ఆదివారం, మే 04, 2014

'కుల' సమరం

అధికారికంగా కొత్త రాష్ట్రంగా అవతరరించడానికి కొద్ది రోజులు ముందుగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. పది జిల్లాలు మరో రాష్ట్రంగా వేరు పడ్డాక, మిగిలిన జిల్లాలతో 'రెసిడ్యుయల్ ఆంధ్రప్రదేశ్' గా రూపాంతరం చెందిన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో పోటీ రెండు ప్రధాన కులాల మధ్య జరుగుతోంది. వీటిలో ఒకటి కోస్తా ప్రాంతంలో బలమైనది కాగా, మరొకటి 'సీమ' ప్రాంతంలో శక్తివంతమైనది. అత్యంత సహజంగానే ఇద్దరి దృష్టీ 'గెలుపు' మీదే ఉంది.

నిజానికి, ఎన్నికల్లో కులాల మధ్య పోటీ కొత్త విషయం కాదు. మన రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలో ఇవాల్టికీ ఓటర్లని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఈ 'కులం.' అయితే, ఇప్పుడు కొత్త రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు మాత్రం పోటీ పడుతున్న ఇద్దరికీ కూడా అత్యంత ముఖ్యమైనవి. నిజం చెప్పాలంటే, ఇద్దరికీ కూడా గెలవడానికి ఇదే మంచి తరుణం. ఇప్పుడు గెలవలేక పొతే ఇద్దరికీ కూడా భవిష్యత్తు అగమ్యగోచరమే.

పోటీ పడుతున్న ఇద్దరూ కూడా అధికారాన్ని అనుభవించిన వారే. ఒకరు ప్రత్యక్షంగా, మరొకరు పరోక్షంగా. ఇద్దరూ కూడా అనునాయిలకి అనేకానేక మేళ్ళు చేసిన వాళ్ళే. ఇద్దరికీ కూడా చట్టాలంటే పెద్దగా గౌరవం ఉన్నట్టు కనిపించదు. కాకపొతే, ఒకరు వ్యవస్థలని 'మేనేజ్' చేయగలరు. మరొకరు అలా చేయాల్సిన అవసరం ఉందని కూడా అనుకోరు. ఇద్దరూ కూడా చెట్టు పేరుని యధేచ్చగా వాడుకుంటున్న వాళ్ళే. అయితే ఆ చెట్లకి ఉన్న తొర్రలు, వేరు పురుగుల గురించిన విషయాలని మాత్రం ఒకరివి మరొకరు బయట పెట్టుకుంటున్నారు.

ఇవి మాత్రమేనా? ఎదుటి వారికి సంబంధించిన ఏ ఒక్క విషయమూ బయట పెట్టకుండా మిగల్చడం లేదు. ఫలితం, ఇద్దరి గోత్రాలూ ఇప్పటికే ఓటర్లందరికీ కరతలామలకం. ఇద్దరికీ చేతిలో ప్రసార సాధనాలు ఉన్నాయి. ఇవి కూడా ఒకరికి పరోక్షం, మరొకరి దగ్గర ప్రత్యక్షం. ఇవి ఇప్పటికే ఇద్దరి చరిత్రలనీ కూలంకుషంగా, ఫోటోలు, వీడియోల సహితంగా చూపించాయి, చూపిస్తూ ఉన్నాయి. మీట నొక్కితే చాలు, సమస్త సమాచారమూ లభ్యం! హామీలు ఇవ్వడంలో కూడా ఇద్దరిలో ఎవ్వరూ తగ్గడం లేదు. పాలనానుభవం పుష్కలంగా ఉన్నవారూ, దాన్ని సంపాదించాలని ఆరాట పడుతున్న వాళ్ళూ.. ఇద్దరిదీ అదే దారి. ఆ హామీలు ఎంతవరకూ ఆచరణ సాధ్యం అన్నది బహిరంగ రహస్యం.

అవసరార్ధం గుమ్మం తొక్కిన వాళ్ళని ఇద్దరూ కూడా కాదనడం లేదు. ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. ఎప్పుడు ఎవరితో ఎలాంటి అవసరం పడుతుందో తెలియదు కదా. అందునా కీలక సమయం మరి. బరిలో గుర్రాలని మాత్రమే దింపాలన్న శషభిషలు కూడా ఇద్దరిలో ఏ ఒక్కరికీ లేవు. నిలబెట్టినదాన్నే గుర్రమని ప్రచారం చేయగల సాహసం, అందుకు సాయపడే సాధన సామగ్రీ ఇద్దరి దగ్గరా కూడా పుష్కలం మరి. గెలుపు గురించి వాళ్లకి భయం వేసినప్పుడల్లా, అవతలి వాళ్ళని బూచిగా చూపించి ఓటర్లని భయపెట్టే పని పెట్టుకుంటున్నారు ఇద్దరూ కూడా.

ఈ ఎన్నికలే ఎందుకు కీలకం మరి? మరో ఐదేళ్లకి మరింతగా పాతబడిపోతారు అన్నది ఒక కారణం అయితే, ఇప్పుడు గద్దెనెక్కిన వాళ్ళకే కొత్త రాష్ట్రం నిర్మాణ బాధ్యతలు అందుతాయి అన్నది రెండో కారణం. మొదటి కారణం వాళ్లకి ముఖ్యమైనది అయితే, రెండో కారణం వాళ్ళ అనుచరులని చాలా ముఖ్యమైనది. ఎప్పుడో తప్ప వచ్చే అవకాశం కాదు కదా. ఇరు పక్షాల్లోనూ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లూ, వ్యాపారవేత్తలూ ఉన్నారు. వాళ్లకి బోలెడన్ని వ్యాపార అవసరాలు ఉన్నాయి. అవి నాయకుల వల్ల మాత్రమే నెరవేరుతాయి. ఆ నాయకులకి అధికారం దక్కినప్పుడు మాత్రమే నెరవేరతాయి. అదృష్టం ఎవరి పక్షాన ఉన్నది అన్నది కొద్ది రోజుల్లో తేలబోతోంది..

2 కామెంట్‌లు:

  1. ఎన్నికలు నాకిష్టం. ఎందుకంటే అవి మన భారతీయుల నిజస్వరూపాన్ని నగ్నంగా మనముందు నిలబెడతాయి. దూరపు కొండలు నునుపన్నట్లు విదేశాలవాళ్ళు ఇక్కడికి ఎన్నికల పరిశీలకులను పంపించి, అధ్యయనఫలితాలను తమ దేశాల్లో వాడప్రయత్నించవచ్చుగాక. మన అసలు స్వరూపం మనకు తెలీదా? దాన్ని ఐదేళ్ళకొకసారి బయటకుతెచ్చే ఎన్నికలంటే నాకు అందుకే చాలా ఇష్టం.

    రిప్లయితొలగించండి
  2. @Iconoclast: Sad but true, true but sad.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి