బుధవారం, మార్చి 23, 2016

రంగులరాట్నం

తూర్పు గోదావరి జిల్లాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే మధ్యలో ఏయే ఊళ్లు దాటాలో, ఆ ఊళ్ళ ప్రత్యేకతలు ఏమిటో వంశీకి బాగా తెలుసు. దీనితో పాటుగా గడిచిన తొంభై ఏళ్ళలో నిత్యావసర ధరల పెరుగుదల, జీవనశైలిలో వచ్చిన మార్పులు.. వీటన్నింటి మీదా అవగాహన ఉంది. రాసే నేర్పుని గురించి ఇప్పుడు ప్రత్యేకం చెప్పనవసరం లేదు కదా. తనకి తెలిసిన/తెలుసుకున్న విషయాలన్నింటినీ వంశపారంపర్యంగా రంగులరాట్నం తిప్పుకునే కుటుంబం కథలో జొప్పించి, బోల్డన్ని సినిమాటిక్ మలుపుల్నీ, తన మార్కు మెలోడ్రామానీ జోడించి వంశీ రాసిన తాజా నవల 'రంగులరాట్నం.'

వర్తమానంలో మొదలై, అనేక ఫ్లాష్ బ్యాకుల్లోకి వెళ్లి, మళ్ళీ వర్తమానంలోకి వచ్చి ముగిసే ఈ నవల బోసిపోయిన కోటిపల్లి తీర్ధంలో మొదలవుతుంది. ఆ తీర్ధంలో రంగులరాట్నం తిప్పుకునే వృద్ధుడైన పట్టాల సోమరాజుని ఓ టీవీ చానల్ బృందం ఇంటర్యూ అడగడంతో, ఆ వృద్ధుడు 1927 లో మొదలు పెట్టి వరసగా జరిగిన అనేక విషయాలని విడతలు విడతలుగా చెప్పుకొచ్చాక, అతడి కథ ఏమైందన్నది ముగింపు. ఈ మధ్యలో అనేక ఉపకథలు. కోటిపల్లి తీర్ధాన్ని గురించీ, చుట్టుపక్కల ఊళ్లు, మనుషుల్ని గురించీ ఎన్నో విశేషాలు, కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు, మరికొంత శ్లాప్ స్టిక్ కామెడీ.

గోదావరి జిల్లాల్లో జరిగే తీర్దాల్లో రంగులరాట్నం తిప్పడం సోమరాజు పూర్వీకుల కులవృత్తి. మగవాళ్ళు రంగులరాట్నం తిప్పితే, షర్బత్లు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అంతే కాదు, ఆడవాళ్ళందరూ వంటలు చేయడంలో - మరీ ముఖ్యంగా మాంసాహార వంటలు చేయడంలో - అందెవేసిన చేతులు. ప్రతి తరంలోనూ ఆ ఇంటికి వచ్చిన కోడలు, అత్తగారి దగ్గర షర్బత్ చేయడం, కూరలు వండడంలో మెళకువలు నేర్చుకుంటుంది మొదట. అలాగే, మగవాళ్ళందరూ అమాయకులు. డబ్బు దాచుకోవాలనే లక్ష్యం లేని వాళ్ళు. రాట్నం తిప్పే పనిలో చేరిన కుర్రాళ్ళని సొంత బిడ్డల్లా చూసుకునే వాళ్ళూను. ఒక్కో తరంలోనూ పేర్లు మారతాయి తప్ప, ప్రవృత్తులు మాత్రం ఇవే.


పేదరికంలో తృప్తిగా జీవిస్తున్న సోమరాజు పూర్వీకుల్లో ఒకరికి, ఒకానొక కోటిపల్లి తీర్ధంలో గోనెపట్టా మాత్రమే కట్టుకున్న ఒరిస్సా సాధువు ఓ వెండి భరిణె ఇచ్చి, రోజూ ఆ భరిణెకి పూజ చేస్తే అదృష్టం పడుతుందని చెప్పి మాయమైపోతాడు. అప్పటినుంచీ, ప్రతి అత్తా తన కోడలు కాపురానికి రాగానే భరిణె అప్పగించి రాబోయే అదృష్టం గురించి చెబుతూ ఉంటుంది. కోడిలిగా ఉన్నన్నాళ్ళూ పూజలు చేసి, అత్త కాగానే తన కోడలికి ఆ భరిణె అప్పగిస్తూ ఉంటుంది. ఆ కుటుంబం అదృష్టం కోసం ఎదురుచూస్తున్న క్రమంలో వాళ్ళ చుట్టూ వచ్చి పడిపోయిన మార్పులు, రంగులరాట్నానికీ, షర్బత్లకీ గిరాకీ తగ్గిపోయి బతుకుతెరువు ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి వచ్చేస్తుంది.

ఈ  ప్రధాన కథలో, బ్రాహ్మణ స్త్రీగా చలామణీ అవుతూ జీవితపు చివరి దశలో తన జన్మ రహస్యం తెలుసుకోవాలని తపించే వేదవతిది ఓ ఉపకథ. ఆమె రహస్యం తెలిసీ, చెప్పి ఆమెని బాధ పెట్టలేని మేడారపు సూరయ్య శాస్త్రిది మరో కథ. రంగులరాట్నం మీద మక్కువతో, ప్రతి ఏడూ కోటిపల్లి తీర్ధంలో రాత్రిపూట మారువేషంలో రహస్యంగా వచ్చి రాట్నం మీద తిరిగే రాణీ గారిది ఇంకో కథ. పొరపాటున చేజారిన భరిణెని వెతుక్కుంటూ సోమరాజు చేసే ప్రయాణంలో ఒక్కో ఊళ్లోనూ ఒక్కో కథ. ఇవన్నీ శ్రద్ధగా, ఆసక్తిగా విని రికార్డు చేసుకున్న టీవీ చానల్ బృందంలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. కొన్ని కథలు చక్కగానూ, మరికొన్ని పర్లేదనిపించేలాగా, ఇంకొన్ని 'బాగా చెప్పొచ్చు కదా' అనిపించేలాగా చెప్పారు వంశీ.

గతకాలపు వైభవం, మరీ ముఖ్యంగా కోటిపల్లి తీర్ధంలో ఆభరణాల మొదలు, గుర్రాల విక్రయాల వరకూ సమస్త వ్యాపారాలూ జరిగిన రోజులు, ఎడ్లబళ్ళు మొదలు రైళ్ళు, డీజిల్ బస్సులు, కార్ల వరకూ ప్రయాణ సౌకర్యాలలో వచ్చిన మార్పులు, మారిన జీవన వ్యయం, పెరిగిన సౌకర్యాలు వీటన్నింటినీ కథలో భాగం చేశారు రచయిత. కథ జరిగేది గోదారి ఒడ్డునే కాబట్టి వంశీ మార్కు గోదారి వర్ణనలకి లోటు లేదు. సినిమా కథలు - మరీ ముఖ్యంగా తన దర్శకత్వంలో వచ్చిన సినిమా కథలు- దాటి ఆలోచించి రాస్తే చాలా మంచి నవల అయి ఉండేదనిపించింది, చదవడం పూర్తిచేశాక. నాటకీయత మీద వంశీకి ఉన్న ప్రేమ అడుగడుగునా కనిపించడమే ఇందుకు కారణం. గత కాలాన్నీ, వచ్చిన మార్పుల్ని గురించీ తెలుసుకోడానికి ఓ సాధనం ఈ 'రంగులరాట్నం.' (సాహితి ప్రచురణలు, పేజీలు  192, వెల రూ. 75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి