత్నానికి అతని నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇక, వీరభూపతిదో చిత్రమైన కథ. అతనో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయికీ అతనంటే ఇష్టమే. ఆమె చాలా గొప్పింటి పిల్ల. పునుగు, కస్తూరీ పూసిన భూర్జ పత్రం మీద ఇతగాడితో ప్రేమలేఖ రాసి, పూలదండలో చుట్టి అతనిమీదికి విసురుతుంది కూడా. ఏం లాభం? సుగంధ ద్రవ్యాల సువాసనల కారణంగా ప్రేమలేఖ విషయం అతని తల్లిదండ్రులకి తెలిసిపోతుంది. గొప్పవాళ్ళ మీదుండే భయం చేత, ఆ అమ్మాయిని మరచిపోతానని ఒట్టు పెట్టించుకుంటారు కొడుకుచేత. ఒట్టైతే వేశాడు కానీ, వీరభూపతి ఆమెని కల్లో కూడా మర్చిపోలేక పోతున్నాడు.

కుట్టాన్ నిరాదరణ కారణంగా ఏకవీరకి తను ప్రేమించిన వాడు పదేపదే గుర్తొస్తున్నాడు. కనీసం అతని పేరన్నా తెలియదామెకి. తెలిసిందల్లా అతడు రాజపుత్రుడు కాడనీ, ఓ సామాన్య కుటుంబీకుడు మాత్రమే అని. తన దురదృష్టానికి చింతిస్తూ కాలం గడుపుతూ ఉంటుందామె. కుట్టాన్ సాయంతో రాజాస్థానంలో కొలువు సంపాదించుకుంటాడు వీరభూపతి. తల్లిదండ్రులు అతనికి వివాహం జరిపిస్తారు. గతాన్ని మర్చిపోదామనుకున్న వీరభూపతికి భార్య నుండి నిరాదరణ ఎదురవుతుంది. ఈ సంగతిని కుట్టాన్ తో పంచుకుంటాడతడు. సంభాషణలో వీరభూపతి వివాహమాడిన వనిత - కుట్టాన్ ప్రేమించిన - మీనాక్షి అని తెలుస్తుంది స్నేహితులిద్దరికీ. ఏకవీర, మీనాక్షి, కుట్టాన్, వీరభూపతుల కథ వైగై తీరంలో ఎలా ముగిసిందన్నదే 'ఏకవీర' నవల.

ఆపకుండా చదివించే కథనం ఈ నవల ప్రత్యేకత. అయితే, రాజపుత్రుడు, ధీరోదాత్తుడు అయిన కుట్టాన్ పదేపదే కన్నీళ్లు పెట్టుకోవడం మింగుడు పడదు. అలాగే మీనాక్షి పాత్ర చిత్రణకి సంబంధించి కొన్ని సందేహాలు మిగిలిపోతాయి. నవలంతా వర్ణనల మయం. సర్పాలంటే అత్యంత అభిమానం విశ్వనాథకి. నిద్రపోతున్న ఏకవీరని గోధుమ వన్నె త్రాచు తో పోల్చడం మొదలుకొని, రస చిత్రణలో అనేకచోట్ల సర్పాన్ని ప్రతీకగా వాడుకున్నారు. ఈ నవలలోని 'అమృతం' అనే చిన్న పాత్ర 'వేయిపడగలు' నాటికి 'గణాచారి' గా మారినట్టు అనిపిస్తుంది. కూచిపూడి భామాకలాపాన్ని నవల ముగింపు సన్నివేశంలో బహు చక్కగా ఉపయోగించుకున్నారు. తనే స్వయంగా రాయడం వల్ల కాబోలు, నవలని విస్తరించకుండా 124 పేజీల్లో క్లుప్తంగా ముగించారు విశ్వనాథ. 'ఏకవీర' విడిగా లభించడం లేదు. విశ్వనాథ సమగ్ర సాహిత్య గ్రంధావళి (118 పుస్తకాలు, వెల రూ. 8,282/-) లో లభ్యం.

మంగళవారం, డిసెంబర్ 23, 2014

పతంజలి లేని అలమండ-2

(మొదటిభాగం తరువాత...)

కారు చాలా నెమ్మదిగా కదులుతోంది. ఇంత చిన్న ఊళ్ళో ఓ  ఇంటిని పట్టుకోలేక పోవడం ఏమిటన్న  పట్టుదల పెరిగినట్టుంది శ్రీకాంత్ కి. రోడ్డుకి రెండు వైపులా పరిశీలిస్తూ తాపీగా డ్రైవ్ చేస్తున్నాడు. కుడి వైపుకి చూస్తే రోడ్డుకి ఆనుకుని ఉన్న బాగా పాతకాలం నాటి దేవాలయం. కొత్తగా సున్నం వేశారు కాబోలు తళతళా మెరిసిపోతోంది. చుట్టూ ప్రహరీ, మధ్యలో పెద్ద ఖాళీ స్థలం. పెద్దావిడ చెప్పిన సంతబయలు అదే!! ఆవరణలో ఓ పక్క రావి చెట్టు కనిపించింది. కళ్ళు సంతబయలుని చూస్తున్నాయి. మనసులో ఓ పక్క దొమ్మీ యుద్ధం సినిమా రీల్లాగా గిరగిరా తిరుగుతోంది. మరోపక్క పతంజలి ఇల్లు ఎలా ఉండబోతోందో అన్న ఆలోచనలు.


శ్రీకాంత్ కి కూడా కుతూహలం పెరిగినట్టుంది. రోడ్డుకి రెండువైపులా పాతకాలపు ఇళ్ళేమన్నా కనిపిస్తాయా అని శ్రద్ధగా గమనిస్తున్నాడు. పెద్దావిడ 'కుడి వైపున' అని స్పష్టంగా చెప్పింది కానీ, ఎడంవైపున ఓ శిధిలావస్థలో ఉన్న ఇల్లు కనిపించగానే కారాపమన్నాను. రోడ్డునానుకుని ఉన్న ఇల్లు బాగా పాడైపోయింది కానీ, వెనుకగా ఉన్న ఓ ఇల్లు వాసయోగ్యంగా ఉండడమే కాదు అక్కడ మనుషుల అలికిడి కూడా కనిపించింది. ఆ ఇంటివైపు గబగబా నడిచాను. రాజుల లోగిలని ఎవరూ చెప్పకుండానే అర్ధమైపోయింది. వీధరుగు నిండా టేకు మానులు, కొమ్మలు సైజుల ప్రకారం కోసినవి అమర్చి ఉన్నాయి. తలుపు తీసే ఉంది కానీ, గుమ్మానికి తెర వేలాడుతోంది. తెరవెనుక గచ్చునేల పాలు ఒలికిపోతే ఎత్తుకోగలిగేలా ఉంది.


"ఎవరండీ ఇంట్లో.."  నా గొంతు నాకే కొత్తగా వినిపించింది. "వస్తున్నా" అంటూ వినిపించింది లోపలినుంచి. ఆ మాటతో పాటే ఓ స్త్రీ నడిచి వస్తున్న నగల చప్పుడు. రాణివాసపు ఘోషా స్త్రీ.. నాతో మాట్లాడతారో లేదో అని సందేహిస్తూ ఉండగానే, నన్ను రక్షిస్తూ మా వాళ్ళు వచ్చేశారు. ఆవిడ తెరవెనుక నిలబడ్డారు. ఆడవాళ్ళ మధ్య సంభాషణ జరిగింది. శిధిలావస్థ లో ఉన్న ఇంటి పక్కన ఓ తోట ఉంది. ఆ తోటకి ఎదురుగా ఉన్న ప్రహరీ ఇల్లే పతంజలిది. రోడ్డు మీదకి ఇల్లు కనిపించదనీ, గేటు దాటి బాగా లోపలికి వెళ్లాలనీ చెబుతూనే, గేటుకి తాళం ఉంటుందని చెప్పారావిడ. మొన్నటి తుపానుకి (హుద్ హుద్) టేకు చెట్లన్నీ పడిపోయాయనీ, ముక్కలు కోయించి పెట్టామనీ కూడా చెప్పారు. "మీ పేరేవిటండీ" అన్న మావాళ్ళ ప్రశ్నకి "ఉప్పలపాటోరి కోడల్నమ్మా" అని మాత్రం జవాబిచ్చి, నగలు చప్పుడవుతూ ఉండగా ఇంట్లోకి వెళ్ళిపోయారు.


వచ్చేశాం పతంజలి ఇంటికి. గుండె గొంతుకులోన కొట్టాడడం అంటే ఇదేనా? లోపలేదో విస్పోటనం లాంటిది జరుగుతోంది. ఏవిటీ ఉద్వేగం? కళ్ళలోనుంచి నీళ్ళెందుకు రావు?? ప్రహరీ గోడకి ఓ పెద్ద ఇనుపగేటు. ఆ గేటుకి తాళం. లోపలంతా జీబురు జీబురుగా.. కళ్ళు చికిలించుకుని బాగా లోపలికి చూస్తే దూరంగా, ఠీవిగా నిలబడ్డ పాతకాలం నాటి ఇల్లు. కొంత భాగం కూలిపోవడం తెలుస్తోంది. ఆవరణంతా పెద్ద పెద్ద చెట్లు. ఎక్కువగా మావిడి చెట్లే. వాటి రాలిన ఆకులతో పాటు, బాగా పెరిగిపోయిన గడ్డి నేలని కమ్మేసింది. "నేను ఆ తరంలో పుట్టాను" అని ఓ తరమంతా గర్వంగా చెప్పుకోగలిగే రచయిత తన బాల్యాన్ని గడిపింది ఇక్కడేనా?! నిజంగా ఇది పతంజలి ఇల్లేనా?? నా ఆలోచనల్లో నేనుండగానే కర్ర సాయంతో రోడ్డు మీద నడిచి వెళ్తున్న ఓ వృద్ధుడు మమ్మల్ని చూసి ఆగాడు. గోపాల్రాజు డాక్టర్ గారిల్లు చూడ్డానికి వచ్చామని శ్రీకాంత్ చెప్పాడతనికి.


"నానార్రైతుని.. తవరెవరూ?" తన చూపుడు వేలితో శ్రీకాంత్ పొట్టలో పొడుస్తూ అడిగాడా వృద్ధుడు. అది చూడగానే, "నువ్వెవరవోయీ? సేనాపతి అరసవిల్లివా.. రొంగలి అమ్మన్నవా లేక బిత్తిరి సోవులువా?" అని అడగాలనిపించింది. కానీ, "నానార్రైతుని" అని చాలా స్పష్టంగా ఆ ఇంటి మీద తన హక్కుని ప్రకటించుకుని, జవాబివ్వాల్సిన బాధ్యతని మా మీద పెట్టేశాడు కదా. "మీ రైతు 'మీరెవరు?' అని అడుగుతున్నాడు. ఏమని చెప్పాలి పతంజలి బాబూ? కనీసం 'రాజుల లోగిళ్ళు' అన్నా పూర్తి చేయకుండా జాతి యావత్తుకీ అన్యాయం చేసి వెళ్ళిపోయిన పతంజలికి పాఠకులం అని చెప్పాలా? చెప్పినా మీ రైతుకి అర్ధమవుతుందా??"  ...అక్కడికీ గొంతు పెగుల్చుకుని "మావు పతంజలి బావు చేయితులం" అన్నాను కానీ, నా మాట నాకే కొత్తగా వినిపించింది. ఇంతకీ ఆ రైతుకి వినిపించదట. ఆ మాటే శ్రీకాంత్ కి చెప్పి కర్ర తాటించుకుంటూ వెళ్ళిపోయాడు.


ఎదురుగా పతంజలి ఇల్లు. లోపలి వెళ్ళడానికి అడ్డుగా గేటుకి పెద్ద తాళం. ఏవిటి సాధనం? మేం ముఖాలు చూసుకుంటూ ఉండగా, "నేను ఫోటోలు తీసి పట్టుకొస్తా" అంటూ ఓ ఫోన్ అందుకుని చెంగున గోడ దూకేశాడు శ్రీకాంత్. అతగాడి ఉత్సాహం చూసి మాకు ముచ్చటేసింది కానీ, మా సంగతేవిటి? ఇంతదూరం వచ్చింది గేటుకున్న తాళం చూసి వెళ్లడానికా? గేటు వెనుకున్న సన్నాకుల మావిడిచెట్లు చూడగానే "పయిటేల" వాటికింద నిద్ర చేసే వీరబొబ్బిలి గుర్తొచ్చింది. అంతలోనే, ఓ రాత్రివేళ దివాణంలో ప్రవేశించిన దొంగాడికి అదే బొబ్బిలి కందా ఇంటికి దారి చూపించి, పోలుగు పిట్టల మాంసం కూరలో తన వాటా అడిగి పుచ్చుకున్న సంగతీ జ్ఞాపకం వచ్చేసింది. వెతికితే దివాణంలోకి ఏదో ఒక దొంగదారి దొరక్క పోతుందా?? ఉత్సాహంగా చుట్టూ చూస్తే ఓ చోట గోడ కూలిపోతే, ఒకదానిమీద ఒకటిగా రాళ్ళు అమర్చి ఖాళీని పూడ్చడం కనిపించింది. రాసోరింట్లోకి దారి దొరికేసింది!!


ఆ సాయంత్రం వేళ.. ఎండుటాకులు కాళ్ళకింద చప్పుడు చేస్తున్నాయి. దూరంగా కీచురాళ్ళ రొద వినిపిస్తోంది. ఆకులలముల చాటున పురుగూ పుట్రా ఉండొచ్చన్న జాగ్రత్త ఓ పక్కా, పతంజలి లోగిట్లో నడుస్తున్నానన్న భావన మరోపక్కా. ఎంత పెద్ద లోగిలసలు?! 'సీతమ్మ లోగిట్లో' కథ జరిగింది ఇక్కడేనా? ఒక్కో అడుగూ ముందుకు పడుతున్న కొద్దీ ఇల్లు మరింత దగ్గరగా వస్తోంది. సాక్షాత్తూ వాళ్ళ రైతే చెప్పినా సందేహమే, నిజంగా ఇది పతంజలి ఇల్లేనా?? అపనమ్మకం కాదు, ఆశ్చర్యం. ఫకీర్రాజు, చిట్టెమ్మ, మీర్జా పెదబాబు, అరసవిల్లి, వంటరాజు, గోపాత్రుడు, దుంపల దత్తుడు, ఈటె సూరి, కజ్జపు అప్పారావు, లగుడు ముత్తేల్ నాయుడు, పిల్లికళ్ళ సూరి, పాకలపాటి రంగరాజు మేష్టారు.. ఒక్కరనేమిటి? పతంజలి సృష్టించిన పాత్రలన్నీ సజీవులై ఆ ఆవరణలో తిరుగుతున్న భావన.


ముందు భాగం పైకప్పు కూలిపోయింది. నేలమీద మట్టిని తొలగిస్తే కొవ్వు గచ్చు మెరుస్తూ కనిపించింది. లోపల ఏ గదికీ తాళాల్లేవు. కొన్ని తలుపులైతే విరిగి పడిపోయాయి కూడా. తుపాను ప్రభావం కాబోలు. ఒక్కో గదినీ చూస్తుంటే మాటలకందని భావాలేవో సుళ్ళు తిరుగుతున్నాయి. ఫోటోలు తీసుకుంటూ, ఏ గది ఏమై ఉంటుందో ఊహించుకుంటూ ఉండగా.. చెదలు పట్టేసిన ఓ పుస్తకం మా వాళ్ళ కంట పడింది. పరీక్షగా చూస్తే తెలిసింది, అది 'రీడర్స్ డైజెస్ట్' అని. నిస్సంశయంగా ఇది పతంజలి ఇల్లే అనిపించిందా క్షణంలో. మండువా లోగిలి నిండా పిచ్చి మొక్కలు మొలిచిపోయి ఉన్నాయి. వాస్తు ప్రకారం ఆలోచించి, ఏ గదిని ఎందుకోసం వాడి ఉంటారో ఊహిస్తున్నాడు శ్రీకాంత్. "అప్పటి ఇల్లు కాబట్టండి.. కలపకెక్కడా చిన్న చెద కూడా లేదు చూడండి" అంటూ తను ఉత్సాహ పడుతూ మమ్మల్ని ఉత్సాహ పరుస్తున్నాడు.


రెండు చెక్క కుర్చీలు, ఓ చెక్క పెట్టి, ఓ పింగాణీ కాఫీ కప్పూ దుమ్ము కొట్టుకుపోయి కనిపించాయి. కందా ఇంట్లో గోడకి పుట్టపర్తి సాయిబాబా ఫోటో వేలాడుతోంది. ఓ పెద్దగదిని చెక్కలతో పార్టిషన్ చేసినట్టు తెలుస్తోంది. ఏమాత్రం ఆదరణ లేకపోయినా ఎంత మొండిగా నిలబడిందో కదా ఈ ఇల్లు అనిపించింది చూస్తుంటే. పతంజలిని జ్ఞాపకం చేసుకుంటూ ఇల్లంతా మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉండగా "ఈ పతంజలి ఏ విదేశంలోనో పుట్టి ఉంటే అతని పుట్టిల్లు మ్యూజియం గానూ, అతని ఊరు యాత్రా స్థలిగానూ మారి ఉండేవి కదా" అనిపించింది. "ఎక్కువరోజులుండదండి ఈ ఇల్లు" అని శ్రీకాంత్ అంటూ ఉంటే, వినడానికి బాధగా అనిపించింది. కానీ నిజం, ఇంకొంచం ఆలస్యం చేసి ఉంటే ఇల్లు పూర్తిగా శిధిలం అయిపోయి ఉండేదేమో. పతంజలి ఉండగా వచ్చి ఉంటే? "వాళ్ళు పిచ్చి వాళ్ళమ్మా" అని తన తల్లికి చెప్పి ఉండేవాడేమో, మాగురించి కూడా. వెనక్కి వెనక్కి చూసుకుంటూ లోగిలి బయటికి వస్తూ ఉండగా "ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టండి" అన్నాడు శ్రీకాంత్.

(అయిపోయింది)

సోమవారం, డిసెంబర్ 22, 2014

పతంజలి లేని అలమండ-1

విశాఖపట్నం నుంచి విజయనగరం దగ్గర పడుతూ ఉండగా పెట్రోల్ బంకు ఎదురుగా ఎడమవైపు వచ్చే రోడ్డుకి తిరిగి పది కిలోమీటర్లు లోపలికి వెళ్తే వచ్చే ఊరే అలమండ -- ఈ సమాచారం చాలదూ, పతంజలి పుట్టి పెరిగిన ఊరిని చూసిరాడానికి? పది కిలోమీటర్లు దాటినా ఎక్కడా ఊరన్నది కనిపించకపోవడంతో కారు డ్రైవర్ శ్రీకాంత్ కి కంగారు మొదలయ్యింది. రోడ్డు పక్కన నలుగురు మనుషులు కనిపించిన చోట కారాపి, అద్దం దించి "ఆల్మండ్ ఎలా వెళ్ళాలి?" అని అడుగుతూ ఉంటే నా గుండె తరుక్కుపోయింది.. "ఆల్మండ్ కాదు నాయనా.. అలమండ.. అలమండ" మనసు ఆక్రోశించింది. ముందుకెళ్ళమన్నారు వాళ్ళు.

మరో ఐదారు కిలోమీటర్లు ముందుకి సాగేసరికి పట్నపు వాసనలు ఏమాత్రం సోకని - కాస్త శుభ్రంగా ఉంటే బాగుండుననిపించే - ఓ పల్లెటూరు పలకరించింది. 'డా. అంబేద్కర్ సామాజిక భవనం, అలమండ' బోర్డు చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఆడవాళ్ళూ, పిల్లలూ ఉన్నారు రోడ్డు పక్కన. "పతంజలి గారింటికి ఎలా వెళ్ళాలి?" కించిత్తు గర్వంగా అడిగాను. వాళ్ళు చాలా అయోమయంగా చూశారు. "రాజుగారు" అని చెప్పాను. "రాసోల్లు పెదసావిడి కాడుంటారు.. ఇల్లాగ లోనికెల్లాల" కుడివైపుకి దారి చూపించారు. పెదసావిడంటే రాజులందరూ కూడి "విదండీ చంగతి.. వదండీ బోగట్టా" అని మాట్లాడుకునే చోటు కదూ. ఇద్దరు పిల్లలు ఉత్సాహంగా కారెక్కి డ్రైవరు పక్కన సెటిలయ్యారు, మాకు పెదసావిడి చూపించడం కోసం.


రెండు మలుపులు తిరిగి కారు ముందుకి సాగుతూ ఉండగా ఓ కిళ్ళీ కొట్టు దగ్గర కూర్చున్న నీర్కావి పంచె రాజుగారు కనిపించారు. "సోలెడు ముక్కు" చూసి గుర్తు పట్టేయచ్చు ఏ రాజుగారినైనా. పెదసావిట్లో ఎవరూ లేరు. "ముందలికెల్తే సూరిబాబు గోరి లోగిలొత్తాది. రాసోలందరి బోగట్టా ఆరికి తెలుసు," పిల్లలు సలహా ఇచ్చారు డ్రైవర్ కి. సూరిబాబు గారి లోగిలి ముందు కారాగింది. పాతకాలం ఇల్లు కాదు, పది పదిహేనేళ్ళ క్రితం కట్టిన మేడ. లోగిలంతా పూలమొక్కలు. ఆ మొక్కల మధ్యలో వాటికి సంరక్షణ చేస్తున్న బాగా పెద్దాయన. గేటు తీసుకుని లోపలికి వెళ్లి చొరవగా ఆయన్ని పలకరించాను, "పతంజలి గారిల్లు చూద్దామని వచ్చామండీ.." నవ్వారాయన, "పుస్తకాలు చదివి వచ్చారా?" అన్న ప్రశ్నతో పాటుగా.

నీర్కావి పంచె రాజుగారు
"ఇదే రోడ్డులో ముందుకి వెళ్ళండి రామకోవెలొస్తుంది. దాటి ముందుకి వెడితే ఓ పెద్ద నుయ్యి కనిపిస్తుంది. దాన్ని ఆనుకుని ఉన్న లోగిలే పతంజలిది. ఎవ్వరూ ఉండడం లేదక్కడ. పతంజలి అంటే ఎవరికీ తెలీదు. గోపాల్రాజు డాక్టర్ గారిల్లు అని అడగాలి," ఓపిగ్గా చెప్పారాయన. "మీరెల్లండి.. మావు ఇల్లకెల్లిపోతాం," కారు దిగి తుర్రుమన్నారు పిల్లలిద్దరూ. వాళ్లకి పతంజలి తెలియకపోవడం నిరాశ పరిచింది మావాళ్ళని. పెద రామకోవెల చూడగానే కారాపమన్నాను. మూడు గుర్రాల బీడీ కాల్చుకుంటూ, "భూవి బల్లపరుపుగా ఉన్నాది" అని చెప్పి అలమండ భూవి తగువుకి గోపాత్రుడు తెరతీసింది ఈ కోవెల దగ్గరే. కోవెలని ఆనుకునే కిళ్ళీ కొట్టు. బొబ్బిలి రాజుగారిది కానీ కాదు కదా?!! కారాగడం చూసి ఇద్దరు ముగ్గురు మనుషులు దగ్గరికొచ్చి పలకరించారు. పల్లెటూళ్ళలో ఉండే సౌకర్యం ఇదే.

పెదసావిడి
"గోపాల్రాజు డాట్టర్ గోరు కాలం సేస్సేరు.. ఆరింట్లో ఎవర్లేరిప్పుడు" అన్న సమాచారం ఇచ్చేశారు, అడక్కుండానే. "వాళ్ళబ్బాయి పతంజలి కోసం" అని చెప్పినా ఇదే జవాబొస్తుంది. అందుకే, ఏమీ మాట్లాడలేదు. అడ్రస్ దొరికిన ఆనందంలో కారు డ్రైవ్ చేసేస్తున్నాడు శ్రీకాంత్. ఎవరింటికో కాకుండా ఓ ఇల్లు చూడడం కోసం ప్రయాణం పెట్టుకునే వాళ్ళు ఉండడం, వాళ్ళు తన కార్లో ప్రయాణం చేయడం అతనిక్కాస్త థ్రిల్లింగ్ గా ఉన్నట్టుంది. కిటికీలోంచి బయటికి చూస్తే తాటి తోపులు, పూరిళ్ళు కనిపిస్తున్నాయి తప్ప గోపాల్రాజు గారి దివాణం జాడ లేదు. నాలుగు రోడ్ల కూడలిని ఆనుకుని పెద్ద నుయ్యి. అక్కడ బట్టలుతుక్కుంటున్న ఆడవాళ్ళు. అడ్రస్ తప్పు చెప్పారా? లేక మేము దారి తప్పామా??

పెద రామకోవెల
"రాజుగోర్లిల్లు ఇక్కడేటీనేవు.. అలమండ్లో ఉంటాయారి లోగిల్లు.. ఎనక్కెల్లాలి," బట్టలుతుక్కుంటున్న ఓ స్త్రీమూర్తి వింతగా చూస్తూ చెప్పింది. పాపం, ఆవిడే మా అవస్థ గమనించి పక్కనున్న ఓ ఇంటి ముందు కూర్చుని అడ్డపొగని ఆస్వాదిస్తున్న ఓ పెద్దావిడని చూపించి, "రాసోల్ల బోగట్టాలైతే ఆయమ్మి సెబుతాది" అని సలహా ఇచ్చింది. తన అడ్డపొగ తపస్సుకి భంగం కలిగించినందుకు ఏమాత్రం విసుక్కోని ఆ పెద్దావిడ, "రాజుగోరంటే ఏ రాజుగోరు? సొట్ట రాజుగోరా? పిచ్చి రాజుగోరా? గుడ్డి రాజుగోరా?" అని ప్రశ్నలు సంధిస్తూ ఉంటే, తన అత్త దేవుడమ్మకి ఔషధం కోసం ఫకీర్రాజు ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి, పెదరాజుగోరికి దొరికిపోయిన కలగాడ నాయుడు కళ్ళముందు మెదిలాడు.


"ఓయమ్మ.. ఏనాటి గోపాల్రాజోస్సి. ఆబాబు నేడు గదా.. లోగిలిగూడా ఏటీ నేదు. తిన్నగెల్తే ఇసాపట్నం. ఎల్లొచ్చీండి" సలహా చెప్పి, చుట్టని నిప్పున్న వైపు నోట్లో పెట్టుకుని కళ్ళు మూసేసుకుందావిడ. ఓపిగ్గా నిలబడితే ఓ క్షణానికి కళ్ళు తెరిచి చిత్రంగా చూసింది. "ఎనక్కెల్తే సంత బయలొత్తాది. దాటెల్తే ఒత్తాదా రాజుగోరి లోగిలి. తాలవేసేసి ఉంటాది..." ఆవిడ ఓపిగ్గా చెబుతూనే ఉంది కానీ, 'సంత బయలు' దగ్గర ఆగిపోయాన్నేను. విశ్వాసాల కోసం అలమండ ప్రజలు దొమ్మీ యుద్ధానికి సిద్ధ పడిపోయిన చారిత్రక ప్రదేశం. చూడకపోతే ఇంకేమన్నా ఉందా అసలు?!!

భూవి బల్లపరుపుగా ఉంటాదని నమ్మిన రాజుల ఫౌజు రావి చెట్టు కిందా, గుండ్రంగా ఉందని వాదించిన వెలమల జట్టు మర్రిచెట్టు కిందా జమకూడి యుద్ధం మొదలు పెట్టిన స్థలం.. రొంగలి అమ్మన్నకి అతని పెదనాన్న రొంగలి బుజ్జి అచ్చం భగవద్గీతలో శ్రీకృష్ణుడి లాగా దొమ్మీ యుద్ధం సమగ్ర సారాంశాన్ని బోధ పరిచిన చోటు... అవతలి గ్రూపులో కుక్కలేవీ లేవని 'వీరబొబ్బిలి' చింతించిన తావు.. జామి పోలీసులొచ్చి దొమ్మీ గ్రూపులు రెండిటినీ అదుపులోకి తీసేసుకుని యుద్ధం మధ్యలోనే ఆగిపోడానికీ, అటు పిమ్మట మేస్ట్రెటు గంగాధరం గారు "భూవి బల్లపరుపుగా ఉంద"ని తీర్పు చెప్పడానికి కారణమైన ఆయొక్క సంత బయలు... నా ఆలోచనల్లో నేనుండగానే, పరిస్థితి అర్ధం చేసేసుకున్న శ్రీకాంత్ కారుని రివర్స్ చేశాడు.

(ఇంకా ఉంది)

సోమవారం, డిసెంబర్ 08, 2014

నేనూ, కోనసీమా, గోదారీ ...

మన పుట్టుక మన చేతిలో ఉండదు.. మన ప్రమేయం ఉండదు.. మన నిర్ణయాల ప్రకారం ఉండదు. మనం కారణం కాని విషయాలని గురించి గర్వ పడడం అనవసరం. కానీ, కోనసీమనీ గోదారినీ తలచుకున్నప్పుడల్లా ఏదో తెలియని ఉద్వేగం. ఓవైపు గలగలా గోదారి, మరోవైపు గంభీర కెరటాల సముద్రం.. చుట్టూ ఆకుపచ్చని గొడుగులు పాతినట్టుగా ఆకాశంలో పచ్చాపచ్చని గూళ్ళు అల్లే కొబ్బరి చెట్లు.. మధ్య మధ్యలో అరటి చెట్లు, అల్లంత దూరాన సరిహద్దులు గీసే తాడిచెట్లు, పచ్చని పొలాలకి పాపిడి తీసినట్టుండే గట్లు.. వాటి వెంబడి పూల మొక్కలూ, పళ్ళ చెట్లూ.. ఎంత భాష సరిపోతుంది కోనసీమని వర్ణించడానికి?!!

ఊహతెలిసినప్పటినుంచీ తెలిసిన ప్రపంచం అంతా సప్తవర్ణ శోభితమే. నిద్రలేస్తూనే వీధిలోకి వస్తే ఎదురుగా చెరువు మీద ఉదయించే సూర్యుడు, తల పక్కకి తిప్పితే ఎత్తైన ధ్వజ స్థంభం అంతకన్నా ఎత్తైన గోపురంతో గుడీ, అటుపై ఎటు పక్కకి తలతిప్పినా దట్టమైన కొబ్బరి అడవి. పెరట్లో అరటి చెట్లు, దబ్బ చెట్టు, కూరగాయ మడులు.. దాటి కొంచం ముందుకు వెడితే కొబ్బరి తోట. ఓ పక్క మావిడి చెట్టు, మరోపక్క వేప చెట్టు, ఇంకోపక్క వెలగచెట్టు. సరిహద్దులో పాముపుట్టని ఆనుకుని సంపెంగ పొద, అనాస పొదలూ. ఆవెంటే కనకాంబరాలలాంటి ఆకుపచ్చని పూలు పూసే పేరుతెలియని మొక్కలు.


అటుగా ఓ అడుగేస్తే పక్క వాళ్ళ తోటలో ఈత చెట్లూ, నేరేడు చెట్లూ. కాకులు, చిలకలు, పాలపిట్టలతో పాటు పేరు తెలియని పక్షులెన్నో. ఇక సీతాకోకచిలుకలైతే ఏరకం పూలమీద ఏ చిలుక వాలుతుందో నిద్రలో లేపినా చెప్పేసేంత జ్ఞానం!! పసుపురంగు కోల రెక్కలుండే సీతాకోకచిలుకలైతే ఎలాంటి పూల మీదైనా వాలేస్తాయి. అదే నలుపు మీద తెలుపు, ఎరుపు చుక్కలుండే పెద్ద రెక్కలవైతే మందారాలని విడిచి పక్కకి చూడవు. నల్లరెక్కల మీద తెల్లని చారలుండే బుజ్జి పిట్టలు సీతాఫలాలని బతకనివ్వవు. పిందె పండుగా మారుతూ ఉండగానే ఈతాకు బుట్టలు కట్టేయాల్సిందే.

దొండ పాదుకి రోజూ కోసినా కాయలు కాస్తూనే ఉంటాయి. పొట్ల పాదు పూత నిలబడగానే చిన్న చిన్న రాళ్ళకి పురికొస తాళ్ళు కట్టి సిద్ధం పెట్టుకోవాలి, కాయలు వంకర్లు తిరిగిపోకుండా కాసుకోడం కోసం. శీతాకాలపు ఉదయాలు, వేసవి కాలపు సాయంత్రాలు, వర్షాకాలపు మధ్యాహ్నాలు మరింత అందంగా ఉండే ప్రపంచం కదూ అదీ. మంచు తెరల్ని చీల్చుకుంటూ పచ్చని చెట్ల మీద ఉదయించే సూర్యుడూ, రోజంతా గాడ్పుల తర్వాత ఒక్కసారిగా చల్లబడే సాయంత్రాలూ, ముసుగేసుకుని పడుకోవాలనిపించే ముసురేసిన మధ్యాహ్నాలూ ఎక్కడైనా బావుంటాయి కానీ, కోనసీమలో అయితే అద్భుతంగా ఉంటాయి.


మొదటిసారి గోదారిని చూసిన అనుభవం ఎప్పటికీ తడి ఆరని ఓ జ్ఞాపకం. సైకిలు మీద నాన్నతో కలిసి ఏటిగట్టు మీద ప్రయాణం. నాన్న సైకిలు తొక్కుతూ ఉంటే చెరువు కన్నా ఎన్నో రెట్లు పెద్దగా ఉన్న గోదారిని కళ్ళు విప్పార్చుకుని గోదారిని చూడడం బాల్య జ్ఞాపకం అయితే, భాద్రపద మాసపు వరద గోదారిమీద వెన్నెల రాత్రులలో చేసిన పడవ ప్రయాణాలు యవ్వనాన్ని వెలిగించాయని చెప్పుకోడానికి అభ్యంతరం ఏముంటుంది? వరద పోటెత్తుతూ, క్షణ క్షణానికీ గోదారొచ్చేస్తూ ఉంటే నీళ్ళ మీద బరువుగా కదిలే పడవ. పైన మబ్బుల్లేని ఆకాశంలో ఇట్టిట్టే కళలు పెంచుకునే శుక్ల పక్షపు చంద్రుడు. అప్పుడు కలిగే అనుభూతికి పేరు పెట్టడం ఎవరి తరం??


వినగలగాలే కానీ గోదారి ఎన్నెన్ని కబుర్లు చెబుతుందో. ఎంత చక్కని వక్తో, అంతకి మించిన శ్రోత కూడా. చెప్పడం చేతనవ్వాలి ఎటొచ్చీ.. చూడ్డానికి ఎంత ప్రశాంత గంభీరంగా ఉంటుందో, అంతకు అనేకరెట్లు లోతైన నది కదా మరి. గోదారితో ప్రేమ పుట్టుకతో వచ్చేదని చెప్పడం సాహసం.. కానీ, ఒక్కసారి మొదలయ్యిందో.. కడవరకూ సాగాల్సిందే ఇక. వినగలగాలే కానీ గోదారి గలగలల్లో సంగీతం వినిపిస్తుంది.. చూడగలిగితే సాహిత్యం కనిపిస్తుంది. ఓ సంగీత రూపకం లానో, గేయ కావ్యంలాగో అనిపిస్తుంది. చూసే కళ్ళకి గోదారి నడకల్లో నాట్యం కనిపిస్తుంది. ఒంపుసొంపుల గోదారి ఏ నాట్యకత్తెకి తక్కువ?


కోనసీమనుంచీ, గోదారి నుంచీ సెలవు తీసుకోవాల్సి రావడం జన్మానికెల్లా అతిపెద్ద శాపం. ఆ విరామం తాత్కాలికమే కావొచ్చు కానీ దూరంగా ఉండాల్సి రావడం ఎంత కష్టం?! రేపేవిటో తెలియని బతుకని అనుక్షణం నిరూపితమవుతున్నప్పుడు రేపటి మీద అంత పెద్ద ఆశ పెట్టుకోవడం సాధ్యమేనా? ఎప్పటి పుణ్యమో కోనసీమకీ గోదారికీ దగ్గర చేసి, పండకుండా మిగిలిపోయిన పాపమేదో అంతలోనే దూరం చేసేసి ఉంటుందని సరిపెట్టుకోడాన్ని మించిన జోలపాట ఉంటుందా ఈ జీవితానికి???

(Pics courtesy: Google)

గురువారం, నవంబర్ 27, 2014

రౌడీ FELLOW

ఎవరన్నారు తెలుగు సినిమా తీయడానికి కథల కొరత ఉందని? తెల్లారి లేచి పేపర్ చూస్తే బోలెడన్ని వార్తలు. టీవీ పెట్టి ఏ చానల్ తిప్పినా లెక్కలేనన్ని వార్తా కథనాలు. ఏదో ఒక వార్తా కథనాన్ని ఆధారం చేసుకుని, సినిమాటిక్ లిబర్టీని పుష్కలంగా ఉపయోగించుకుని, హీరోని సర్వ శక్తిమంతుడిగా తీర్చి దిద్దుకుని, ఊపిరి బిగపట్టే స్క్రీన్ ప్లే, పదునైన సంభాషణలతో కథ రాసుకుని తెరకెక్కిస్తే తప్పకుండా అదో వైవిద్యభరితమైన సినిమా అవుతుంది. నమ్మకం కలగడం లేదా? అయితే నారా రోహిత్ కథానాయకుడిగా వచ్చిన 'రౌడీ FELLOW' సినిమా చూడండి.

పశ్చిమ గోదావరి జిల్లాలోని 'కొల్లేరు' ఓ సామాజిక సమస్య.. పర్యావరణ సమస్య.. రాజకీయ సమస్య కూడా. ఆ ప్రాంత రాజకీయ నాయకుల మధ్య విభేదాలొచ్చినప్పుడల్లా కొల్లేరు వార్తల్లోకి వస్తూ ఉంటుంది. సరస్సుని ఆక్రమించి చేపల చెరువులు పెంచడాన్ని గురించి పేపర్లలో కథనాలు వస్తూ ఉంటాయి. టీవీ ఛానళ్ళు చర్చా కార్యక్రమాలతో సహా చేయగలిగినవన్నీ చేస్తూ ఉంటాయి. ఈ అంశం చుట్టూ కథ అల్లుకుని సినిమా తీయవచ్చు అన్న ఆలోచన తెలుగు సినిమా పరిశ్రమకి ఇన్నాళ్ళకి వచ్చింది. గీత రచయిత కృష్ణ చైతన్య కథ రాసుకుని, దర్శకత్వం వహించిన సినిమా ఇది.

పేదరికం అంటే ఏమిటో తెలియని మల్టీ మిలియనీర్ రాణాప్రతాప్ జయదేవ్ (నారా రోహిత్) కథ ఇది. నిలువెల్లా డబ్బున్నప్పుడు కొన్ని కొన్ని క్వాలిటీలు వాటికవే వచ్చేస్తాయి. మరికొన్ని లక్షణాలకి డబ్బు ఉండడం, లేకపోవడంతో సంబంధం ఉండదు. పుట్టుకతో వచ్చే లక్షణాలివి. కారణం ఏదైనప్పటికీ, జయదేవ్ కి ఉన్న క్వాలిటీ 'ఇగో.' తనని ఎవరన్నా ఏమన్నా అంటే బదులు తీర్చేసుకోవలసిందే. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఈ ఉపేక్షించక పోవడం వెనుక డబ్బు ఇచ్చిన దన్ను ఉంది. కావాల్సింది క్షణాల మీద చేసి పెట్టే పరివారమూ ఉంది.

ఈ కారణంగానే, ఎస్పీ పరమహంస (ఆహుతి ప్రసాద్) తో ఇగో క్లాష్ వచ్చినప్పుడు, అతనికి జవాబు చెప్పడం కోసం యాభై లక్షలు ఖర్చు చేసి ఎస్సై పోస్టు కొనుక్కుంటాడు జయదేవ్. ఎస్పీకి పక్కలో బల్లెంగా మారాలనుకున్న వాడు కాస్తా, అనుకోకుండా ఎంపీ అసురగణ దుర్గా ప్రసాద్ (రావు రమేష్) తో కయ్యం పెట్టుకుంటాడు. దుర్గాప్రసాద్, అతని అనుచరగణం సాగిస్తున్న దమనకాండ కారణంగా కొల్లేరు ప్రాంతంలో పేదవాళ్ళకి ఎదురవుతున్న కష్ట నష్టాలు చూసి చలించిపోయిన జయదేవ్ ఉద్యోగాన్ని సీరియస్ గా తీసుకోవడం మొదలుపెడతాడు. కేంద్ర మంత్రి కావాలన్న దుర్గా ప్రసాద్ కోరిక చివరినిమిషంలో తీరకుండా పోతుంది, కేవలం జయదేవ్ కారణంగా.


ఇక అక్కడినుంచీ దుర్గాప్రసాద్-జయదేవ్ ల మధ్య మొదలైన ప్రత్యక్ష పోరు ఎలా కొనసాగింది, ఎక్కడ ముగిసింది అన్నది సినిమా ముగింపు. ఏ ఎస్పీ కారణంగా తను పోలీసు ఉద్యోగానికి వచ్చాడో, అదే ఎస్పీ కూతురు (విశాఖ సింగ్, తొలిపరిచయం) తో జయదేవ్ ప్రేమలో పడడం, డ్యూయట్లు పాడుకోవడం ఈ సీరియస్ సినిమాలో కొంత ఆటవిడుపు. చాలా రోజుల తర్వాత సీనియర్ నటులు తాళ్ళూరి రామేశ్వరి, గొల్లపూడి మారుతిరావులతో పాటు పరుచూరి, అజయ్ లకి గుర్తుండిపోయే పాత్రలు దొరికాయి. అలాగే, హాస్య నటులు సత్య, ప్రవీణ్ లకి కూడా. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పోసాని కృష్ణమురళి పోషించిన ' సిల్క్' పాత్రని. పోసాని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రని రాసుకున్నారు అనిపించింది.

ప్రధాన పాత్రలు పోషించిన నారా రోహిత్, రావు రమేష్ పోటాపోటీగా నటించారు. 'బాణం' తర్వాత నేను చూసిన రోహిత్ సినిమా ఇదే. కనీసం ఓ పది కేజీలు బరువు తగ్గకపొతే కేరక్టర్ ఆర్టిస్ట్ గా ప్రమోషన్ వచ్చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. "కుర్రాడు బొద్దుగా ఉన్నాడు" అని ఓ పాత్ర చేతి పలికించి హీరో శరీరాకృతిని జస్టిఫై చేసే ప్రయత్నం చేశారు కానీ, వారసుల మధ్యే విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో రోహిత్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రావు రమేష్ ఎంపీ పాత్రని మరికొంత అండర్ ప్లే చేయగలడనిపించింది, గత చిత్రాలని గుర్తు చేసుకున్నప్పుడు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో మరీ 'లౌడ్' గా చేసిన భావన. ఆహుతి ప్రసాద్ పాత్ర చిత్రణ నిరాశ పరిచింది. ఆ పాత్ర మరికొంత బలంగా ఉంటుందని ఆశించాను.

హీరోని ఎలివేట్ చేయడమే లక్ష్యంగా రాసుకున్న కథ కావడం వల్ల చాలాచోట్ల నేల విడిచి సాముచేసింది. లాజిక్ ని పక్కన పెట్టాల్సిన సన్నివేశాల సంఖ్య పెరిగిపోయింది. సాంకేతిక విభాగాల్లో సన్నీ సంగీతం, అరవిందన్ పీ గాంధీ ఛాయాగ్రహణం చెప్పుకోవాల్సిన అంశాలు. దర్శకుడు కృష్ణచైతన్య కథ కన్నా ఎక్కువగా సంభాషణలే నమ్ముకున్నాడనిపించింది. డైలాగులు కొటేషన్లని తలపించాయి. అయితే, వరుసగా కొటేషన్లు వినాల్సి రావడమూ ఒక్కోసారి ఇబ్బందే. 'చెట్టుకింద ప్లీడర్' లో అలెక్స్ నీ, 'గీతాంజలి' లో ఫోన్ సీన్ నీ చాలా తెలివిగా వాడుకున్నారీ సినిమాలో. హీరోగారి  'చెట్టు' పేరు మరీ అన్నిసార్లు చెప్పక్కర్లేదేమో అనిపించింది. ఎడిటర్ కి మరికాస్త పనిపెంచి కనీసం ఓ ఇరవై నిమిషాల సినిమాని ట్రిమ్ చేసి ఉంటే మరింత బావుండేది. వైవిధ్య భరితమైన సినిమాలు కోరుకునే వాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా ఇది.

(ఈ సినిమాని రికమెండ్ చేసిన మిత్రులు వేణూ శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు)

బుధవారం, నవంబర్ 26, 2014

ధన్వంతరి వారసులు

వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. మహాభాగ్యమైన ఆరోగ్యం ఇబ్బంది పెట్టినప్పుడే కదా డాక్టరు గుమ్మం తొక్కాల్సి వచ్చేది. ఊరికే కూర్చుని తోచీ తోచకా లెక్కలేస్తే ఇప్పటివరకూ నాకోసం అయితేనేం, మావాళ్ళ కోసమయితేనేం సుమారు ఓ యాభై మంది డాక్టర్లని చూసినట్టుగా లెక్క తేలింది. వీళ్ళలో వైద్యుల మాట పక్కనపెట్టి, కనీసం మనుషులుగా ప్రవర్తించిన వాళ్ళు నలుగురైదుగురు కూడా కనిపించలేదు. ఇది అత్యంత దురదృష్టం.

నేను చూసిన డాక్టర్లందరూ కూడా ప్రైవేటు నర్సింగు హోములు, కార్పొరేట్ హాస్పిటళ్ళ వాళ్ళే. ఎమర్జెన్సీ మినహాయించి మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ముందుగా అపాయింట్మెంట్ తీసుకునే వెళ్ళడం జరిగింది. కనీసం ఒక్కసారి కూడా ఆస్పత్రి వారిచ్చిన టైముకి డాక్టరు మమ్మల్ని చూడడం కాదు కదా, కనీసం హాస్పిటల్ కి కూడా రాలేదు. గంట నుంచి మూడుగంటల పాటు నిరీక్షణ. ఏ ఒక్క ఆస్పత్రీ, డాక్టరూ ఇందుకు మినహాయింపు కాదు. రోగుల టైం అంటే డాక్టర్లకి ఎంత చులకన?!!

కన్సల్టెన్సీ రూములోకి వెడుతూనే డాక్టర్ని పలకరించడం ఒక అలవాటు. తిరిగి 'హలో' అన్నవాళ్ళని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. తుమ్మల్లో  పొద్దుగూకినట్టుగా ముఖం పెట్టుకుని కూర్చోడం, పరమ సీరియస్ గా వాచీనో, మొబైల్ ఫోనో చూసుకోడం లేదా నర్సు మీద కేకలేయడం.. ఇది సాధారణ దృశ్యం. రోగి తన సమస్యలు చెప్పుకునే కనీస వాతావరణం కల్పించాలి అన్న ఆలోచన వీళ్ళకి ఎందుకు ఉండదో అనిపిస్తూ ఉంటుంది. ఇక మాట్లాడడం కూడా ఏ గోడమీద కేలండర్నో చూస్తూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. 'ఈ డాక్టర్ నా ముఖం వైపు ఎందుకు చూడడంలేదు? నాకు కళ్ళకలక గానీ వచ్చిందా?' ఈ సందేహం నాకెన్నిసార్లు కలిగిందో లెక్కలేదు.

తొంభై శాతం మంది డాక్టర్లు పేషెంట్ ని ఎదురుగా పెట్టుకుని నర్సుతోనో, ఫోన్ లోనో, లేదా అప్పటికే టేబిల్ కి మరోవైపు కూర్చున్న తన ఫ్రెండ్ తోనో కబుర్లు చెబుతూ ఉంటారు. డాక్టర్ చెప్పింది పేషెంట్ వినాలి తప్ప ఏమీ అడక్కూడదు. పొరపాటున ఒకట్రెండు కన్నా ఎక్కువ సందేహాలు అడిగారో, పేషెంట్ల పని అయిపోయిందే.. "ఎక్కడినుంచి వస్తారో మన ప్రాణాలు తీయడానికి" అని వినీవినబడకుండా గొణుగుతారు జనాంతికంగా. ఇంజెక్షన్ అవసర పడితే, చేయాల్సిన బాధ్యత నర్సుదే. ఒకవేళ డాక్టరే చేస్తే మాత్రం, ఎటో చూస్తూ సూది జబ్బలో గుచ్చుతారు చాలా కాన్ఫిడెంట్ గా.

పేషెంట్ అనారోగ్యం మీద జోకులు వేసే డాక్టర్లూ ఉన్నారు. వీళ్ళని కనీసం మనుషులు అనుకోలేం. ఇక డైట్ గురించి డాక్టర్లు వేసే జోకులకి సిగ్గుతో చచ్చిపోవాలి. 'మనం మరీ తిండి తినడం కోసమే బతుకుతున్నామా?' అన్న అనుమానం వచ్చేస్తుంది. దానితోపాటే 'తినకపోతే చచ్చిపోతామా' అన్న వైరాగ్యం కూడా. డాక్టర్ ఏమన్నా టెస్ట్ లు రాస్తే పొరపాటున కూడా 'ఎందుకు?' అని అడగకూడదు. వాళ్ళ మనోభావాలు తీవ్రంగా గాయపడతాయి. 'ఫలానా మందు నాకు సరిపడదు, వేరేది రాయండి?' అన్నా సమస్యే.. 'డాక్టర్ నువ్వా? నేనా?' వరకూ వెళ్ళిపోతుంది విషయం. 'కానీ మందు మింగాల్సింది నేను కదా' అన్నామో, నర్సుకి పాపం తిట్లే తిట్లు.



లోకంలో మంచి డాక్టర్లు లేరని కాదు. కానీ, మంచితనంలాగే వారి శాతం కూడా బహు స్వల్పం. ఈ కారణంగానే కావొచ్చు, మంచివారు కాని డాక్టర్ల పాల పడాల్సి వస్తోంది. సాధ్యమైనంత వరకూ డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి రాకుండా చూసుకోవడం ఉత్తమమే కానీ, అన్నీ మన చేతిలో ఉండవు కదా. డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన 'హౌస్ సర్జన్' నవలలో మంచి డాక్టర్ల గురించి చదివినప్పుడు ఆశ్చర్యంతో పాటు ఆనందమూ కలిగింది. ఆయన తప్పు లేకుండా, మంచివారు కాని డాక్టర్ల గురించి కూడా రాశారు కొమ్మూరి ఆ నవలలో. వ్యక్తిగత సమస్యలో మరొకటో డాక్టర్లని ఇబ్బంది పెడుతూ ఉండి ఉండొచ్చు.. కాదనలేం. కానీ, ఆ చికాకుల్ని పేషెంట్ల మీద చూపించడం ఎంతవరకూ సబబు?

పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం అనుకుంటా.. వైద్యసేవలని వినియోగదారుల చట్టం పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఓ ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదన గురించి విన్న వెంటనే చాలా చాలా సంతోషం కలిగింది నాకు. కానీ, ఏం లాభం? డాక్టర్లందరూ సమ్మెలూ అవీ చేసి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ ప్రతిపాదనని విజయవంతంగా బుట్ట దాఖలు చేయించారు. ఆమధ్య ఓ సినిమాలో కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు శవానికి వైద్యం చేసి బిల్లు వేసినట్టుగా చూపిస్తే చాలామంది డాక్టర్ల మనోభావాలు దెబ్బతిన్నాయి. కొందరైతే ఆ సినిమాని నిషేధించాలని కూడా అన్నారు అప్పట్లో. కానీ, జనాభిప్రాయం మాత్రం సినిమాలో చూపించిన దాంట్లో అతి ఎంతమాత్రమూ లేదనీ, జరుగుతున్నదే చూపించారనీను.

ఏటా నవంబర్-డిసెంబర్ నెలలు వచ్చేసరికి 'జూడాల సమ్మె' తంతు మొదలవుతుంది. రకరకాల డిమాండ్లతో సమ్మె చేస్తూ ఉంటారు ఈ జూనియర్ వైద్యులు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ధర్మాసుపత్రుల్లో రోగులని ఎలా చూస్తారో ఊహించడం కష్టం కాదు. రోగుల సంఖ్యకీ, డాక్టర్ల సంఖ్యకీ ఎప్పుడూ సమన్వయం కుదరని ధర్మాసుపత్రుల మీద ఈ జూడాల సమ్మె ప్రభావం అంతా, ఇంతా కాదు. ప్రభుత్వం ఒక్కో జుడా మీద ప్రజల సొమ్ము లక్షలకి లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు కొన్ని షరతులు విధించడంలో తప్పు కనిపించదు.

చదువు పూర్తవ్వగానే గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా పనిచేయాలి అన్న నిబంధన వాటిలో ఒకటి. కోర్సులో చేరినప్పుడు ఏమాత్రం అభ్యంతరంగా అనిపించని ఈ నిబంధన, చదువు పూర్తయ్యే సమయానికి వాళ్ళ 'హక్కులకి భంగం' గా కనిపిస్తుంది జూడా లకి. సమయం చూసుకుని సమ్మెకి దిగడం, నెలో, నెలన్నరో చదువునీ, పేషెంట్లనీ వదిలేసి రోడ్డు మీద ప్రదర్శనలు. ఒక పేషెంట్ గా డాక్టర్లతో  నాకున్న అనుభవాలవల్లో ఏమో తెలీదు కానీ, ఈ జూడాల సమ్మెని నేనేమాత్రం సమర్ధించలేను. వాళ్ళు అటు ప్రభుత్వాన్నీ, ఇటు పేద రోగులనీ కూడా 'గ్రాంటెడ్' గా తీసుకుంటున్నారని నా బలమైన నమ్మకం.

సోమవారం, నవంబర్ 24, 2014

వాళ్ళు సైతం

ఉత్తరాంధ్ర జిల్లాలని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపాను బాధితులకి సహాయం అందించడం కోసం తెలుగు సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున తరలి వస్తోందంటూ ప్రచారసాధనాలన్నీ హోరెత్తుతున్నాయి. 'మేము సైతం' పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించారనీ, సినీ తారలూ సాంకేతిక నిపుణులూ ప్రేక్షకులతో ఆడిపాడి, నిధులు సమకూర్చి ఆ మొత్తాన్ని ఉత్తరాంధ్ర పునర్నిర్మాణం కోసం వెచ్చించ బోతున్నారనీ ఆ వార్తల సారాంశం.

గడిచిన వందేళ్ళ కాలంలో సంభవించిన అతిపెద్ద తుపానుల్లో ఒకటైన హుద్ హుద్ కారణంగా ఉత్తరాంధ్ర కి జరిగిన నష్టం అపారం. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం నిధులు సమకూర్చే పరిస్థితిలో లేదు. ఒకవేళ, ప్రభుత్వమే ముందుకు వచ్చినా ఎన్ని నిధులూ చాలని పరిస్థితి. ఈ నేపధ్యంలో ప్రభుత్వంతో పాటు, పత్రికలూ ప్రజలనుంచి విరాళాలు సేకరిస్తున్నాయి. వీరికి తోడుగా ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ కూడా సాయం అందించడానికి ముందుకు వచ్చింది.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితుల్ని ఆదుకోవడం కోసం తెలుగు సినిమా పరిశ్రమ ముందుకి రావడం ఇదే తొలిసారి కాదు. దివిసీమ ఉప్పెన అనంతరం నాటి అగ్రనటులు ఎన్టీఆర్-ఏఎన్నార్ మిగిలిన నటీనటులతో కలిసి ఊరూరా తిరిగి జోలె పట్టి మరీ విరాళాలు సేకరించారు. ఆ కార్యక్రమానికి ప్రజలనుంచి వచ్చిన స్పందన చూశాకే ఎన్టీఆర్ కి మొదటిసారిగా రాజకీయ రంగప్రవేశాన్ని గురించి ఆలోచన వచ్చిందనే వాళ్ళూ ఉన్నారు.. అది వేరే సంగతి.

తర్వాత కూడా విపత్తులు సంభవించినప్పుడూ, వృద్ధ కళాకారుల సంక్షేమానికి అనీ సినిమా వాళ్ళు వినోద కార్యక్రమాలు, క్రికెట్ మ్యాచ్లు అడపాదడపా నిర్వహిస్తూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే, టీవీ ఛానళ్ళు విస్తరించాక ఈ తరహా కార్యక్రమాలు బాగా పెరిగినట్టే కనిపిస్తోంది. టిక్కెట్లు కొనుక్కుని వచ్చే ప్రేక్షకులతో పాటు, ఛానళ్ళ ద్వారా స్పాన్సర్షిప్ ఆదాయం కూడా వస్తూ ఉండడం, టీవీల ద్వారా కార్యక్రమం ఎక్కువమంది ప్రేక్షకులకి చేరుతూ ఉండడం సినిమా వాళ్ళని ఉత్సాహ పరుస్తున్నట్టుంది.

హుద్ హుద్ బాధితులకి సహాయక చర్యలు ప్రారంభం అవుతూనే విరాళాల ప్రకటనలు మొదలయ్యాయి. కొందరు సినిమా ప్రముఖులు విరాళాలు ప్రకటించారు, రూపాయివ్వని దర్శకనిర్మాత ఒకాయన "ఇంతేనా మీ విరాళాలు?" అని ప్రశ్నించాడు కూడా. ఇప్పుడు చెయ్యబోతున్న 'మేముసైతం' ని యావత్తు సినిమా పరిశ్రమా కలిసి నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో ఈనెల ముప్ఫైన జరగబోయే కార్యక్రమంలో ఖరీదైన టిక్కెట్లు కొనుక్కున్న ప్రేక్షకులు తారలతో ఆడిపాడొచ్చు. కలిసి భోజనం చేయొచ్చు.

ఈ 'మేముసైతం' ద్వారా సుమారు ఐదు నుంచి పదికోట్ల రూపాయలు సమీకరించవచ్చని ఓ అంచనా. విడిగా చూసినప్పుడు ఇది పెద్దమొత్తమే కానీ, చుక్కలనంటే తారల పారితోషికాలు, భారీ సినిమాల బడ్జెట్లు, కలెక్షన్లతో పోల్చినప్పుడు ఇదేమంత పెద్దమొత్తం అనిపించదు. పైగా, నిత్యం ఏదో ఒక చానల్లో కనిపిస్తున్న తారలకోసం ప్రత్యేకం భారీ మొత్తం చెల్లించి టిక్కెట్లు కొనేవాళ్ళు ఎంతమంది ఉంటారు అన్నది మరో ప్రశ్న. ఆశించిన స్థాయిలో స్పందన రానట్టయితే, ఊహించిన మొత్తం వసూలవ్వడమూ కష్టమే.

తెలుగు సినిమా పరిశ్రమ యావత్తూ పాల్గొనే కార్యక్రమం కాబట్టి, ఓ చిన్న లెక్క వేయాలనిపించింది. ఒక సినిమాకి వారివారి పారితోషికాలని, సినిమా కోసం పనిచేసే రోజులతో భాగించి ఒక్కరోజు ఆదాయాన్ని అంచనా వేసి, మొత్తం అందరి ఒకరోజు సంపాదననీ కూడితే ఎంత మొత్తం వస్తుంది? నాకైతే ఈ మొత్తం కచ్చితంగా 'మేముసైతం' ద్వారా వసూలయ్యే మొత్తంకన్నా ఎక్కువే తప్ప తక్కువ ఉండదని ఓ బలమైన నమ్మకం.

ఒకరోజు మొత్తం సినిమా షూటింగులన్నీ ఆపేసి, ఇప్పటికే హుద్ హుద్ బాధితుల కోసం ఏదో ఒక రూపంలో సాయం అందించిన ప్రజలనుంచే మళ్ళీ డబ్బు వసూలు చేసే కన్నా, సినిమా వారందరూ వాళ్ళ ఒకరోజు సంపాదనని సాయంగా ప్రకటించేస్తే మంచిదేమో కదా. దీనివల్ల సినిమా పరిశ్రమ ఒక విలువైన పనిదినాన్ని నష్టపోకుండా ఉంటుంది.. పరిశ్రమకి సీడెడ్ తర్వాత అత్యధిక ఆదాయాన్నిచ్చే వైజాగ్ కి సొంతడబ్బుని సాయంగా అందించామన్న తృప్తీ సినిమా వాళ్లకి మిగులుతుంది.

శుక్రవారం, నవంబర్ 21, 2014

ఇద్దరు

ఈ నెలలో ఇద్దరు ప్రముఖ రచయితలు పుట్టినరోజు జరుపుకున్నారు. ఒకరు తొంభై ఒకటో ఏటికి, మరొకరు తొంభయ్యో ఏటా అడుగు పెట్టారు. ఇద్దరికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వీరిద్దరూ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలనీ, సాహితీ సేద్యాన్ని కొనసాగించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సమాజాన్ని ప్రభావితం చేసిన ఈ ఇద్దరినీ గురించీ నాలుగు మాటలు చెప్పుకోడానికి ఇది సందర్భం అనిపిస్తోంది.

డాక్టర్ ఆవంత్స సోమసుందర్.. కవిగా ప్రయాణం మొదలు పెట్టి, కవిత్వం కొనసాగిస్తూనే వచనం, అనువాదాల మీదుగా రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈ 'పిఠాపురం కవిగారు' కొన్నితరాల కవులని ప్రభావితం చేశారు, చేస్తున్నారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, ఓ జమీందారీ కుటుంబంలో దత్తపుత్రుడిగా అడుగుపెట్టి, వైభవాన్నే తప్ప దరిద్రాన్ని ఏమాత్రమూ రుచిచూడని సోమసుందర్ వామపక్ష రాజకీయ భావజాలం వైపు మొగ్గు చూపడం, నమ్మిన సిద్ధాంతం కోసం జైలు జీవితం గడపడం వింతల్లో వింత.


కోస్తా ప్రాంతంలో పుట్టి పెరిగిన కవుల్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని తొలినుంచీ ఎలుగెత్తి చాటిన ఏకైక కవి సోమసుందర్. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం సోమసుందర్ వెలువరించిన కవితా సంకలనం 'వజ్రాయుధం' తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని నొక్కి చెబుతుంది. 'వజ్రాయుధ కవి' అన్న బిరుదుని మాత్రమే కాదు, లెక్కలేనన్ని విమర్శల్నీ తెచ్చిపెట్టిన సంకలనం అది. సోమసుందర్ కవిత్వం కన్నా ఎక్కువగా, ఆయన 'బూర్జువా' నేపధ్యం విమర్శలకి కేంద్రబిందువు అయ్యింది.

విమర్శలకి మాటలతో మాత్రమే కాక, చేతలతోనూ సమాధానం చెప్పడం సోమసుందర్ శైలి. ఈమధ్యనే జరిగిన తన తొంభై ఒకటో పుట్టినరోజు వేడుకల్లో తాజాగా రాసిన మూడు పుస్తకాలని విడుదల చేసి  తానేమిటో మరోమారు నిరూపించుకున్నారు సోమసుందర్. రాసేవాళ్ళని ప్రోత్సహించడం, నిష్కర్షగా - ఇంకా చెప్పాలంటే కటువుగా - విమర్శించడం సోమసుందర్ పధ్ధతి. సాహిత్యంలో నాణ్యతని కోరుకునే ఈ కవిగారినుంచి మరిన్ని రచనలు రావాలని కోరుకుంటున్నాను.


నాగావళి నది ఒడ్డున పుట్టిన కాళీపట్నం రామారావు మేష్టారి జీవితమూ, సాహిత్యమూ కూడా వామపక్ష ఉద్యమాలతో పెనవేసుకున్నవే. శ్రీకాకుళంలో ఓ మధ్యతరగతి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబలో జన్మించి, జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఢక్కామక్కీలు తిన్న కారా మేష్టారు ప్రతి దెబ్బకీ మరింత పదునెక్కారే తప్ప ఏనాడూ రాజీపడలేదు. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన మేష్టారి కథలన్నీ వామపక్ష భావజాలంతో సాగేవే.

సుందరపాలెం లో జరిగిన 'యజ్ఞం' గురించి చెప్పినా, భారతదేశం మీద జరిగిన 'కుట్ర' ని విప్పి చెప్పినా, కూటికి పేదలైనా గుండెల్లో 'ఆర్తి' నింపుకున్న జనాన్ని గురించి చెప్పినా ఆ కథలన్నింటి వెనుకా ఓ కమిట్మెంట్ కనిపిస్తుంది. దిగువ మధ్యతరగతి, పేద ప్రజల జీవితాలని నిశితంగా పరిశీలించి కథలు రాసిన కారామేష్టారి మీద వచ్చిన విమర్శలకీ అంతులేదు. 'యజ్ఞం' కథ ఇవాల్టికీ చర్చనీయమే.

తను రాసిన కథల గురించి మాట్లాడడానికి ఏమాత్రమూ ఇష్టపడని కారా మేష్టారు, తెలుగు కథలన్నింటీ ఓ చోటకి చేర్చాలనే సంకల్పంతో ఆరంభించిన 'కథా నిలయం' ఎవ్వరి ఊహకీ అందని ప్రాజెక్టు. ఏ ప్రభుత్వ సంస్థో చేపట్టాల్సిన కార్యక్రమం. కేవలం తన సంకల్ప బలంతో, సాహిత్యం ద్వారా వచ్చిన ప్రతి పైసనీ ఖర్చు చేసి 'కథా నిలయా'నికి ఓ రూపు తెచ్చారు మేష్టారు. చదివే అలవాటున్న వాళ్ళు ఎవరు కనిపించినా "మీ దగ్గర ఏ కథలున్నా ఓ కాపీ కథా నిలయానికి పంపండి" అని చెప్పడం ఇవాల్టికీ మర్చిపోరు. మేష్టారు మళ్ళీ రాయడం మొదలు పెడితే బాగుండునని ఎదురు చూసే వాళ్ళలో నేనూ ఒకడిని.

పుట్టినరోజు అనేది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. జరుపుకోవాలా, వద్దా అనేది ఆయా వ్యక్తుల వ్యక్తిగత నిర్ణయం. కొందరు రచయిత(త్రు)లు పుట్టినరోజు జరుపుకోరు. అది వారిష్టం. కానీ, ఆయా రచయిత(త్రు)ల అభిమానులు కొందరికి ఈ ఇద్దరు రచయితలూ పుట్టినరోజుని వేడుకగా జరుపుకోడం నచ్చలేదు. వారి వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకుని విమర్శలు కురిపించారు. దానిగురించిన చర్చ ఇక్కడ అప్రస్తుతం. కానైతే, వీళ్ళిద్దరూ పుట్టినరోజు జరుపుకోడం వల్లనే వీళ్ళ రచనలని గురించిన కొంత చర్చ జరిగింది కదా అన్నది నాబోంట్ల సంతోషం!!

బుధవారం, నవంబర్ 19, 2014

పూలబాట

"నువ్వు నడుచు దారుల్లో పూలు పరిచి నిలుచున్నా.. అడుగు పడితె గుండెల్లో కొత్త సడిని వింటున్నా..." చిత్ర పాట వింటూ ఉంటే ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగొచ్చాయి కాసేపు. పూలు పరిచిన బాటలో నడవడం, మనం నడిచే బాటలో మనకోసం మరొకరు పూలు పరిచి నిలబడడం.. రెండూ వేరువేరు కదూ. పూలబాటని ఎంచుకోవడం చాయిస్ అయితే, పూలు పరిచి నిలబడడం చాన్స్ అనుకోవాలి. మొదటిదాని కన్నా రెండోది గొప్ప విషయం, కచ్చితంగా.

పూలకీ, ముళ్ళకీ అవినాభావ సంబంధం. ముళ్ళున్న చెట్లకి అందమైన పూలు పూస్తాయి అదేమిటో. బహుశా, అందమైన పూలకి రక్షణ కోసం ఆ ముళ్ళు అనుకోవాలి మనం. ముళ్ళతో  పోరాడి గెలిచిన వాళ్లకి మాత్రమే పూలు లభిస్తాయి అనీ అనుకోవచ్చు. పూలబాట కన్నా ముందుగా కనిపిస్తూనో, పూలమాటున కనిపించకుండానో ముళ్ళు ఉంటాయన్నది ఇక్కడ గుర్తించాలి. 'ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచె' అవసరం లేదేమో కానీ, పూలచెట్టుకి ముళ్ళకంచె ఇచ్చే రక్షణ అంతా ఇంతా కాదు.

'పాలకోసం నల్లరాయి మొయ్యాలి' అని సామెత. దీన్ని కాస్త మార్చుకుని, పూలకోసం  ముళ్ళని భరించాలి అనుకోవచ్చు. ఆటో రిక్షాల వెనక వైపున ఆయా డ్రైవర్ల అభిరుచుల మేరకి రకరకాల విషయాలు రాసి ఉంటాయి. ఆయా వాహనాల వెనుక వెళ్ళేప్పుడు వాటిని చదువుకోవడం ఓ అనుభవం. 'ముళ్ళకి జడిసి గులాబీని వదలకు' అన్నది ఒకానొక ఆటోడ్రైవర్ ఇచ్చిన సందేశం! 'సాహసం శాయరా డింభకా.. రాకుమారి వరించునురా' కి ఇది మరో రూపంలా అనిపించడం లేదూ?

పూలబాట కోసం మనమే పూలు పరుచుకోదానికీ, మనకోసం మరొకరు బాటని సిద్ధం చేయడానికీ సహజంగానే  చాలా తేడా ఉంది. మొదటిదాంట్లో ముళ్ళ బాధలు మనవైతే, రెండోదాంట్లో మరొకరివి. పైగా, ఈ మరొకరు మనకోసమని ఆ ముళ్ళని వాళ్ళే భరిస్తున్నారన్న మాట. గొప్ప విషయం కదూ. అలా భరిస్తున్నారంటే, వాళ్ళ దృష్టిలో మనమెంత ప్రత్యేకమో! మనమూ అంతే, అవతలి వాళ్ళు ఎంతో దగ్గరి వాళ్ళైతే తప్ప ఎలాంటి రిస్కులూ తీసుకోడానికి ఇష్టపడం. అనగా, చూస్తూ చూస్తూ ముళ్ళ జోలికి వెళ్ళం.

పూలమీద నడవాలని ఎవరికుండదు కనుక? కోరుకున్న అందరికీ పూలబాట దొరికేస్తుందా అంటే, అదంత సులువు కాదు. ఏ కొందరికో తప్పించి, రాళ్ళూ ముళ్ళూ దాటిన తర్వాతే పూలు కనిపిస్తాయి నడిచే దారిలో. అప్పటివరకూ అలసిన పాదాలకి ఒక్కసారిగా విశ్రాంతి దొరకడం వల్ల కాబోలు, ఆ పూలు మరింత మృదువుగా, పరిమళ భరితంగా అనిపిస్తాయి. వాడుక కూడా 'ముళ్ళూ-పూలూ' అనే.. ప్రస్తుతం ఉన్నది ముళ్ళ మీదే అయినా, త్వరలోనే పూలు కనిపిస్తాయన్న సూచన వినిపిస్తుంది ఈ వాడుకలో.

కొందరు కవులు జీవితాన్నీ, మరికొందరు కవులు యవ్వనాన్నీ పూలతోటతో పోలుస్తూ ఉంటారు. ఏ తోటా ఆరుగాలం విరగబూయదు కదా. అదే పూలబాట అయితే, స్థలకాలాదులతో నిమిత్తం లేకుండా పూలు పరచబడి ఉంటుంది. ప్రయాణం సుఖవంతమవుతుంది. కానైతే, బతుకు ప్రయాణంలో ఎంత దూరంపాటు ఈ బాట ఉంటుందన్నది ముందుగా తెలిసే అవకాశం లేదు. కాళ్ళకింద నలిగే వాటితో నిమిత్తం లేకుండా ప్రయాణం సాగిపోతూనే ఉంటుంది. అవి రాళ్ళవ్వచ్చు.. ముళ్ళవ్వచ్చు.. పూలూ కావొచ్చు.

శుక్రవారం, అక్టోబర్ 31, 2014

సిరికాకొలను చిన్నది

శ్రీకాకుళం ఓ అందమైన పల్లెటూరు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న ప్రధాన ఆకర్షణ అతి పురాతనమైన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆలయం. కళ్ళు చెదిరే శిల్ప సౌందర్యం ఈ ఆలయం ప్రత్యేకత. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు 'ఆముక్త మాల్యద' కావ్యాన్ని రచించింది ఈ ఆలయంలోనే అనే ప్రతీతి. ఈ ఆలయాన్ని గురించి ఎన్నో.. ఎన్నెన్నో కథలు. వాటిలో ఒకటి 'సిరికాకొలను చిన్నది.'

ఆంధ్ర మహావిష్ణువు ఆలయాన్ని ఆనుకుని ఉన్న సిరికాకొలనులో పుట్టిన ఒకానొక అందమైన పద్మం అలివేణి. ఆ వెలది ఆటవెలదే, కానీ 'వెల'ది కాదు. ఆటపాటల్లో మేటి అయిన పసిమి ప్రాయపు అలివేణి మనసు ఆంధ్ర మహావిష్ణువుకి అంకితం. ఆమె ఆటా, పాటా ఆ స్వామి సేవకి మాత్రమే. అటువంటి అలివేణిపై రాజోద్యోగి ఒకడు మనసు పడ్డాడు. కూతురి ద్వారా ధనార్జన చేయాలన్న ఆశచేత కన్నుమూసుకుపోయిన వేశ్యమాత రంగాజమ్మ అతనికి సహకరించింది. ఫలితంగా, అందమైన ఆ పద్మం వాడిపోయే పరిస్థితి వచ్చింది. తర్వాత ఏం జరిగిందన్నదే వేటూరి సుందర రామ్మూర్తి రాసిన సంగీత నాటిక 'సిరికాకొలను చిన్నది.'


నిత్య యవ్వనుడు వేటూరి తన ముప్ఫై మూడో ఏట రాసిన ఈ నాటిక, మరి నాలుగేళ్ల తర్వాత ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యింది. సినీ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు స్వరపరిచిన ఈ నాటిక, తెలుగు వారి అదృష్టవశాన ప్రసారభారతి ఆర్కీవ్స్ నుంచి బయటపడి, వారి మార్కెటింగ్ విభాగం ద్వారా ఆడియో డిస్క్ రూపంలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. సుమారు తొంభై నిమిషాల వ్యవధి ఉన్న సంగీత నాటకాన్ని తనికెళ్ళ భరణి పరిచయ వాక్యంతో మార్కెట్ చేస్తోంది ప్రసారభారతి. వేటూరి అభిమానులు కొందరు ఈ స్క్రిప్టుని పుస్తక రూపంలోనూ తీసుకువచ్చారు.

'మనుచరిత్ర' ని అల్లసాని పెద్దన నుంచి అంకితం అందుకున్న శ్రీకృష్ణదేవరాయలు, ఆ సంబరం తర్వాత అలివేణి నాట్యాన్ని తిలకించి, ఆమెని సత్కరించాలనే సంకల్పంతో 'ఆనెగొంది' స్థానాపతి మార్తాండ  శర్మని శ్రీకాకుళం సమీపంలోని దేవరకోట మండలాధిపతిగా బదిలీ చేసి, అలివేణిని ఆస్థాన నర్తకిగా నియమిస్తాడు. అలివేణి మీద మనసు పడతాడు మార్తాండ శర్మ. ఆస్థాన నర్తకికి రాయలు తరపున రాసి ఇవ్వవలసిన తూర్పు భూముల బదిలీ సమయంలో అలివేణి తల్లి రంగాజమ్మతో పరిచయం అవుతుంది శర్మకి. అప్పటికే కూతురి  విష్ణుభక్తిని చూసి విసిగిపోయిన రంగాజమ్మ, మార్తాండ శర్మ అలివేణికి దగ్గరయ్యే ఉపాయం చెబుతుంది.

రంగాజమ్మ సలహా ప్రకారం, ఆంధ్ర మహావిష్ణువు ఆలయంలో మూలవిరాట్టు శేషవస్త్రాన్ని, ఆభరణాలని ధరించి అలివేణి సరసకి చేరిన మార్తాండ శర్మ, తను సాక్షాత్తూ ఆమె సేవిస్తున్న భగవంతుడిని అని నమ్మిస్తాడు. ఇట్టే మాయలో పడిపోయిన అలివేణి, మార్తాండ శర్మకి తనని తాను అర్పించుకుంటుంది. మార్తాండ శర్మ ద్వారా అందే కానుకల మీద చిన్నచూపు మొదలవుతుంది రంగాజమ్మకి. తన కూతురి ద్వారా ఇంకా ఎక్కువ సొమ్ము సంపాదించవచ్చన్న ఆలోచన ఆమెది.

ఈ క్రమంలో, ప్రభువు సన్నిధిలో నాట్యం చేస్తూ కళ్ళుతిరిగి పడిపోయిన అలివేణి 'గర్భవతి' అని రాజవైద్యుడు తేల్చడంతో తీవ్రమైన వేదనలో మునిగిపోతాడు శ్రీకృష్ణదేవరాయలు. మార్తాండ శర్మని బదిలీ చేయడం వల్లే ఇదంతా జరిగిందన్న చింత మొదలవుతుంది. జరిగిన దానిలో రంగాజమ్మ పాత్ర కూడా ఉందన్నది విచారణలో తెలుస్తుంది. జరిగిన మోసం అలివేణి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? రాయలు ఆమెకి న్యాయం చేయగలిగాడా? అన్నది ఆసక్తికరమైన ముగింపు.


సంగీత నాటిక అవ్వడం వల్ల, సంభాషణలు తక్కువగానూ, పాటలు ఎక్కువగానూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అలివేణి పాత్ర పోషించిన శ్రీరంగం గోపాలరత్నం గురించి. 'చినదానరా.. వలచిన దానరా..' అన్న జావళి అయినా, 'గోవర్దన గిరిధారీ..' అన్న భక్తిగీతమైనా మళ్ళీ మళ్ళీ వినాల్సిందే. ఇక సంభాషణల్లో అమాయకత్వం, భక్తిపారవశ్యం కలగలసి అలివేణి పాత్ర కళ్ళముందు కదలాడుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది రంగాజమ్మ పాత్ర పోషించిన పి. సీతరత్నమ్మని గురించి. ధనాశ మెండుగా ఉన్న వృద్ధ వేశ్యమాతకి తన గొంతుతో రూపు కట్టేశారు.

ఇక, వేటూరి ప్రతిభ ప్రతిక్షణం ప్రత్యక్షమవుతుంది. అలంకారాలని వాడుకున్న తీరు అద్భుతం. పదాలని విరిచి శ్లేషలతో సంభాషణలు నడిపారు. ఎంత చక్కని తెలుగసలు!! వినాలే తప్ప మాటల్లో చెప్పడం కష్టం. "రాయెక్కడైనా రాయలవుతుందా?" "దేవదాసీ అంటే గుడిసొత్తు మడిగట్టుకోమన్నారు కానీ, మడి కట్టుకు బతకమన్నారా?" లాంటి ప్రశ్నలు విన్నప్పుడు, వేటూరిలోని సంభాషణల రచయితను సినిమా రంగం ఎందుకు ఉపయోగించుకోలేకపోయిందో కదా అనిపించక మానదు. నాటితరం రేడియో శ్రోతలని మాత్రమే కాదు, నేటితరం సంగీత, సాహిత్యాభిమానులనీ అలరించే నాటిక ఇది. (ప్రసార భారతి మార్కెట్ చేస్తున్న ఆడియో డిస్క్ వెల రూ. 195).

శనివారం, అక్టోబర్ 25, 2014

'మా తండ్రి శేషయ్య గారు'

నీలంరాజు వేంకట శేషయ్య.. ఈ పేరుని ఈతరం సాహిత్యాభిమానులకి పరిచయం చేయాలి అంటే, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆత్మకథ 'అనుభవాలూ-జ్ఞాపకాలూను,' బుచ్చిబాబు నవల 'చివరకి మిగిలేది' లని తెలుగు పాఠకులకి తొలిసారిగా అందించిన 'నవోదయ' పత్రిక సంపాదకుడు అని చెప్పాలి. సినీ అభిమానులకైతే తొలితరం తెలుగుసినిమా 'ఉషా పరిణయం' లో కథానాయకుడు అని చెప్పాలి. రాజకీయ రంగంవారికి చెప్పేప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు మొదలు నీలం సంజీవరెడ్డి వరకూ ఎందరో నాయకులకి ఆంతరంగికుడు అని చెప్పడం మర్చిపోకూడదు.

సంగీతాభిమానుల దగ్గర ప్రస్తావించేప్పుడు భద్రాచలంలో 'రామదాస ధ్యానమందిరం' రూపశిల్పి అనీ, 'వాగ్గేయకార వార్షికోత్సవం' ఏర్పాటు చేసిన సంగీత పిపాసి అనీ చెప్పకపోతే ఎలాగ? ఇక భక్తులకైతే, కంచి పరమాచార్యుల వారి ప్రియశిష్యుడు అనీ, 'నడిచే దేవుడు' పుస్తక రచయిత అనీ చెబితే చాలు. అంతేనా? 'స్వరాజ్య' మొదలు 'ఆంధ్రప్రభ' వరకూ తెలుగు పత్రికల్లో అనేక హోదాల్లో పనిచేసి, స్వతంత్ర పోరాటం మొదలుగా ఎన్నో విశేషాంశాలని గురించి విశ్లేషణలు అందించిన జర్నలిస్టు, సంగీత, సాహిత్య, కళా, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాల్లో ఎందరికో ఆప్తుడు, స్నేహశీలి.. ఒక్కమాటలో చెప్పాలంటే 'బహుముఖ ప్రజ్ఞాశాలి.'

ఎందరెందరో ప్రముఖుల గురించి ఎన్నో వార్తలు రాసి, ఇంటర్యూలు చేసిన వేంకట శేషయ్య తన కథని తను రాసుకోలేదు. ఆయన మరణానంతరం, పెద్దకొడుకు నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ 'మా తండ్రి శేషయ్య గారు' పేరిట అక్షరబద్ధం చేసిన పుస్తకంలో అనేక ఉద్యమాల నడుమ సాగిన తన తండ్రి ఎనభయ్యేడేళ్ళ జీవితాన్ని రేఖామాత్రంగా స్పృశించారు. ఒంగోలు జిల్లా నూతలపాడు లో 1905 లో జన్మించిన వేంకట శేషయ్య హైస్కూలు చదువుకి వచ్చేసరికి దేశంలో జాతీయోద్యమం ఊపందుకుంది. 'ఆంధ్ర రత్న' దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్పూర్తితో హైస్కూల్ బాయ్ కాట్ చేసి ఉద్యమంలోకి దూకిన శేషయ్య, జాతీయ పాఠశాలలో తెలుగు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం ఆయన జీవితంలో మొదటి మలుపు.


స్వాతంత్రపోరాటంలో తలమునకలుగా పాల్గొంటూ, 'స్వరాజ్య' పత్రికని ఒక ఉద్యమంగా నిర్వహిస్తున్న టంగుటూరి ప్రకాశం పంతులికి అదే సమయంలో తెలుగు షార్ట్ హ్యాండ్ తెలిసిన సహాయకుడు అవసరం కావడంతో ఆ అవకాశం శేషయ్యని వెతుక్కుంటూ వచ్చింది. ప్రకాశం దగ్గర పనిచేసింది కేవలం ఒక్క  సంవత్సరమే అయినా, ఆ ఒక్క ఏడాదిలోనే ఎన్నో పనులు నేర్చుకున్నారు, ఎందరినో పరిచయస్తులుగా చేసుకున్నారు. ముఖ్యంగా, ప్రకాశం పంతులు ఉపన్యాసాలని 'స్వరాజ్య' పత్రికకి రాసి పంపడం ద్వారా జర్నలిజం మీద ఆసక్తి మొదలయ్యింది. అటుపై వరుసగా 'ఆంధ్ర పత్రిక' 'ఆంధ్రప్రభ'లలో ఉద్యోగాలు, 'నవోదయ' వారపత్రిక స్థాపన, నిర్వహణ. ఐదేళ్ళ తర్వాత 'ఆంధ్రప్రభ' కి పునరాగమనం. ఈమధ్యలో సినిమాలు, సంగీతం, నాటకాలు, సాహిత్యం, ఆధ్యాత్మిక చింతన.. ఎన్నో, ఎన్నెన్నో.

ప్రభుత్వోద్యోగంలో పదవీ విరమణ చేసిన నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ పేరు దినపత్రికలు చదివే వారికి, మరీ ముఖ్యంగా ఎడిటోరియల్ పేజీల్లో ఆధ్యాత్మిక వ్యాసాలు చదివేవారికి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నాటి ఆంధ్రప్రభ లో 'ఆలోకన' మొదలు నేటి సాక్షి లో 'జ్యోతిర్మయం' వరకూ ఆయన వ్యాస పరంపర కొనసాగుతూనే ఉంది. వేంకట శేషయ్య పెద్ద కొడుకుగా తండ్రిని బాగా దగ్గర నుంచి చూసే అవకాశం దొరకడంతో, ఎన్నో విషయాలని సాధికారికంగా రాయగలిగారు లక్ష్మీ ప్రసాద్. ముఖ్యంగా, 'నవోదయ' పత్రికలో ఆయనకూడా స్వయంగా పాలుపంచుకోడం వల్ల ఆ పత్రిక్కి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆయన సోదరుడు, ప్రముఖ చాయాచిత్రకారుడు, పాత్రికేయుడు నీలంరాజు మురళీధర్ ఛాయా చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ.

పారితోషకం కోసం శ్రీశ్రీ అప్పటికప్పుడు పత్రికాఫీసులో కూర్చుని అడిగిన ఆర్టికల్ రాసిచ్చిన వైనం మొదలుకొని, నార్ల వెంకటేశ్వర రావు-ఎన్జీ రంగా ల మధ్య జరిగిన సైలెంట్ వార్ వరకూ, టంగుటూరి ప్రకాశం పంతులు ధృఢ చిత్తం మొదలు నేదురుమిల్లి జనార్ధనరెడ్డి సౌశీల్యం వరకూ ఆశ్చర్యం కలిగించే సంగతులెన్నో అడుగడుగునా కనిపిస్తాయీ పుస్తకంలో. కేవలం వేంకట శేషయ్య వ్యక్తిత్వం మాత్రమేకాదు, ఆయన చుట్టూ ఉన్న వారిని గురించి ఎన్నో సంగతులూ సందర్భోచితంగా ప్రస్తావించారు లక్ష్మీప్రసాద్. ఒకటిరెండు పునరుక్తులు, కాసిన్ని ముద్రారాక్షసాలు ఉన్నా,  అవేవీ ఆపకుండా చదివించడాన్ని ఆపగలిగేవి కాదు. వెనుకటి  తరం జీవితాలని గురించి ఆసక్తి ఉన్నవారు మెచ్చే రచన ఇది. (నవోదయ బుక్ హౌస్ పంపిణీ, పేజీలు 243, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

బుధవారం, అక్టోబర్ 15, 2014

ఒకానొక పాట

"ఓ గాలీ, నువ్వు వెదురు సందుల్లో సంగీతం పాడడమేమిటి? శరదృతువులో వేణుగానానికి నెమలి పురివిప్పి ఆడడమేమిటి? మేఘం వెళ్ళే దారిలో మనసు తేలిపోతుంది ఎందుకని? బంధించబడి ఉన్న పుష్పం, గాలిసోకగానే రేకులు విచ్చుకుంటుంది ఎందుకని?" ...మలయాళ సినీ గేయరచయిత రఫీక్ అహ్మద్ రచించిన ఒకానొక పాట మూలార్ధానికి కొంచం దగ్గరగా ఉండే అనువాదం ఇది. అర్ధం నిన్న మొన్ననే తెలిసినా, దాదాపు పదిరోజులై ఆ పాట చెవుల్లో మారుమోగుతోంది.

"కాథే కాథే నీ పుక్కామరథిల్ పాట్టుం మూళి వణ్నో..." ఎలా ప్రవేశించిందో కానీ ఓ పది రోజుల క్రితం ఈ పాట మా ఇంట్లో ప్రవేశించింది, చాలా మామూలుగా. అలనాటి 'లవకుశ'లో సీతమ్మ వేషంలో ఉన్న అంజలీదేవి అడవులకి ప్రయాణమైనప్పుడు వినిపించే నేపధ్యసంగీతాన్ని జ్ఞప్తికి తెచ్చే ఆరంభం.. అటుపై రెండు చిత్రమైన గొంతుల్లో ఏమాత్రం అర్ధం కాని పదాలు.. భాష తెలియకపోతేనేం, ఆ గొంతుల్లో వినిపించిన ఏదో తెలియని ఆర్ద్రత కట్టిపడేసింది. మరీ ముఖ్యంగా ఆ స్త్రీ గొంతు. అదిమొదలు, ఆ పాట మరుమోగడం మొదలైంది.


"నిన్న అనేది వట్టి కల.. నేడు అనేది కొత్త జ్ఞాపకం.. శోకాన్ని మోసిన భుజాలపై వాలడానికి వస్తోంది కొత్త వెన్నెల.. కుడిచి కుడిచి పాలు తాగే ముద్దుల దూడలు, చిన్ని చిన్ని పువ్వుల్లో ఉయ్యాలలూగే చిరుగాలులు, తేనె పలుకులెన్నింటినో చెబుతున్నాయి.. " ...దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఏమాత్రం తోచని ఈ భావానికి అర్ధాన్ని వెతుక్కోడం కన్నా ముందే, పాట పూర్వాపరాల గురించిన వెతుకులాట మొదలయ్యింది. 'సెల్యులాయిడ్' పేరుతో గత సంవత్సరం మలయాళంలో విడుదలైన సినిమా, 'జేసీ డేనియల్' పేరిట తమిళంలోకీ అనువాదం అయ్యింది. మలయాళ సినిమా పరిశ్రమకి మూలపురుషుడైన జేసీ డేనియల్ జీవిత కథ ఆధారంగా కమల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పృధ్వీరాజ్, మమత మోహన్ దాస్, చాందిని ముఖ్యపాత్రలు పోషించారు. తమిళ వీడియోల్లో  "కాత్రే కాత్రే..." దొరికింది.


"అందాల ఆకాశంలో వేయి చిలుకలు ఎగురుతున్నాయి.. పరిచయమైన చిలుకలు తూరుపు దిక్కున ఇంద్ర ధనుస్సుని చిత్రిస్తున్నాయి.." ...తమిళ వీడియోలో గాయని రికార్డింగ్ లో పాడుతోంది. ఆమె పేరు 'వైకోమ్' విజయలక్ష్మి. విలక్షణమైన గాత్రం. నాటి మేటి గాయని పి. లీల గొంతుని లీలగా గుర్తుచేసే గమకాలు. ఎంత అలవోకగా పాడేసిందసలు! గాయని వివరాలు వెతకడం మొదలయ్యింది. కేరళ లోని వైకోమ్ లో పుట్టిపెరిగిన విజయలక్ష్మికి ఎవరిదగ్గరా అభ్యసించకుండానే సంగీతం పట్టుపడింది, అదికూడా చిన్ననాడే. అంతేకాదు, 'గాయత్రివీణ' గా పిలవబడే ఏక తంత్రి వీణ మీద ఎలాంటి పాటనైనా సరే ఒకసారి వింటే చాలు అలవోకగా పలికించేయగలదు!! యూట్యూబ్ లో ఎన్ని వీడియోలో..

"మిణుగురు కళ్ళలో నక్షత్రాలు పూస్తున్నాయి.. మువ్వల సవ్వడిలో కీర్తనలు వినిపిస్తున్నాయి.. సమయం వచ్చింది, పూయడానికి.." ...పట్టలేనంత ఆనందం కలిగినప్పుడు దాన్ని ఎవరితోనన్నా పంచుకోవాలి అనిపించడం అత్యంత సహజం. తమిళ వీడియో కనిపించగానే, తమిళం-తెలుగు బాగా తెలిసి, సంగీతాన్ని బాగా ఇష్టపడే ఓ మిత్రుడికి షేర్ చేశాను. తన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్. నేనడిగిందే తడవుగా తమిళ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి ఇచ్చారు. "ఇది ట్యూన్ కి రాసినట్టుగా అనిపిస్తోంది, మలయాళీ మిత్రులెవరికన్నా ఒరిజినల్ పాట వినిపించి అర్ధం తెలుసుకోవాలి,"  రాత్రి తను పంపిన మెయిల్ సారాంశం ఇది.

"కాథే కాథే నీ పుక్కామరథిల్ పాట్టుం మూళి వణ్నో..." ...అవార్డులందుకున్న ఈ పాట ఏ పని చేస్తున్నా వెంటాడుతోంది. చివరికి నిద్రలో కూడా వదిలిపెట్టడం లేదు. అవును మరి.. జోలపాట, మేలుకొలుపు కూడా ఈ పాటే అవుతోంది కదూ. ఉదయం నిద్ర లేచేసరికి ఫోన్ లో టెక్స్ట్. మిత్రుడి నుంచి.. అర్ధరాత్రి దాటాక పంపిన సందేశం. "ఇప్పటివరకూ ఇరవైతొమ్మిది సార్లు విన్నానీ పాట.. సింప్లీ ఆసం.." ...ఇంకా ఏదో చెప్పాలనిపించి, చెప్పలేకపోవడం అర్ధమయ్యింది. అది నాకూ అనుభవమే. అనుభూతిని అక్షరాల్లో పెట్టడం అన్నది ఎల్లవేళలా సాధ్యం కాదు.. మరీ ముఖ్యంగా ఓ జేసుదాసునీ, ఓ 'వైకోమ్' విజయలక్ష్మినీ విన్నప్పుడు కలిగే అనుభూతిని. అది, ఎవరికివాళ్ళు పొందాల్సిందే.. మరో దారిలేదు.

మంగళవారం, అక్టోబర్ 14, 2014

తీపిగురుతులు - చేదుజ్ఞాపకాలు

తెలుగు సినిమా పరిశ్రమకి రెండు కళ్ళు అనిపించుకున్న ఎన్టీఆర్-ఏఎన్నార్ ల సమవయస్కుడు. కానీ, కెరీర్ ఆరంభం నుంచే వాళ్ళకి తండ్రి, తాతగా నటించాడు. తనకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళయిన నటీమణులకి భర్త వేషం వేసి మెప్పించాడు. తెలుగుదనం అనగానే గుర్తొచ్చే నిలువెత్తు శాంత స్వరూపం గుమ్మడి వెంకటేశ్వరరావు. 'గుమ్మడి నాన్న' తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఉంటారా? ఆ ప్రేక్షకులకి తన గురించి, తను చేసిన సినిమాల గురించీ మరోవిధంగా తెలియడానికి అవకాశం లేని ఎన్నో విషయాలకి అక్షర రూపం ఇస్తూ గుమ్మడి రాసిన పుస్తకం 'తీపిగురుతులు - చేదుజ్ఞాపకాలు.'

గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణం పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది సాహిత్యం. ఆ వెనుకే నాటకరంగం. 'ఆంధ్రా పారిస్' అన్న ముద్దు పేరు ఉండనే ఉంది కదూ. ఆ తెనాలికి దగ్గరలో ఉన్న రావికంపాడు అనే పల్లెటూరు గుమ్మడి స్వస్థలం. వ్యవసాయం చేసుకునే ఉమ్మడి కుటుంబం. చదువంటే, మరీ ముఖ్యంగా తెలుగంటే చిన్నప్పటినుంచీ చాలా ఇష్టం గుమ్మడికి. తెలుగు మీద ఇష్టం పద్యాలు నేర్చుకోడానికి దోహదం చేస్తే, పద్యం కర్ణపేయంగా చదవగలిగే నేర్పు నాటకాల్లో అవకాశాలు ఇప్పించింది. చదువు, నాటకాలు.. స్కూలు చదువు అవుతూనే పెళ్లి.. వ్యవసాయం మీద ఆసక్తి లేకపోవడంతో తెనాలిలో చిన్న వ్యాపారం ఆరంభించడం.. ఇక్కడే ఊహించని మలుపు తిరిగింది జీవితం.

సినిమాల మీద గుమ్మడికి ఎటువంటి అభిప్రాయమూ లేదు. కానీ, ఆయన సినిమాలకి పనికొస్తాడని దగ్గరి బంధువుల, ప్రాణ స్నేహితుల నమ్మకం. ఆ నమ్మకమే, గుమ్మడి తరపున ఆయన కోసం వాళ్ళని సినిమా వేషాలు వెతికేలా ప్రయత్నించింది. విజయా సంస్థలో భాగస్వామ్యం కోసం తెనాలి లో ఉన్న తన ఆస్తి అమ్మకం కోసం వచ్చిన చక్రపాణికి గుమ్మడిని పరిచయం చేశారు స్నేహితులు. గుమ్మడిని పరిచయం చేస్తూ "ఈ కుర్రవాడేనండీ నే చెప్పిందీ. నాటకాలే కాకుండా సినిమాలలో కూడా నటించాలనే కోర్కె ఉంది. చదువుకున్నవాడు, మనవాడు," అనడంతోనే చక్రపాణి "సినిమాలలో 'తన' 'మన' అనేవి లాభం లేదు. చదువు, సంస్కారాలు ఏవీ అక్కరకి రావు," అనేశారు.


అక్కినేనితో 'దేవదాసు' నిర్మించిన వినోదా సంస్థ నిర్మాతల్లో ఒకరైన డి.ఎల్. నారాయణ ద్వారా తొలి సినిమా అవకాశం వచ్చింది గుమ్మడికి. చిన్న చిన్న వేషాలు, అంతంత మాత్రం సంపాదన. వచ్చేది ఖర్చులకి ఏమాత్రం చాలకపోవడంతో నెలనెలా  ఇంటికి రాసి డబ్బు తెప్పించుకోడం అలవాటుగా మారింది. అప్పటికే హీరోగా కుదురుకున్న ఎన్టీఆర్ బడ్జెట్ పాఠాలు చెప్పేశారు గుమ్మడికి. "నాకు నెలకి ఐదువందలు జీతం వస్తుంది. ఇది కాకుండా సినిమా మొత్తానికి ఐదువేలు. అంటే నెలకు సుమారుగా వెయ్యి రూపాయలు. నాకు అయ్యే ఖర్చు వంద రూపాయలు మాత్రమే. రూము రెంటు యాభై, కేరేజీ పాతిక రూపాయలు. తక్కిన అమాబాపతు ఖర్చులు పాతిక. మరి మీరు అలా ఖర్చు పెడితే ఎలా?" అన్న ఎన్టీఆర్ ప్రశ్నకి జవాబు లేదు గుమ్మడి దగ్గర.

గుమ్మడి పర్సనాలిటీ చూసి హీరో వేషాలు రాకపోలేదు. కానీ, కేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడితేనే ఎక్కువ రోజులు సినిమాల్లో ఉండగలవు అని చక్రపాణి చెప్పిన సలహాని పాటించారు. తనకి హాస్య పాత్రలంటే ప్రత్యేకమైన ఇష్టం ఉన్నా, ఆ తరహా పాత్రలు చాలా తక్కువగానే వచ్చాయి అంటారు గుమ్మడి. పరిశ్రమలో అందరితోనూ కలుపుగోలుగా, అజాతశత్రువుగా ఉండాలన్న గుమ్మడి ప్రయత్నం ఫలించని సమయం ఒకటి ఉంది. అక్కినేని హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియో నిర్మిస్తున్న సమయంలో ఎన్టీఆర్-ఏఎన్నార్లమధ్య అపార్ధాలు పొడసూపినప్పుడు ఆ ఇద్దరూ కూడా మొదట గుమ్మడిని అపార్ధం చేసుకుని ఆపై అర్ధం చేసుకున్నారు. ఇలాంటి చేదు జ్ఞాపకాలని రేఖామాత్రంగా ప్రస్తావించి, తీపి గురుతుల గురించి మాత్రం విశదంగా రాశారీ పుస్తకంలో.

గీతరచయిత సి. నారాయణ రెడ్డి, నవలా రచయిత్రి దద్దనాల రంగనాయకమ్మ, నాటక రచయిత మోదుకూరి జాన్సన్.. వీళ్ళంతా సినిమా రంగానికి పరిచయం అవ్వడం వెనుక పూనిక గుమ్మడిదే. నాటకాలన్నా, సినిమాలన్నా ప్రాణం పెట్టే డాక్టర్ గాలి బాల సుందరరావు గారి ఏకైక పుత్రిక జలంధరకి పెళ్లి సంబంధం చూడడంలోనూ (వరుడు సినీ నటుడు చంద్రమోహన్) గుమ్మడిది కీలక పాత్రే. సినీ నటిగా సావిత్రి ప్రస్థానాన్ని తొలినుంచి చివరివరకూ దగ్గరినుంచి గమనించిన కొందరిలో గుమ్మడి ఒకరు. ఆమె వ్యక్తిత్వం గురించి రాసిన విశేషాలు ఆశ్చర్య పరుస్తాయి. చిత్తూరు నాగయ్యన్నా, అటెన్ బరో తీసిన 'గాంధీ' సినిమా అన్నా ఒళ్ళు మర్చిపోయేంత ఇష్టం గుమ్మడికి. ఒక్కమాటలో చెప్పాలంటే నాగయ్యలాంటి నటుడూ, వ్యక్తీ లేడు.. గాంధీ లాంటి మరో సినిమా లేదు అంటారు.

తన డెబ్భై ఐదో ఏట 'ఆంధ్రజ్యోతి' లో సీరియల్ గా గుమ్మడి రాసిన కబుర్లకి విక్రమ్ పబ్లిషర్స్ సంస్థ 2001 లో పుస్తక రూపం ఇచ్చింది. గుమ్మడి పోషించిన పాత్రల అరుదైన స్టిల్స్, అనేకమంది ప్రముఖులు గుమ్మడిని గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలతో పాటు గుమ్మడి నటించిన సినిమాల జాబితాను అనుబంధంగా ఇచ్చారు. సినిమా అనుభవాలతో పాటు విదేశీ పర్యటనల విశేషాలనూ ప్రస్తావించారిందులో. గుమ్మడి మాటల్లాగే మృదువుగా సాగిపోయే కథనం ఆపకుండా చదివిస్తుందీ పుస్తకాన్ని. నాటి సినిమాలతో పాటు సామాజిక, రాజకీయ పరిస్థితులని గురించీ తెలుసుకునే అవకాశం ఇచ్చే రచన ఇది. (పేజీలు 190, వెల రూ. 100, 'విశాలాంధ్ర' అన్ని శాఖల్లోనూ లభ్యం).

సోమవారం, అక్టోబర్ 13, 2014

ప్రజలు.. ప్రభుత్వం.. ఒక ఐ.ఎ.ఎస్

ప్రభుత్వంలో ఉన్నతోద్యాలు చేసి పదవీ విరమణ చేసిన అధికారులందరూ వరుసగా తమ ఆత్మకథలని వెలువరిస్తున్నారు. అయ్యేయెస్, ఐపీఎస్ అధికారుల ఆత్మకథలు వరుసగా అందుబాటులోకి వస్తూ గడిచిన మూడు నాలుగు దశాబ్దాల పాలనలో, విధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో తెరవెనుక జరిగిన సంగతులు సామాన్యులు తెలుసుకోడానికి అవకాశం కల్పిస్తున్నాయి. పీవీఆర్కే ప్రసాద్  'అసలేం జరిగిందంటే,' మోహన్ కందా 'మోహన మకరందం' తర్వాత అదే వరుసలో డాక్టర్ కె.వి. రమణాచారి వెలువరించిన పుస్తకం ' ప్రజలు.. ప్రభుత్వం.. ఒక ఐ.ఎ.ఎస్'

కరీంనగర్ జిల్లా నారాయణపురంలో సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలో జన్మించిన రమణాచారి పాఠశాల రోజులనుంచే చురుకైన విద్యార్ధిగా పేరుతెచ్చుకుని, కళాశాలకి వచ్చేసరికి తెలంగాణా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని రుచిచూశారు. కాలేజీలో చేరేందుకు ప్రధానమైన అడ్డంకి పేదరికం. కాలేజీలో చేరి కేవలం చదువుతో సరిపెట్టుకోకుండా విద్యార్ధి ఉద్యమాల్లో పాల్గొన్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా, ఉద్యమాన్ని కూడా చదువులో భాగంగానే తీసుకున్నట్టున్నారు రమణాచారి. పీజీ చదివేందుకు పేదరికంతో పాటు సంప్రదాయమూ అడ్డొచ్చింది. ఎదిరించి మరీ పీజీ పూర్తిచేసి కళాశాల లెక్చరర్ గా జీవితం ఆరంభించారు.

జీవితం పెద్ద మలుపు తిరగడానికి కారణాలు సాధారణంగా చిన్నవే అయి ఉంటాయి. చాలా సందర్భాల్లో ఇవి, వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యం కలిగించేంత అతిచిన్నవి అవుతాయి. లెక్చరర్ గా పనిచేసే కాలంలో కిరోసిన్ రేషన్ లో తప్ప దొరకని పరిస్థితి. రేషన్ కావాలంటే కార్డు తప్పనిసరి. కొందరు లెక్చరర్లు రేషన్ కార్డు కోసం దరకాస్తు చేయడానికి రెవిన్యూ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓ చిరుద్యోగి చేతిలో జరిగిన అవమానం రమణాచారి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ పరిక్షలు రాయడానికి కారణం అయ్యింది. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించి భూ రాజస్వ మండలాధికారి (ఆర్డీవో) గా ఉద్యోగ జీవితం ప్రారంభించే నాటికి రమణాచారి వయసు కేవలం పాతికేళ్ళు.


రేషన్ కార్డు కోసం వెళ్ళినప్పుడు చూడడం తప్ప రెవిన్యూ ఆఫీసు ఎలా ఉంటుందో తెలియదు. ఎవరితో ఎలా మెలగాలో అంతకన్నా అవగాహన లేదు. ఫలితం, తొలి సంవత్సరం దాదాపు ప్రతి నెలా బదిలీలే. కాస్త కుదురుగా చేసిన ఉద్యోగం మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట ఆర్డీవో. అక్కడినుంచి రమణాచారికి బదిలీ అయినప్పుడు ఆ ప్రాంతం ప్రజలంతా బదిలీ ఆపాలంటూ రాస్తారోకో చేయడం, ఆర్డీవోగా ఆయన పనితీరుకి ఓ చిన్న మచ్చుతునక. టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కులీకుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ పాలనాధికారి బాధ్యత రమణాచారిని రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టిలో పడేలా చేసింది.

కడప కలెక్టర్ గా రమణాచారి బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలోనే, నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కి కడపలో జరిగిన బహిరంగ సభలో దారుణమైన అవమానం జరగడం, జరిగిన సంఘటనకి కారణం కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలే అయినప్పటికీ కలెక్టర్ ని బాద్యుడిని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రమణాచారిని బదిలీ చేయడం, ఇంతజరిగినా ఐఏఎస్ అధికారుల సంఘం నోరు మెదపకపోవడం.. అటుపై జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పీవీని రాష్ట్రానికి ఆహ్వానించి ఘనంగా సన్మానం చేసినప్పుడు సాంస్కృతిక శాఖ సంచాలకుడి హోదాలో రమణాచారే ఏర్పాట్లన్నీ స్వయంగా చూడడం... ఇదంతా ఆపకుండా చదివిస్తుంది.సంస్కృతిక శాఖ సంచాలకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాధ్యతలని ఎంతో ఇష్టంగా నిర్వహించారు రమణాచారి.

ఎన్టీఆర్, చంద్రబాబులతో సౌకర్యవంతంగా పనిచేయడాన్ని వివరంగా రాస్తూ, కాంగ్రెస్ టైం లో ఎదురైన ఇబ్బందులని రేఖామాత్రంగా ప్రస్తావించారు ఈ పుస్తకంలో.  పీవీఆర్కే, మోహన్ కందాలు తమ పుస్తకాలని తామే రాసుకోగా, రమణాచారి పుస్తకాన్ని పత్రికా రచయిత చీకోలు సుందరయ్య రాశారు. చదువుతుంటే "రమణాచారే స్వయంగా రాసి ఉంటే బావుండేది" అని ఎన్నోసార్లు అనిపించింది. ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ, కథనం విషయంలో సరైన శ్రద్ధ పెట్టలేదన్న భావన పదేపదే కలిగింది. తిరుమల 'కులశేఖరప్పడి ' ని 'కులశేఖరపది' అని రాశారు ప్రతిచోటా. కొన్ని కొన్ని ఎపిసోడ్స్ న్యూస్ పేపర్ క్లిప్పింగులని తలపించాయి. ఫోటోలన్నీ ఒక్కచోటే (చివర్లో) ఇవ్వడం మాత్రం మెచ్చుకోవాలి. (ఎమెస్కో ప్రచురణ, పేజీలు 208, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, అక్టోబర్ 06, 2014

మాటకి మాట

రాజకీయ నాయకులు ఎప్పుడూ వార్తల్లో ఉండాలని కోరుకుంటారు. మంచిగానా, చెడ్డగానా అన్నది అనవసరం. వార్తల్లో ఉండడమే ముఖ్యం వాళ్లకి. హాలీవుడ్, బాలీవుడ్ లతో సహా చాలా సినిమా పరిశ్రమల్లో కూడా ఈ ధోరణి ఉంది. తారలు వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు, కొండొకచో వివాదాస్పదమైన సంగతులూ తరచూ ప్రసార మాధ్యమాల్లో కనిపించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారన్నది బహిరంగ రహస్యం.

ఎందుకోగానీ, తెలుగు సినిమా పరిశ్రమలో మొదటినుంచీ కూడా ఈ ధోరణి కనిపించదు. ఇక్కడ సినిమా వాళ్ళ గురించి గాసిప్పువార్తల ప్రచారం కొంచం తక్కువే. అలాగే, వివాదాలు ఏమన్నా ఉన్నా అవి వార్తల్లో రావడానికి పెద్దగా ఇష్టపడరు  ఇక్కడి సినిమా జనం. తెలుగు సినిమా వాళ్ళు కొందరు రాజకీయాల్లోకి వెళ్ళినా, రాజకీయ నాయకులు అనుసరించే ప్రచార ధోరణులు సినిమా రంగంలోకి రాలేదనే చెప్పాలి. అయితే, ఇప్పుడిప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ కూడా వివాదాల ప్రచారంలో మిగిలిన భాషల్ని అనుసరిస్తోందేమో అన్న సందేహం కలుగుతోంది.

ఓ నటుడికీ, ఓ దర్శకుడికీ ఓ సినిమా షూటింగ్ లో మాటా మాటా పెరిగింది. ఆ నటుడు సినిమా నుంచి తప్పుకున్నాడు (లేదా దర్శకుడే తప్పించాడు). ఇలా నటులకీ దర్శకులకీ అభిప్రాయ భేదాలొచ్చి మాటామాటా పెరిగి, సినిమా తారాగణం మారిపోవడం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. భానుమతి మిస్సైన మిస్సమ్మ సినిమానే ఇందుకు సాక్ష్యం. (ఫలితంగానే తెలుగు పరిశ్రమకి సావిత్రి దొరికింది అనేవాళ్ళూ ఉన్నారు, అది వేరే విషయం). అయితే, ఇప్పటి తాజా సినిమా అలాంటిలాంటి సినిమా కాదు. అగ్రతారలున్న భారీ చిత్రరాజం.

తీరా సినిమా విడుదల అయ్యాక, అనుకున్నది ఒకటీ అయ్యింది మరొకటీ. బ్రహ్మాండం బద్దలు కొట్టేస్తుంది అనుకున్నది కాస్తా ఫలితం చూడబోతే పెట్టుబడి తిరిగి వస్తుందా అన్న సందేహాన్ని కలిగించింది. ఏదోలా జనం ఆ సినిమా చూసేలా చెయ్యాలి. ఎలాగా అని ఆలోచిస్తుండగా అల్లప్పుడెప్పుడో షూటింగులో జరిగిన వివాదం గుర్తొచ్చింది. సరిగ్గా అదే సమయంలో సినిమా నుంచి తీసివేయబడిన నటుడి మరో సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా కూడా అంచనాలని అందుకోడం కూసింత అనుమానాస్పదంగానే కనిపించింది.

అలనాటి వివాదాన్ని తవ్వితీస్తే ఉభయతారకంగా ఉంటుందని ఎవరికి అనిపించిందో కానీ, మొత్తానికి ఓ సరికొత్త వివాదం తెరమీదకి వచ్చింది. నటుడూ, దర్శకుడూ స్క్రిప్టు ప్రకారం డైలాగులు రువ్వుకున్నారు. ఇక్కడివరకూ బానే ఉంది. కానైతే, వీళ్ళిద్దరి పోరు వల్లా వాళ్ళ సినిమాల కలెక్షన్ల కన్నా ముందే టీవీ చానళ్ళ రేటింగులు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ప్రతి టీవీ చానలూ పూటా ఈ వివాదాన్ని గురించి వార్తా కథనాన్ని వండి వడ్డిస్తోంది. అసలు విషయంతో పాటు, ఆ దర్శకుడి, నటుడి పాత సినిమాల్లో క్లిప్పింగులూ అవీ చూపిస్తోంది కూడా.

ఈ మాటల యుద్ధం రెండు సినిమాలకీ ఏమాత్రం సాయ పడుతుందో తెలీదు కానీ, టీవీ చానళ్ళకీ, గాసిప్ వెబ్సైట్లకీ మాత్రం కావలసినంత ముడిసరుకుని అందిస్తోంది. ఇక్కడో చిన్న పిడకల వేట.. ఒకానొక చానల్లో వివాదం తాలూకు ప్రత్యేక కార్యక్రమం మధ్యలో వచ్చిన బ్రేక్ లో ఓ ప్రకటన వచ్చింది. "మన పెద్ద కొడుకు ఇచ్చాడు" అంటూ ఓ ముసలాయన ఫెళఫెళ్ళాడే కొత్త వెయ్యిరూపాయల నోటుని భార్యకి చూపించడం, ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫోటోని గోడకున్న దేవుళ్ళ ఫోటోల పక్కన తగిలించడం ఆ ప్రకటన సారాంశం. "అన్నయ్య నా అప్పు మొత్తం తీర్చేశాడు," అంటూ ఆ దంపతుల కొడుకు - వ్యవసాయం చేసుకుంటూ - ఆనందంగా చెప్పే ప్రకటన ఎప్పుడు వస్తుందో  కదా..

ఆదివారం, అక్టోబర్ 05, 2014

ఆర్తి

ఏడాదికి రెండే పండుగలు. అవిటి (రథోత్సవం), సంకురాత్తిరి. రెండు పండగలకీ ఆడపిల్లని పుట్టింటికి తీసుకెళ్లడం విధాయకం అంటుంది ఎర్రెమ్మ. కూతురు సన్నెమ్మని అదే ఊళ్ళో ఉండే బంగారమ్మ కొడుకు పైడయ్యకి ఇచ్చి పెళ్లి చేసింది నాలుగైదేళ్ళ క్రితం. పల్లెలో చేయడానికి పనిలేక, 'కళాసీ' పని వెతుక్కుంటూ పట్నం వెళ్ళిపోయాడు పైడయ్య. ఖర్చులు భరించలేక అక్కడ కాపురం పెట్టలేదు. ఎర్రెమ్మ మాత్రం సంప్రదాయం తప్పకుండా ఏటా రెండు పండగలకీ కూతుర్ని తీసుకెళ్ళి నెలేసి రోజులు ఉంచుకుని పంపుతోంది. ఇదిగో, ఈ తీసుకెళ్లడం దగ్గరే తగువు మొదలయ్యింది.

బంగారమ్మకి ముగ్గురు కొడుకులు. మూడోవాడు పైడయ్య. పెద్దకొడుకు నారాయుడు భార్య పిల్లల్ని కని కాలం చేసింది. రెండో కొడుకు కోటయ్య భార్య పురిటికి పుట్టింటికి వెళ్ళింది. బంగారమ్మకి చెయ్యి సాయం ఉండే కోడలు సన్నెమ్మ ఒక్కర్తే. అయినా కూడా, కోడలు అవిటికీ, సంకురాత్తిరికీ పుట్టింటికి వెళ్ళడం, వెళ్ళినప్పుడల్లా నెలేసి రోజులు ఉండిపోవడం అభ్యంతరం లేదు బంగారమ్మకి. ఆమె అభ్యంతరమల్లా ఒక్కటే, రెండు పండగలకీ కూడా ముందు రోజున పుట్టింటికి వెళ్లి పండగ అయ్యాక నెల్లాళ్ళూ ఉండి రమ్మంటుంది.

ప్రతిసారీ కూడా, నెల ముందు తీసుకెళ్ళి, పండగవుతూనే పంపేస్తుంది ఎర్రెమ్మ. పైగా, నాకూతుర్ని ఎప్పుడు తీసుకెళ్ళాలో  నాకొకరు చెప్పడవా? అంటుంది నోరుగల ఎర్రెమ్మ. చినికి చినికి గాలివానగా మారిన ఆ తగువు, పైడయ్య-సన్నెమ్మ యిడబావులు (విడాకులు) పెట్టుకోడానికి సిద్ధపడే దగ్గరికి వచ్చేసింది ఆ సంకురాత్తిరి పండుగనాటికి. రెండు కుటుంబాలూ రోడ్డున పడి కొట్టేసుకున్నాక, అసిర్నాయుడు గారి సమక్షానికి వెళ్ళింది తగువు. అసిర్నాయుడు ఆ తగువు ఎలా తీర్చాడు? పైడయ్య-సన్నెమ్మ కలిశారా లేదా అన్నదే తెలుగు సాహితీ లోకం కారా మేష్టారుగా పిలుచుకునే కాళీపట్నం రామారావు నాలుగున్నర దశాబ్దాల క్రితం రాసిన 'ఆర్తి' కథ.

సుందరపాలెం గ్రామంలో జరిగిన 'యజ్ఞం' మొదలు, స్వతంత్ర భారత దేశం మీద జరిగిన 'కుట్ర' వరకూ ఎన్నో ఇతివృత్తాలతో మళ్ళీ మళ్ళీ చదువుకునే కథలు రాసిన కారా మేష్టారు 'మానవ సంబంధాలు' ఇతివృత్తంగా రాసిన కథ 'ఆర్తి.' కథా స్థలం పూర్వపు గంజాం జిల్లా. అక్కడ మనుషుల్లాగే, ఆచారాలు కూడా ఒరియా తెలుగుల కలగాపులగంగా ఉంటాయి. అలాంటి ఊరు చివర ఉన్న పల్లెలో కూతవేటు దూరంలో ఉన్న రెండు కుటుంబాలు బంగారమ్మ, ఎర్రెమ్మలవి. కరువు బారిన పడిన పల్లెలో పండుగ కళ లేకపోయినా, సంక్రాంతికి పట్నం నుంచి ఇంటికొచ్చాడు పైడయ్య. ఎర్రెమ్మ వచ్చి అల్లుడిని పండక్కి పిలవడం కథా ప్రారంభం.

పండక్కి నెల్లాళ్ళ ముందే, సన్నెమ్మని పంపే విషయంలో వీరకత్తెలిద్దరూ జుట్టూ జుట్టూ పట్టేసుకోగా, అత్త మాట వినకుండా అమ్మ వెనుక పుట్టింటికి వెళ్ళిపోయింది సన్నెమ్మ. ఆ కోపం కడుపులో పెట్టేసుకుంది బంగారమ్మ. పండుగపూటా ఆడవాళ్ళిద్దరూ మళ్ళీ తలపడిపోయే పరిస్థితి వచ్చేయడంతో, తను రంగంలోకి దిగి సర్దిచెప్పాడు పైడయ్య పెద్దన్న నారాయుడు. ఇలా లాభం లేదనుకున్న పైడయ్య, సన్నెమ్మని ఒంటరిగా కలుసుకుని ఏం జరిగిందో అడుగుతాడు. తను ఏం చెయ్యాలో చెప్పమంటాడు. ఆ ప్రకారం నడుస్తానంటాడు. "ఇలాటివి ఆడమనిషిని నాన్సెప్పా రాదు. నాన్సెప్పినా ఆ సెప్పినట్టు నువ్ నడారాదు" అని తేల్చేస్తుంది సన్నెమ్మ.

మధ్యేమార్గంగా, ఆమెని మాపిటికి తవిటప్ప గారింటికి ఓపాలి రమ్మంటాడు పైడయ్య. అప్పుడు కూడా ఏమీ మాట్లాడదు ఆమె. పైడయ్య చెప్పినదాంట్లో న్యాయం కనిపిస్తుంది పక్కింటి నరసమ్మకి. సన్నెమ్మకి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తుంది. మొగుడు చెయ్యి దాటిపోకుండా కాసుకోవాలని జాగ్రత్తలు చెబుతుంది. చెవిన పెట్టదు సన్నెమ్మ. ఒళ్ళు ఎర పెట్టి మొగుణ్ణి తెచ్చుకోవడం తనకి చేతకాదని తెగేసి చెప్పేస్తుంది. ఇంటి పరిస్థితులూ, తన పరిస్థితులూ తర్కించుకునే పనిలో పడ్డ పైడయ్య పట్నం వెళ్లి తను సాధిస్తున్నది ఏమిటన్న ప్రశ్న దగ్గర ఆగిపోతాడు.

పండుగ రోజు రాత్రి ఒళ్ళు పట్టని కోపంతో బంగారమ్మ ఇంటి మీదకి యుద్ధానికి వెడుతుంది ఎర్రెమ్మ. అంతే కోపంతో ఉన్న పైడయ్య చిన్నన్న కోటయ్య ఆమె మీద చెయ్యి చేసుకోడమే కాదు, సన్నెమ్మని బెదిరించి తీసుకొచ్చి తమ్ముడికి అప్పగిస్తాడు.అదిగో, అప్పుడు న్యాయం చెప్పమంటూ అసిర్నాయుడు గుమ్మం తొక్కుతుంది ఎర్రెమ్మ. అసిరిబాబు తీర్పు ఏమిటన్నది కథలో చదవడమే బాగుంటుంది. (మనసు ఫౌండేషన్ ముద్రించి, ఎమెస్కో పునర్ముద్రించిన 'కాళీపట్నం రామారావు రచనలు' సంపుటంలో ఉందీ పాతిక పేజీల కథ).

మంగళవారం, సెప్టెంబర్ 30, 2014

చట్టం పని చేసింది!

'చట్టం తన పని చేసుకుపోతుంది' ..మన రాజకీయ నాయకులందరికీ బాగా ఇష్టమైన మాట ఇది. మరీ  ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళకి. వాళ్ళ పాలనలో లొసుగుల్ని ప్రశ్నిస్తూ ఎవరన్నా కోర్టుకి వెళ్ళగానే, ముఖ్యమంత్రులూ, మంత్రులూ టీవీ కెమెరాల వైపు చిరునవ్వుతో చూస్తూ చెప్పే మాట ఇది. చట్టం ఏం చేస్తుందన్నది సామాన్య జనం కన్నా వాళ్లకి బాగా తెలుసన్న భరోసా కనిపించేది ఆ నవ్వులో. ఇకపై, వాళ్ళు అంత భరోసాతోనూ ఆ మాట చెప్పగలరా?

జె. జయలలిత.. ఈ పేరు చెప్పగానే ఎన్నో దృశ్యాలు ఒక్కసారిగా కళ్ళముందు మెదులుతాయి. వెండితెర మీద పొట్టి దుస్తులతో ఆడిపాడిన కథా నాయిక మొదలు, ఎంతటి వారినైనా తన చూపుడు వేలితో శాసించే అధినాయిక వరకూ ఎన్ని పాత్రలో. 'జె అంటే జయరాం కాదు జగమొండి, జగడం' అని చమత్కరించే వాళ్ళు ఉన్నారు. అవును, సినిమా  షూటింగ్ ఫ్లోర్ మొదలు, శాసన సభా వేదిక వరకూ ఆమె జగడమాడని స్థలం లేదు. తన మాటకి ఎదురు చెప్పిన వాళ్ళని ఆమె ఏనాడూ క్షమించలేదు. అవమానించిన వాళ్ళమీద అచ్చం సినిమా ఫక్కీలోనే ప్రతీకారం తీర్చుకోకా పోలేదు.

'ఇదీ నాకథ' పేరుతో సినీ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి రాసుకున్న ఆత్మకథ (లిమిటెడ్ ఎడిషన్) లో 'శ్రీకృష్ణ విజయం' సినిమా నిర్మాణ సమయంలో జయలలితతో పడ్డ ఇబ్బందులు ఏకరువు పెట్టారు. రాజకీయాల్లోకి వస్తూనే, మొదట రాజకీయ గురువు ఎమ్జీ రామచంద్రన్ తో తగాదా. అయన మరణానంతరం రాజకీయ వారసత్వం కోసం రామచంద్రన్ భార్య జానకితో గొడవలు. అటుపై పార్టీ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ లెక్కలేనన్ని వివాదాలు. ప్రతిపక్ష నాయిక హోదాలో, ముఖ్యమంత్రి కరుణానిధితో శాసనసభలో తలపడినప్పుడు తనకి జరిగిన అవమానం, "ముఖ్యమంత్రి హోదాలో తప్ప అసెంబ్లీ లో అడుగుపెట్టను" అన్న ప్రతిజ్ఞ చేయించింది జయలలిత చేత.

నిజానికి ముఖ్యమంత్రి హోదాలో జయలలిత చాలా మంచిపనులే చేశారు. బాలికల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోవడం అన్న సత్యాన్ని పసిగట్టి, చర్యలకి ఉపక్రమించిన మొదటి ముఖ్యమంత్రి ఆమె. మహిళల భద్రత ఆమెకి కేవలం ఉపన్యాసానికి పనికొచ్చే పడికట్టు పదం కాదు. ప్రత్యేకంగా మహిళల కోసమమే పోలీస్ స్టేషన్ల మొదలు, మహిళా పోలీసుల కోసం ప్రత్యేక  శిక్షణ కేంద్రాల వరకూ జయలలిత ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎన్నో. నిన్న మొన్నటి 'అమ్మ' కేంటీన్ల విజయం, అంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి  కూడా స్పూర్తినిచ్చింది.


అయితే మాత్రం? జయలలిత అనగానే రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్న పెంపుడు కొడుకు పెళ్లి వేడుక, 'నడిచే నగల దుకాణం' అనే ముద్దుపేరున్న ప్రియసఖి శశికళ, వందలకొద్దీ పాదరక్షలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే నగలూ... ఇవే మొదటగా గుర్తొస్తాయి. మొన్నటికి మొన్న, "కమల్ హాసన్ అంత భారీ బడ్జెట్ తో సినిమా తీయకుండా ఉండాల్సింది" అని నిష్కర్షగా చెప్పిన గతకాలపు సినీ నాయికే గుర్తొస్తుంది. తను చేసిన పనులేవీ దాచాలనుకోలేదు జయలలిత. అందుకే తన సంపదని దాచే ప్రయత్నం చేయలేదు. తనని తనుగా ప్రజలు అంగీకరించాలని భావించి ఉండొచ్చు బహుశా.

జయలలిత మీదున్న అవినీతి ఆరోపణలు చిన్నాచితకవి కాదు. కేసులూ కాసిని కూసినీ కాదు. ఆమె నామినేషన్ తిరస్కరించబడింది 2001 ఎన్నికల్లో. ఆమె పార్టీ ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో, అనుంగు శిష్యుడు పన్నీరు సెల్వాన్ని ముఖ్యమంత్రిగా నియమించి, తను సుప్రీం కోర్టుకి వెళ్లి మరీ అధికారంలోకి వచ్చారు. తాజాగా, పద్దెనిమిదేళ్ళ నాటి 'ఆదాయానికి మించిన ఆస్తుల' కేసులో కర్ణాటక కోర్టు తీర్పు తర్వాత పదవిని కోల్పోయిన జయలలిత, అదే పన్నీరు సెల్వాన్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు.

కన్నడ నాట పుట్టిన జయలలిత, తమిళ ప్రజల ఆదరాన్ని ఎంతగా చూరగొన్నారు అన్నదానికి గత రెండు మూడు రోజులుగా తమిళనాట జరుగుతున్న పరిణామాలే సాక్ష్యం. అభిమానాన్ని కలిగిఉండడంలోనూ, దాన్ని ప్రకటించడం లోనూ తమిళులది ప్రత్యేకమైన ధోరణి. వారి అభిమానం ఉన్నంత మాత్రాన, జయలలిత తప్పులు ఒప్పులైపోవు. తనను తాను 'పురచ్చి తలైవి' గా అభివర్ణించుకునే ఈ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రికి పోరాటం కొత్తకాదు, నిజానికి ఆమె జీవితంలో ఒక భాగం. ఇప్పుడు కూడా ఆమె నిశ్శబ్దంగా తనకు విధించిన శిక్షని అనుభవిస్తుంది అనుకోడం పొరపాటు. అలా చేయడం ఆమె స్వభావం కానేకాదు.

'చట్టం తనపని తను చేసుకుపోతుంది' అని జయలలిత చాలాసార్లే చెప్పారు. ఆలస్యంగానే అయినా, చట్టం తన పని తను చేసింది. దేశంలో కోర్టు తీర్పు కారణంగా పదవి కోల్పోయిన తొలి ముఖ్యమంత్రి జయలలిత. చట్టాన్ని గురించి ఇదే మాటని మన రాజకీయ నాయకులు చాలామందే చెబుతున్నారు. వాళ్ళలో చాలామంది మీద కోర్టు కేసులు పెండింగులో ఉన్నాయి. వాళ్ళందరి విషయంలోనూ కూడా చట్టం తనపని తను చేసుకుపోయే రోజు త్వరలోనే రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా, వ్యవస్థ మీద ఆ వ్యవస్థలో ఉన్న ప్రజలకి నమ్మకం, గౌరవం పెరగడానికైనా ఇలా జరగడం తక్షణావసరం.