బుధవారం, జులై 02, 2014

కృష్ణవేణి-1

బురద రోడ్డు మీద కీచుమంటూ రిక్షా ఆగిందో లేదో, "క్రిష్ణవేనొచ్చేసింది రోయ్" అంటూ కోలాహలం మొదలయ్యింది పెంకుటింట్లో. వర్షపు జల్లు కొట్టెయ్యకుండా అడ్డుగా కట్టిన గోనెపట్టాని తప్పించుకుని, చీరకొంగు తలమీదికి లాక్కుంటూ రిక్షా దిగింది కృష్ణవేణి. ఆమెని సాంతమూ దిగనివ్వకుండానే నలుగురు కుర్రాళ్ళు రిక్షాని చుట్టుముట్టేశారు. ఓసారి ఒళ్ళు విరుచుకుని, జాకెట్లో నుంచి పర్సు తీసి, రిక్షా అతనికి డబ్బిచ్చి పంపేసింది.

"ఒచ్చేవా... బేగీ లోనకి రా.. జల్లొచ్చి పడ్డాదంటే సీర తడిసిపోద్ది," ఇంటి అరుగు మీదనుంచి కదలకుండానే పొలికేక పెట్టాడు సత్యమూర్తి. 

నలుగురు కుర్రాళ్ళనీ నవ్వు మొహంతో చూసి, అడుగులో అడుగేసుకుంటూ ఇంట్లోకి నడుస్తూ ఉండగానే ఎదురు జల్లు ముఖానికి కొట్టి రాసుకున్న జాలీ ఫేస్ పౌడర్ కరిగిపోయింది. కట్టుకున్న చౌకరకం గులాబీ రంగు నైలెక్స్ చీర కొంగుతో ముఖాన్ని సుతారంగా తుడుచుకుంటూ "ఇదేం ఊరండీ బాబూ.. ఒక్క రిక్షావోడూ రానంటే రానని గొడవ.. " అంది జనాంతికంగా. గొంతు కాస్త బొంగురుగా ఉంటేనేం, నోటి ముత్యాలు ఏరుకోడానికి బారుతీరి నిలబడ్డారు ఆబాలగోపాలం.

"ఎదవ ముసురట్టేసింది పొద్దున్నే. లేపోతేనా, నా బండేసుకుని ఒచ్చేసేవోడిని," దూరంగా ఉన్న పాకలో దర్జాగా నిలబడ్డ 'సువేగా' ని గర్వంగా చూసుకుంటూ చెప్పాడు సత్యమూర్తి.

"రేయ్.. కృష్ణేనొచ్చేసిందని పంతులు గారికి సెప్పేసి రారా" అని ఓ కుర్రాడికి పురమాయించాడు.

మరచెంబు లో ఉన్న సగం చల్లారిపోయిన టీ ని స్టీలు గ్లాసులో పోసి పట్టుకొచ్చి కృష్ణవేణి కి ఇచ్చాడు 'మేకప్' సత్యం. 

"తాగు.. కూతంత ఎచ్చగా ఉంటాది" అంటూ అవసరం లేకపోయినా నవ్వాడు.

కొంగు వదిలేసి, టీ గ్లాసు పుచ్చుకుంది. నుదుటి మీదకి పడేలా కత్తిరించిన జుట్టు, సవరం పెట్టిన జడలో మూడు మూరల కనకాంబరాలు పొడుగ్గా వేలాడుతున్నాయి. వాటికి పైన చెంప పిన్నుతో గుచ్చిన రెండు కడియం తెల్ల గులాబీలు. ఎత్తు మడమల ప్లాస్టిక్ చెప్పులు గుమ్మం బయటే వదిలేసింది. మెళ్ళో గొలుసు, చేతులకున్న గాజులూ చిలకలపూడివని తెలిసిపోతున్నాయి.

"పెద్దోల్లందరూ ఒచ్చి అడిగితే కాదన్లేక ఒప్పుకున్నాను కానీ, ఎప్పుడూ నాటకాలాల్లేదు బాబా. ఏవౌద్దో ఏటో.." కృష్ణవేణి రెప్పలల్లారుస్తుంటే, భుజం తట్టి ధైర్యం చెప్పాలనుకున్న సత్యమూర్తి, పంతులుగారు రావడం చూసి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. పిచ్చాపాటీ లో ఉన్నవాళ్ళంతా ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. కొంగు భుజం చుట్టూ కప్పుకుంది కృష్ణవేణి. 

"అందరూ వచ్చినట్టేనా?" అడుగుతూ కుర్చీలో కూర్చున్నారు పంతులుగారు. ఆయన చేతిలో అట్టవేసిన ఓ పుస్తకం, కాసిన్ని తెల్లకాగితం ఠావులు ఓ కలం ఉన్నాయి.

"మనం వెయ్యబోతున్న నాటకం పేరు 'పగపట్టిన త్రాచు.' ఎవరెవరు  ఏ పాత్ర వెయ్యాలో ముందే అనుకున్నాం కదా.." అంటూ అందరివైపూ చూశారు. 

"అమ్మా కృష్ణవేణీ..నీది హీరోయిన్ వేషం. ఇద్దరు హీరోయిన్లు ఉంటారు.. కవలపిల్లలు.. రోజా, సరోజ.. రెండూ నువ్వే వేస్తున్నావు. ఇవాల్టినుంచి రిహార్సల్స్ మొదలెడుతున్నాం. నెలన్నర టైం ఉంది. జాగ్రత్తగా చేసుకుంటే మాట పడకుండా నాటకం ఆడొచ్చు.." 

పంతులుగారి మాట పూర్తవుతూనే "పాట్ల గురించి కూడా ఓ మాటనేసుకుంటే బావుంటాది" అన్నాడు సత్యమూర్తి. 

"మొత్తం ఐదు పాటలు పెడదాం.. ఇద్దరు హీరోలకీ చెరో రెండు. ఒక క్లబ్ సాంగ్," ఈసారి కూడా అడ్డం పడ్డాడు సత్యమూర్తి "క్లబ్ సాంగ్ కి రమాదేవిని పిలుద్దారి" అంటూ. నాలుగు పాటల్లోనూ రెండు ఎన్టీ వోడివి, రెండు నాగేసర్రావ్వీ అని నిర్ణయం అయ్యింది.

రమాదేవి పేరు వినగానే కృష్ణవేణి ముఖం ఒక్క క్షణం రంగు మారింది. బయట పడకుండా "మరి నా డైలాగులూ అయ్యీ ఎలాగండీ. పాట్లంటే డేన్సు కట్టాలా? సీర్లూ అయ్యీ నేనే తెచ్చుకోవాలా?" 

ఇంకా ప్రశ్నలు అడిగేదే.. పంతులు గారు ఆపి, "అన్నీ మాట్లాడుకుందాం.. ఇంకా మొదలే కదా.. నీ డైలాగులన్నీ రాసిస్తాను.. ఇంట్లో కూడా చదూకుందువు గాని" అన్నారు. 

"ఆ మాత్రం సదువే ఒత్తే ఈ నాటకాలెందుకు?" ఈ మాట పైకి అనలేదు కృష్ణవేణి.


నట బృందాన్ని చుట్టూ కూర్చోబెట్టుకుని నాటకం మొత్తం చదివి వినిపించారు పంతులుగారు. హార్మోనిస్టు అప్పటికప్పుడే రాగవరసలు అనేసుకుంటున్నాడు. ఇద్దరు హీరోల్లోనూ ఓ హీరో వేషం వేస్తున్న రంగశాయి పంతులుగారు చదువుతున్నదంతా శ్రద్ధగా వింటున్నాడు. అతను మినహా మిగిలిన వాళ్ళంతా కృష్ణవేణి వైపు ఓర చూపులూ, దొంగ చూపులూ సంధిస్తున్నారు. 

రంగశాయిని చూస్తూ "ఏటీ మడిసి?" అనుకుంది కృష్ణవేణి.అప్పుడే అతన్ని పరీక్షగా చూసింది. చామన చాయలో సాదాగా ఉన్నాడు. మరీ పొడవూ, పొట్టీ కాదు. ఎత్తుకి తగ్గ బరువు. పెద్ద పెద్ద కళ్ళు అతని ముఖంలో ప్రత్యేక ఆకర్షణ. 

"రిహార్సల్స్ ఎవ్వరూ మానకూడదు.. అందరూ మనది అనుకుని వేస్తేనే నాటకం బాగుంటుంది. లేకపోతే అందరిముందూ అభాసు అవుతాం," అంటూ సభ చాలించి ఇంటిదారి పట్టారు పంతులుగారు.

"సందలడి పోతంది.. ఉప్పుడేం ఎల్తావు కానీ ఉండిపో కృష్ణేణీ.. కోడి పలావు సెయ్యింతాను.." సత్యమూర్తి చాలా ఉత్సాహపడుతున్నాడు. 

"అమ్మయ్యో.. మా నాన్నగారు కాల్లిరగ్గొడతారు బాబూ.." అంటూ గుండెల మీద చేతులు వేసుకుంది.  

"మీ పలావుకో దండం.. కూతంత ఎవరన్నా మా ఇంటికాడ దింపండి బాబ్బాబు.." కృష్ణవేణి నోరు తెరిచి అడిగినా ఉత్సాహవంతులు ఎవ్వరూ ముందుకు రాలేదు.. 

"మాయావిడి సంపేద్ది.." "మా బాబు గడపలో అడుగెట్నివ్వడు.."' అంటూ తప్పుకున్నారు. 

"ఒరే సాయిగా.. మీ ఇంట్లో ఎవర్లేరు గదరా.. పాపం కృష్ణేన్ని దింపేసి రారా.." రంగశాయి కి పురమాయించాడు సత్యమూర్తి. 

"నిజవే కదరా.. మీ యావిడ కానుపుకెల్లింది. మీయమ్మ ఊల్లో లేదు.. బంపర్ శాన్స్ రా బాబూ," అన్నాడు రెండో హీరో నారాయణరావు.

"గొప్ప మొగోడే దొరికాడు" అనుకుంటూ రంగశాయి సైకిలెక్కింది కృష్ణవేణి.

బురద రోడ్డులో నిమ్మళంగా వెళ్ళమని అందరూ ముక్త కంఠంతో జాగ్రత్తలు చెప్పారు రంగశాయికి. మబ్బులు పట్టడంతో సూర్యాస్తమయం జాడ తెలియడం లేదు. పంట కాల్వలో కప్పలు బెకబెక మంటున్నాయి. ఉండుండి చలిగాలేస్తోంది. ఊసూ పలుకూ లేకుండా సైకిలు తొక్కుతున్న రంగశాయిని ఏమని పలకరించాలో అర్ధం కాలేదామెకి.

ఉన్నట్టుండి సైకిలికి బ్రేకేశాడు రంగశాయి. చుట్టూ చీకటి. నరమానవుడు లేడెక్కడా. ఒక్క క్షణం గుండె గుబగుబలాడింది కృష్ణవేణికి. అదాటున సైకిలు దిగేసింది. 

"ఎనకాల సెక్రం లో గాల్తగ్గింది..నడటం లేదు" అన్నాడు ఆయాసంగా. చిరాకు అణచుకుంది.

"కూతంత ఎదర కూకుంటావా.. ఇంకెంత.. సగం దూరం ఒచ్చేశాం," అన్నాడు.

"తప్పుద్దా" అనుకుంటూ మడ్గార్ మీద కూర్చోబోతుంటే, ఆమెని ఆపి, తన మెడ చుట్టూ ఉన్న తువ్వాల్ని మడ్గార్ కి చుట్టాడు రంగశాయి.

ఒక్క క్షణం అతని వైపు చూసి సైకిలెక్కింది. దీక్షగా సైకిలు తొక్కుతున్నాడు. చీకటి, చలిగాలి, ఆడపిల్ల.. ఇవేవీ కదిలించడం లేదు అతన్ని. తన కాళ్ళకి తగులుతున్న అతని కాళ్ళు, తన చెంపకి తగులుగుతున్న అతని ఊపిరి ఆమెని ఇబ్బంది పెట్టడం లేదు ఎందుకో. 

"ఇక్కడే ఇక్కడే.." ఓ చిన్న బంగాళా పెంకుల ఇంటి ముందు సైకిలు ఆపించింది. చీకటి చిక్కబడింది అప్పటికే. కనీసం సైకిలు దిగకుండా వెనక్కి తిరుగుతున్న రంగశాయిని "లోనకొచ్చి ఎల్లొచ్చు" అంది కృష్ణవేణి.

"అగ్గిపెట్టి కొడితే తాలం తీత్తాను," అంది, జాకెట్లో నుంచి పర్సు తీసుకుంటూ.

గుమ్మంలో ఓ మెత్తని పొట్లం రంగశాయి కాలికి తగిలింది. కృష్ణవేణి వెలిగించిన హరికేన్ లాంతరు వెలుగులో పొట్లం విప్పాడు.  తామరాకులో కట్టిన జాజిపూల దండ, మూడో నాలుగో ఎర్ర గులాబీలు. వాటిని చూస్తూనే ఆమె కళ్ళు మిలమిల్లాడాయి. అప్పుడు చూశాడామెని పరీక్షగా. నల్లటి మనిషి. చిన్న కళ్ళు, కోటేరేసినట్టున్న ముక్కు, పల్చటి పెదాలు. గెడ్డం ఒంపు తిరిగి ఉంది.

"నా బుజాల కాడికొచ్చింది," అనుకున్నాడు మనసులో. 

ఇంట్లోకి వెళ్తూనే వంటగది, పక్కనే పడక గది. "కాసేపు కూకుంటే టీ ఎడతాను" అంటూ మంచం చూపించింది. టీ తాగుతూ ఉండగానే  భోజనం చేసి వెళ్ళమంది. వేడి వేడి అన్నం, కోడిగుడ్డు అట్టు పట్టుకొచ్చింది. 

మాటా పలుకూ లేకుండా తింటున్న రంగశాయిని చూసి, "ఇంట్లో ఆడది తిన్నాదో లేదో కనుక్కోవాలి," అంది కృష్ణవేణి.

ఒక్క క్షణం తబ్బిబ్బు పడినా, మరుక్షణంలో అన్నం ముద్దని ఆమె నోటికి అందించాడు. ఈసారి తబ్బిబ్బు అవడం కృష్ణవేణి వంతు. మరినాలుగు ముద్దలు అయ్యాకా, ఆమె గెడ్డానికి అంటిన మెతుకుల్ని వేలితో తుడవబోతుంటే చెయ్యి పట్టి ఆపేసింది. 

"సేత్తోనే తుడాలా ఏటి?" ఆ నవ్వులో అల్లరి. మబ్బు పట్టిన ఆకాశం నుంచి కుంభవృష్టి మొదలయ్యింది.

(కథ మొదలైంది)

6 కామెంట్‌లు:

  1. కళ్ళకు కట్టినట్టు చూపించారు .. కాదు కాదు రాసారు..

    రిప్లయితొలగించండి
  2. గోదావరి గట్టు మీద కృష్ణవేణి... సాహో...

    రిప్లయితొలగించండి
  3. @శ్రీ: నిజంగానా?!! ధన్యవాదాలండీ.
    @కొత్తావకాయ: అవునండీ, మొదలైంది.. ధన్యవాదాలు.
    @చాణక్య: వావ్.. చదువుతున్నారా!! మరింత జాగ్రత్తగా రాయాలైతే.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  4. @పురాణపండ ఫణి: అవునండీ, గోదారి గట్టుమీదే.. 'తెలుగు' కథ మరి :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి