గురువారం, మే 28, 2015

అరటికాయ ఉప్మా కూర

వర్షాకాలం, శీతాకాలాలతో పోలిస్తే వేసవిలో దొరికే కాయగూరలు బాగా తక్కువ. పైగా, మండే ఎండల్లో మసాలా వంటలు తినడమే కాదు, వండడమూ కష్టమే. ఈకాలంలో దొరికే వాటిలో సాధ్యమైనంత సింపుల్ గా వండుకు తినగలిగే కూరల్లో అరటికాయ ఒకటి. మామూలుగా అయితే నవనవలాడే అరటికాయలు చూడగానే బజ్జీలో, వేపుడో గుర్తొస్తాయి. కూరల్లో అయితే మొదటి ఓటు పులుసుకూరకే. కానీ, వేసవిలో ఇవేవీ కుదరవు. కాబట్టి, ఉప్మాకూర బెస్ట్ చాయిస్. పేరు చూడగానే ఎలా వండాలో ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది కదూ..

ముందుగా ఓ గిన్నెలో నీళ్ళు తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. నీళ్ళు కొంచం వేడెక్కుతూ ఉండగానే కొంచం పసుపు వేసేసుకోవాలి. చేతిక్కాస్త చవుర్రాసుకుని అరటికాయ చెక్కు తీసుకుని, సమంగా ముక్కలు కోసుకుని పొంగుతున్న నీళ్ళలో వేసేయాలి. నీళ్ళు పొంగి స్టవ్ మీద పడకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు. పది నిమిషాల్లో అరటికాయ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. స్టవ్ కట్టేసి, గిన్నెలో మిగిలిన నీళ్ళని వంపేసి, ముక్కల్ని ఆరనివ్వాలి. ఈ పని అయ్యిందంటే, సగం వంట అయిపోయినట్టే.


వండుతున్నది బొత్తిగా మసాలాలు లేని సాత్వికమైన కూర కాబట్టి, అలనాటి 'మల్లీశ్వరి' పాటలు వినొచ్చు. 'మిస్సమ్మ' లేదా 'గుండమ్మ కథ' పాటలైనా పర్లేదు. నాలుగు పాటలు అయ్యేసరికి కూర రెడీ అయిపోతుంది. వంటలో రెండో మరియు చివరి భాగానికి వస్తే, ఉల్లిపాయ పెద్దదయితే ఒకటి, చిన్నవైతే రెండు మరీ సన్నగా కాకుండా తరిగి పెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి ఉప్మా కోసం సిద్ధం పెట్టుకున్నట్టే తరిగి పెట్టేసుకోవాలి. పోపు సరంజామాతో పాటు, నాలుగు కర్వేప రెబ్బలు, ఓ చిన్న నిమ్మకాయ పక్కన పెట్టేసుకుంటే కూర వండేందుకు సిద్ధం అయిపోవచ్చు.

స్టవ్ వెలిగించి, బాండీ వేడెక్కగానే రెండు చెంచాల నూనె వేసి అల్లం ముక్కలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసి సన్న సెగ మీద వేగనివ్వాలి. సగం వేగాక పచ్చిమిర్చి, కర్వేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి గరిటెతో తిప్పాలి. నాలుగైదు నిమిషాలు సన్నని సెగమీదే వేగనిచ్చి, నీళ్ళు వంపేసిన అరటికాయ ముక్కల్ని బాండీ లోకి బదలాయించి బాగా తిప్పాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేం కి మార్చి, బాండీ మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే, కూర మరీ పొడి పొడిగానూ బాగా ముద్దగానూ కాకుండా మధ్యస్తంగా వస్తుంది.


అరటి, ఉల్లి ముక్కల మధ్య బంధాన్ని బలపరచడంతో పాటు, కూరకి రుచి ఇవ్వాలంటే ఉప్పు తప్పనిసరి. తగినంత ఉప్పును కూరంతా జల్లి, మరోసారి బాగా కలిపి, మూత పెట్టి రెండు నిమిషాలు స్టవ్ ని సిమ్ లో ఉంచాలి. మూత తీసి, మళ్ళీ ఓసారి కలిపి స్టవ్ కట్టేయాలి. దీనితో కూర చాలావరకూ పూర్తయినట్టే. పూర్తిగా అవ్వాలంటే మాత్రం, బాండీలో కూర చల్లారే వరకూ ఆగాలి. కూర బాగా చల్లారింది అనిపించుకుని, నిమ్మకాయ సగానికి కోసి, గింజలు తీసేసి, రసాన్ని కూర మీద పిండి బాగా కలిపితే కూర సిద్ధం.

ముందుగా చెప్పినట్టుగా ఇది వేసవికి సరిపోయే సింపుల్ వంటకం. అలా అని మిగిలిన కాలాల్లో చేసుకోకూడదు అనేమీకాదు. అరటికాయ దొరకడమే ఆలస్యం, చేసేసుకోవచ్చు. అన్నంతో పాటు, రోటీలోకీ బావుంటుంది. ముక్కలు ఉడికించేందుకు సరిపడేన్ని నీళ్ళే తీసుకుంటే, ఉడికాక నీళ్ళు వంపే పని ఉండదు. తరిగిన ముక్కలు ముందు చన్నీళ్ళలో వేసి, అటుపై వేన్నీళ్ళలోకి మార్చే కన్నా, అప్పటికప్పుడు తరిగి వేడి నీళ్ళలో వేసేయడం వల్ల ముక్కలు అస్సలు రంగు మారవు. కూర బాగా కలర్ఫుల్ గా రావాలి అనుకుంటే ఉప్పు వేసేప్పుడు మరికొంచం పసుపు జోడిస్తే సరిపోతుంది. పెద్దవాళ్ళతో పాటు పిల్లలకీ నచ్చే కూర ఇది.

శుక్రవారం, మే 22, 2015

దేవర కోటేశు

బాబాలకీ, కరువుకీ ఉన్న సంబంధం ఏమిటన్నది నన్ను తరచూ వేధించే ప్రశ్న. కరువు విలయ తాండవం చేస్తున్న కాలంలోనో, నిత్యం దుర్భిక్షంలో ఉండే ప్రాంతాల్లోనో ఎక్కువమంది బాబాలు అవతరించడం నా ప్రశ్నకి బలాన్నిచ్చే విషయాలు. తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి రాసిన 'దేవర కోటేశు' నవల చదివినప్పుడు నా ప్రశ్నకి జవాబు దొరికినట్టుగా అనిపించింది. సమకాలీన అంశాలనీ, సాంఘిక సమస్యలనీ వస్తువులుగా తీసుకుని ఒడుపుగా కథలల్లే పతంజలి శాస్త్రి రాసిన మూడు నవలల్లోనూ (నవలికలు అనాలేమో) 'దేవర కోటేశు' ఒకటి.

తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో రంగంపేట ఒకటి. నీటివసతి సరిగా లేనందువల్ల వ్యవసాయం వర్షాధారం. రంగంపేటకి సమీపంలో ఉన్న తురకపాలెం 'దేవర కోటేశు' నవలలో కథాస్థలం. ఏళ్ళ తరబడి వర్షాలు కురవకపోవడం, ఒకటీ అరా తుపాను తప్ప వర్షపు చుక్క రాలకపోవడంతో తురకపాలెంలో నేల నెర్రెలు తీసింది. ఊరికంతకీ ఆధారమైన పెద్ద నీటి చెరువు ఏనాడో ఎండిపోయింది. వ్యవసాయం లేదు. కూలి పనులూ లేవు. ఇతరత్రా పనులు దొరికే మార్గం లేదు. జనంలో బతుకుభయం నెమ్మది నెమ్మదిగా పెద్దదవుతున్న కాలంలోనే తురకపాలెం లో 'కోటేశు సామి' వెలిశాడు. ఆ ఊరి కుర్రాడు కోటేశ్వర రెడ్డి అనారోగ్యంతో మరణించి అప్పటికింకా ఏడాది పూర్తి కాలేదు.

అనకాపల్లికీ అడివికీ మధ్య ఉన్న ప్రాంతం నుంచి తురకపాలెం వలస వచ్చిన వెంకటమ్మ కోటేశ్వర రెడ్డికి ఇంటిపనుల్లో సాయం చేస్తూ ఉండేది. రెడ్డి చనిపోయిన నాటినుంచీ అతని తల్లితో సమంగా అతన్ని తల్చుకుని బాధ పడింది. కోటేశ్వర రెడ్డి కాలంచేసిన తర్వాత సరిగ్గా పది నెలలకి రామాలయం ముందు నుంచి వెళుతూ స్పృహ తప్పి పడిపోయింది వెంకటమ్మ. కోటేశు ఆమె ఒంటి మీదకి వచ్చాడన్న వార్త ఊరంతా పొక్కిపోయింది. కోటేశు అవతార పురుషుడనీ, తప్పకుండా ఊళ్ళో వానలు కురిపిస్తాడనీ నమ్మడం మొదలుపెట్టారు జనం. రానురానూ ఇలా నమ్మే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో కోటేశుకి ఓ గుడి నిర్మించారు అతని ఇంటిముందే. తండ్రిలేని కోటేశుని చిన్నాన్న పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడాయన కోటేశు భక్తులందరికీ 'చిన్నాన్న రెడ్డి గారు.'


చిన్నాన్న రెడ్డి గారితో పాటు, రాయుడు గారు, చౌదరిగారు, స్కూలు మేష్టారు బళ్ల సూర్య చక్రం, శాస్త్రి గారు, కిరాణా కొట్టు సుబ్బారావు కోటేశు దేవర కమిటీ సభ్యులు. రోజులు గడిచే కొద్దీ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా భక్తుల రాక మొదలవుతుంది. ముడుపులు కట్టే వాళ్ళు, మొక్కులు చెల్లించే వాళ్ళు పెరుగుతారు. ఊరు యాత్రాస్థలి అవుతుంది. సూర్యచక్రం గారు కోటేశు దేవర మహిమలతో పాటలు, జీవిత చరిత్ర పుస్తకం రాస్తే, కోటేశు స్నేహితులు అతని ఫోటోలని ప్రింట్లు వేయించి అమ్మకానికి పెడతారు. ఏటేటా కోటేశు దేవర సంబరాలు కూడా మొదలవుతాయి. కానీ, జనం ఎంతగానో ఎదురుచూస్తున్న వర్షం మాత్రం ఆ ఊరిని పలకరించలేదు.

'ఇదిగోపులి అంటే అదిగో తోక' అనే మానవ మనస్తత్వాన్నీ, చుట్టూ పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు ఏదో ఒక ఆలంబనని వెతుక్కునేందుకు మనుషులు చేసే ప్రయత్నాలనీ నిశితంగా చిత్రించిన నవల ఇది. అల్లరి చిల్లర జీవితం గడిపిన కోటేశ్వర రెడ్డిని ఓ దైవంగా చిత్రించేస్తారు జనం. "మనతో కలిసి మందు కొట్టే వోడు.. ఆడు దేవుడేంట్రా" అని వాళ్ళలో వాళ్ళు గుంజాటన పడే మిత్రబృందం కూడా పైకేమీ మాట్లాడరు సరికదా, కోటేశు దేవర లీలల గురించి వాళ్ళూ ప్రచారం మొదలుపెడతారు. ఇక, కోటేశు దేవర మహాత్యాలని వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వాళ్ళకీ కొదవలేదు.

ఈ నవలలో కోటేశుతో సమ ప్రాధాన్యం ఉన్న ఓ మిస్టిక్ కేరక్టర్ 'మూగిది.' ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలీదు. ఎండిపోయిన ఊరి చెరువు గట్టు మీద మొదటిసారిగా ఊరి జనం కంట పడుతుందా పిల్ల. ఆ ఊళ్లోనే పెరిగి పెద్దదవుతుంది. ఆమె కళ్ళముందే కోటేశు మహత్యాలు ఒక్కొక్కటిగా బయట పడతాయి. భజనలు, గుడి, మొక్కులు, ఆ వెనుక జరిగే వ్యాపారాలు వీటన్నంటికీ నిశ్శబ్ద సాక్షి మూగిది. ఇంతకీ తురకపాలెంలో వర్షం కురిసిందా? మూగిది ఏమయ్యింది? తదితర ప్రశ్నలకి జవాబులిస్తూ ముగుస్తుందీ నవల. చదువుతున్నంతసేపూ ఒకే కథగా అనిపించి, చదవడం పూర్తిచేశాక అనేకానేక కథలుగా అనిపించడం 'దేవర కోటేశు' ప్రత్యేకత. పతంజలి శాస్త్రి మరో నవల 'హోరు' తో కలిపి 'దేవర కోటేశు'ని ప్రచురించారు. (పేజీలు 192, వెల రూ. 90, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

మంగళవారం, మే 12, 2015

వంశీకి నచ్చిన కథలు - 2వ భాగం

"వంశీకి నచ్చిన కథలు మొదటి భాగం సక్సెస్ అయ్యింది. రెండో భాగం వెయ్యమని మిత్రులు చాలా ఎంకరేజ్ చేశారు" అంటూ మొదలైన వంశీ ముందుమాటలో 'సక్సెస్' అన్న మాట దగ్గర ఆగాను ఒక్క క్షణం. సక్సెస్, ఫెయిల్యూర్ అన్నవి 'కమర్షియల్' సాహిత్యానికి మాత్రమే వర్తించే మాటలని నా అభిప్రాయం. వైవిద్యభరితమైన కథలని ఏర్చి కూర్చి అందించిన కారణంగా 'వంశీకి నచ్చిన కథలు' ఎక్కువమంది పాఠకులని చేరిందన్నది నిజం. దీనిని 'సక్సెస్' అనే అనాలా?? రెండో భాగంలో చేర్చిన యాభైరెండు కథలనీ చదువుతున్నంతసేపూ ఈ ఆలోచన వెంటాడుతూనే ఉంది.

వంశీని గురించీ, సాహిత్యంలో వంశీ అభిరుచిని గురించీ ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏమీలేదు. తనకి నచ్చిన కథలతో ప్రచురించిన సంకలనానికి కొనసాగింపుగా వేసిన ఈ తాజా సంకలనంలోనూ 'వంశీ మార్కు' చాలా చోట్లే కనిపించింది. రెండు భాగాల మధ్యా పోలిక రావడం అనివార్యం. మొదటి భాగంతో పోల్చినప్పుడు రెండో భాగంలో కథల ఎంపిక విషయంలో వంశీ పెద్దగా శ్రద్ధ చూపలేదేమో అన్న సందేహం కలిగింది కొన్ని కథలు చదువుతూ ఉన్నప్పుడు. 'ఏవైనా మొహమాటాల వల్ల ఈ కథని సంకలనంలో చేర్చి ఉంటారా?' అనే సందేహాన్ని కలిగించిన కథలూ ఉన్నాయి.

శిరంశెట్టి కాంతారావు 'అడవి లోపల' కథతో మొదలైన ఈ సంకలనం కె.వి.యెస్. వర్మ రాసిన 'సుఖం' కథతో పూర్తయ్యింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కథల్లో నిలుస్తుంది 'అడవి లోపల.' వంశీ తీసిన 'అన్వేషణ' సినిమా గుర్తురాక మానదు ఈ కథ చదువుతుంటే. అడవి నేపధ్యంలో సాగే కథలలో  ఈతకోట సుబ్బారావు రాసిన 'కాశీబుగ్గ,' గోపిని కరుణాకర్ రాసిన 'కుమారధార తీర్ధంలో సాధువు,' జి. ఆర్. మహర్షి రాసిన 'పురాగానం,' ఒమ్మి రమేష్ బాబు రాసిన 'మంచులోయ' గుర్తుండిపోతాయి. సి. వేణు రాసిన 'నవ్విన దాన్యరాసి' అడివంచు పల్లెలో జరిగిన ప్రేమకథ. రాయలసీమ మాండలీకంలో సాగే ఈ కథ వెంటాడుతూనే ఉంటుంది.


నిజానికి, 'వెంటాడే' కథల జాబితాలో మొదటగా చెప్పుకోవాల్సింది కె. సదాశివరావు రాసిన 'చలిమంటలు' కథని గురించి. ఊహాజనితమైన కథలో వర్తమాన కవులనీ, కథకులనీ పాత్రలుగా చేసి ఆద్యంతం ఆసక్తికరంగా నడిపారు రచయిత. బుచ్చిబాబు రాసిన 'కవిరాజ విరాజితము' కథతో రేఖామాత్రపు పోలిక కనిపించే ఈ కథ కవిత్వాన్ని ఇష్టపడేవాళ్ళని మరింతగా ఆకట్టుకుంటుంది. ఎ. పుష్పాంజలి 'అవిభాజ్యం,' డాక్టర్ ఎమ్. హరికిషన్ రాసిన 'చూపు,' వి. అశ్వినీ కుమార్ 'పారిజాతం,' జయప్రభ 'రసఝారీ యోగం' కథలు చాలాకాలం పాటు గుర్తొస్తూనే ఉంటాయి.

దళిత స్త్రీవాదం నేపధ్యంగా వినోదిని రాసిన కథ 'ఒక విలన్ ఆత్మహత్య.' పేరులో చెప్పినట్టే విలన్ ఆత్మహత్యని నాయిక సమస్యకి పరిష్కారంగా చిత్రించారు రచయిత్రి. సామాన్య రాసిన 'మహిత' కథ నిడివిలో పెద్దదయినా ఆపకుండా చదివించే కథనం వల్ల పేజీలు  చకచకా తిరిగిపోతాయి. ఆదర్శ పురుషుణ్ణి చిత్రించిన కథ పాలకొడేటి సత్యనారాయణ రావు రాసిన 'ఏరు దాటిన కెరటం.' చక్కని ఎత్తుగడతో ఆరంభమై ఊహకందని ముగింపుని చేరుకుంటుంది. మనస్తత్వ చిత్రణకి పెద్ద పీట వేసిన కథలు పాలగుమ్మి పద్మరాజు రాసిన 'ఎదురుచూస్తున్న ముహూర్తం,' పూడూరి రాజిరెడ్డి రాసిన 'మరణ లేఖలు,' శ్రీకంఠమూర్తి రాసిన 'జాతర,' 

తిలక్ రాసిన 'ఆశా కిరణం' కథని గుర్తుచేస్తూ సాగే కథ పురాణం శ్రీనివాస శాస్త్రి రాసిన 'ఎన్నెన్నో ఆత్మహత్యలు.' ఎ.ఎన్. జగన్నాధ శర్మ 'నాన్నంటే,' కె. వరలక్ష్మి రాసిన 'ప్రస్థానం' కథలు వ్యవస్థ పనితీరుని ప్రశ్నిస్తాయి. స్వీయ రచన 'వెన్నెల నీడలో వాసంతి' కి చోటిచ్చారు వంశీ ఈ సంకలనంలో. మెహర్ కథ 'రంగు వెలిసిన రాజుగారి మేడ' మీద వంశీ ప్రభావం ఉన్నట్టే అనిపిస్తుంది. మొత్తం మీద చూసినప్పుడు కొన్ని కథల ఎంపిక విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకుంటే 'వంశీకి నచ్చిన కథలు' తో సమంగా నిలబడేది ఈ సంకలనం. వైవిధ్యభరితమైన ఇతివృత్తాలతో సాగే కథల్ని ఒకే సంకలనంలో కోరుకునే పాఠకులకి నచ్చే పుస్తకం ఇది. (సాహితి ప్రచురణలు, పేజీలు  400, వెల రూ. 300, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

గురువారం, మే 07, 2015

రోడ్డెవరి సొత్తు?

"ఉండడానికి  ఇల్లు లేనంత మాత్రాన రోడ్డు మీదో ఫుట్పాత్ మీదో నిద్రపోవడమే? మాబాగా అయ్యింది వాళ్లకి. మధ్యలో మా హీరోనే అనవసరంగా కేసుల్లో ఇరికించారు. అలగావాళ్ళు ఎలా పోయినా ఎవరికీ నష్టంలేదు కానీ, మా హీరో జైలుకి వెళ్తే షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాల మాటేవిటి? వాటిమీద పెట్టిన వందల కోట్ల పెట్టుబడుల మాటేవిటి?" బాలీవుడ్ సినిమా పరిశ్రమతో పాటు, సల్మాన్ ఖాన్ అనే వెండితెర కథానాయకుడి అభిమానులని వేధిస్తున్న ప్రశ్నలివి.

ఇప్పటికి పదమూడేళ్ళ క్రితం సదరు సల్మాన్ ఖాను ముంబాయి మహానగరంలో ఓ పంచనక్షత్రాల హోటల్ నుంచి అర్ధరాత్రి వేళ తన కారులో బయల్దేరి, మితిమీరిన వేగం కారణంగా స్టీరింగ్ మీద కంట్రోల్ కోల్పోయి కారుని రోడ్డు పక్కనే ఉన్న బేకరీలోకి మలుపు తిప్పినప్పుడు, బేకరీని ఆనుకుని ఉన్న పేవ్ మెంట్ మీద నిద్రపోతున్న ఐదుగురూ కారు కింద పడిపోయారు. ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, మిగిలిన నలుగురూ ప్రాణాలు మాత్రం దక్కించుకున్నారు. పదమూడేళ్ళ సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు సల్మాన్ ఖాన్ ని దోషిగా నిర్ధారించి ఐదేళ్ళు జైలుశిక్ష విధించింది.

కోర్టు తీర్పు తర్వాత బాలీవుడ్ చిత్రపరిశ్రమ అత్యంత సహజంగానే సల్మాన్ కి మద్దతు ప్రకటించింది. అక్కడితో ఆగకుండా, ఓ అడుగు ముందుకు వేసి రోడ్డు ఎవరి సొత్తూ కాదనీ, కుక్కలకి తప్ప మనుషులెవరికీ రోడ్డు మీద పడుకునే హక్కు లేదని తేల్చి చెప్పింది. సల్మాన్ అభిమానులు చాలామంది ఈ వాదనతో గొంతు కలిపి ఫుట్ పాత్ ని "వాళ్ళబ్బ సొత్తు" గా భావించుకుని యధేచ్చగా నిద్రపోయిన వాళ్ళని సోషల్ మీడియాలో శాపనార్ధాలు పెడుతున్నారు. వీళ్ళంతా ఉన్నతాదాయ లేదా మధ్యతరగతి భద్ర జీవులని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

అయ్యలారా, అమ్మలారా.. ఫుట్ పాత్ మీద నిద్రపోవడం అంటే ఇల్లు అనేది లేకపోవడం. ఇల్లంటే రెండు మూడు బెడ్రూములు, ఏసీ వగయిరా సౌకర్యాలున్నదే కాదు.. కనీసం తలదాచుకోడానికి పైకప్పుతో ఉన్న ఆరేడుగజాల స్థలం. ఆమాత్రం స్థలం లేనివాళ్ళు ఈ దేశంలో చాలామందే ఉన్నారు. హీరోల కార్లకి అడ్డం పడడం వాళ్ళ హాబీ కాదు. అందువల్ల వాళ్లకి పోయేదే తప్ప కలిసొచ్చేది ఏదీ ఉండదు. మీరు చెబుతున్నట్టుగా కుక్కలు మాత్రమే తిరగాల్సిన రోడ్లని బెడ్రూములుగా ఉపయోగించుకుంటున్నారంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆలోచించండి.

మీక్కొంచం కష్టమైన పనే కానీ, వాళ్ళెవరికీ ఇల్లు లేని పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా మీ విలువైన సమయాన్ని కొన్ని క్షణాలు వెచ్చించి ఆలోచించండి. ఉన్న ఊళ్ళో సంపాదన లేక, నగరంలో పని దొరుకుతుందని వచ్చారు వాళ్ళు. నగరంలో సంపాదన కూడా కనీసావసరాలు తీర్చుకోలేనిదిగా ఉంది వాళ్లకి. అందుకే, తలదాచుకుందుకు చోటు దొరక్క రోడ్డు మీద పడుకున్నారే తప్ప, హీరో గారి కారుకింద పడి వార్తలకెక్కుదామని కాదు. అతగాడి మీద వాళ్ళకేమీ పాతకక్షలూ లేవు. అది హీరోగారు ఒళ్ళు మరిచి కారు నడుపుకునే దోవ అనీ, సమయమనీ ముందుగా తెలిసుంటే వాళ్ళే జాగ్రత్త పడి ప్రాణం రక్షించుకునే వాళ్ళేమో. 

వెండితెర వేలుపులు చమటోడ్చి సంపాదిస్తున్నారు నిజమే. కానీ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సక్రమంగా చెల్లిస్తున్న వాళ్ళు ఎందరు? నలుపు తెలుపుల సంపాదనలో కనీసం తెల్లధనం మీద కూడా పన్ను చెల్లించకుండా కాలం గడిపేస్తున్న వాళ్ళు ఎందరు?? వీళ్ళే సక్రమంగా పన్నులు చెల్లిస్తే, అలగావాళ్ళ బతుకులు ఏమాత్రమన్నా బాగు పడేవేమో కదా. వాళ్ళిలా వేళాపాళా లేకుండా గొప్పవాళ్ళ కార్లకి అడ్డం పడేవాళ్ళు కాదేమో మరి. అయ్యా అభిమానులూ, అలగావాళ్ళని ఆడిపోసుకునే ముందు, సక్రమంగా పన్నులు కట్టమని మీ అభిమాన తారలకి చెప్పగలరేమో ప్రయత్నించండి.

జనం మీదకి కార్లు పోనిచ్చిన హీరోలకీ, కాల్పులు జరుపుతున్న పోలీసులకీ జేజేలు పలుకుతున్న భద్ర జీవులారా.. మీ ఆలోచనలు సరైనదోవలోనే వెళ్తున్నాయా అన్నది ఒక్కసారి సరిచూసుకోండి. భద్ర జీవితానికి వెలుపల ఉన్నవాళ్ళని మనుషులుగా చూసి, వాళ్ళ వైపునుంచి కనీసం ఆలోచించే ప్రయత్నం చేయండి. వాళ్ళూ 'మనుషులే' అన్నది మర్చిపోకండి. ఇంతకీ ఒకందుకు మాత్రం సదరు సల్మాన్ ఖానుని అభినందించక తప్పదు. క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగులో అడ్డగోలుగా దొరికిపోయిన ఆటగాళ్ళ మొదలు, దొరికిన పుస్తకాన్ని ఇష్టం వచ్చినట్టు "రివ్యూ" చేసేసే 'మేధావుల' వరకూ అవకాశం ఉన్నవాళ్ళు అందరూ అడ్డం పెట్టుకుంటున్న 'మైనారిటీ' కార్డుని అవకాశం ఉన్నా వాడుకోనందుకు సల్మాన్ ని మెచ్చుకోవాల్సిందే..